NLG: రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 31.12.2025 నాటికి 30 ఏళ్ల వయస్సు, 10 ఏళ్ల అనుభవం ఉన్న చేనేత కళాకారులు; అలాగే, 25 ఏళ్ల వయస్సు, 5 ఏళ్ల అనుభవం ఉన్న డిజైనర్లు అర్హులు. ఆసక్తిగల వారు మార్చి 31 లోపు జిల్లా చేనేత శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
NZB: మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన సుశాంక్ జాతీయ స్థాయి సీనియర్ కబడ్డి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడకారుడు ఎంపికవడంపై జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు పలువురు అభినందనలు తెలిపారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం వటపత్రశాయిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. ప్రధానాలయంలో స్వామివారిని వంటపత్ర శాయి అలంకారంలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించారు. అనంతరం డోలు సన్నాయి, మేళాలతో స్వామివారిని ప్రధాన మాఢ వీధుల్లో ఊరేగించారు.
NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధి 5వ వార్డు పెర్కిట్లో కొత్తగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కౌన్సిలర్ ప్రసాద్, స్థానిక నాయకులతో కలిసి పనుల నాణ్యతను తనిఖీ చేసిన ఆయన, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
KMM: ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ‘నెల నెలా వెన్నెల’ 103వ సాంస్కృతిక సమ్మేళనం జరగనుంది. అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలో హైదరాబాద్ కళాంజలి బృందం ప్రదర్శించే ‘యాగం’ నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కళాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
NGKL: జిల్లా లైసెన్స్ సర్వేయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్నిశుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లేష్, వైస్ ప్రెసిడెంట్గా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా దినేష్, కోశాధికారిగా సురేష్ బాధ్యతలు చేపట్టారు. నూతన అధ్యక్షులు మాట్లాడుతూ..సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
NRML: నిర్మల్ నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతూ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుచాడి శ్రీహరి రావు వినతిపత్రం ఇచ్చారు. వెంగ్వపేట చెరువును సాగునీటి, పర్యాటక ప్రాంతంగా మార్చాలని, వాస్తపూర్ జలపాతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
HYD: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ చిత్రపురి కాలనీలో పర్యటించి సీ అండ్ డీ వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించారు. ట్రాఫిక్ సౌలభ్యం కోసం రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నేక్నంపూర్ చిన్న చెరువు వద్ద అమృత్ 2.0 కాలువ మళ్లింపు పనులను తనిఖీ చేశారు. పాండెనువాగు నుంచి పెద్ద చెరువు వరకు తనిఖీ చేపట్టారు.
SRPT: కోదాడ మండలం దోరకుంట గ్రామంలో రంజాన్ సందర్భంగా శనివారం మసీదు ప్రాంగణంలో శుభ్రత చర్యలు చేపట్టారు. సర్పంచ్ సురేష్ ఆధ్వర్యంలో మసీదు ప్రాంగణాన్ని శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. రంజాన్లో భక్తులు ఎక్కువగా మసీదుకు హాజరవుతారని, అందుకే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని సర్పంచ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
WNP: రేవల్లి మండలం పాత తాండ గ్రామపంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ శ్రీను, ఉప సర్పంచ్ సూర్య, ముగ్గురు వార్డు మెంబర్లు, గ్రామానికి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు కేశంపేట సర్పంచ్ సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వనపర్తి ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు, తదితరులు పాల్గొన్నారు.
NRPT: జిల్లాలో రానున్న వేసవికాలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించి ప్రజల దాహార్తిని తీర్చేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరందించేలా చూడాలని, సమస్యలున్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, మోటార్ల మరమ్మతులు సకాలంలో చేపట్టాలని ఆమె సూచించారు.
WGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర స్థాయి అవార్డులకు అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు TPCC చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మార్చి 31వ తేదీలోపు సంబంధిత జిల్లా చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.
NLG: తెలుగు భాషా బోధనతోనే విద్యార్థులు సమున్నతంగా ఎదుగుతారని చిట్యాల మండలం వట్టిమర్తికి చెందిన టీచర్, డాక్టరేట్ గ్రహీత సాగర్ల సత్తయ్య పేర్కొన్నారు. ఆంగ్ల భాషా ప్రభావంతో మాతృభాష కనుమరుగవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు ఉనికిని కాపాడుకునేందుకు ప్రాథమిక విద్యతో పాటు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు కూడా తెలుగులోనే బోధించాలని సూచించారు.
VKB: ఆలంపల్లి అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిరెడ్డిపల్లి, సంబంధిత తండాలకు వెళ్లే ఈ మార్గంలో గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం. వర్షం లేకపోయినా నీరు నిలవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
VKB: మర్పల్లి మండలంలోని చెరువులు పూడిక నిండి మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతంలో చెరువులు నిండి ఆయకట్టు రైతులకు సాగునీరు సమృద్ధిగా అందేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖల్కోడ, ఘనపూర్, రావులపల్లి గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు.