JGL: వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జైలు శిక్ష తప్పదని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ హెచ్చరించారు. జగిత్యాలలోని కౌన్సిలింగ్ కేంద్రంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి డివిజన్ల వృద్ధుల ఫిర్యాదులపై కొడుకులను పిలిపించి విచారణ చేశారు. తల్లిదండ్రులను పోషించకపోతే 6 నెలల జైలు శిక్ష పడుతుందన్నారు.
మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని టోల్ గేట్ వద్ద టోల్ గేట్ కార్మికులు తమ వేతనాలు చెల్లించాలని శనివారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం వాడి గ్రామానికి చెందిన కళ్యాణ్ సంతోశ్ (44) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కూలీ పనులు చేసుకునే ఆయన కొంతకాలంగా మద్యానికి బానిసయ్యారు. మద్యం మత్తులో ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడినట్లు SI సుప్రియ తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ASF: సిర్పూర్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు గడువును మార్చి15 వరకు పొడిగించాలని రైతులు, నేతలు డిమాండ్ చేశారు. CCI కొనుగోళ్లు నిలిపివేయడంతో ఆందోళన వ్యక్తమైంది. వర్షాలు, కూలీల కొరతతో కోతలు ఆలస్యమయ్యాయని, మాజీ MLA కోనేరు కోనప్ప ఆదేశాలతో BRS నేతలు MRO మధుకర్కి శనివారం వినతిపత్రం ఇచ్చారు. మద్దతు ధరకు విక్రయించే అవకాశం కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు.
HNK: హన్మకొండ జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో ఏటూరునాగారం ITDA ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గిరిజన యువతీ యువకులు ఈ ఉద్యోగ ఎంపిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
MDK: నార్సింగి కస్తూర్బాలో ఖాళీ ఉన్న అసిస్టెంట్ కుక్, స్కావెంజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రత్యేక అధికారి మమత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని, 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలిని, అప్లై చేసే అభ్యర్థి అసిస్టెంట్ కుక్కు 10వ, స్కావెంజర్ 7వ తరగతి పాసై ఉండాలన్నారు.
BHPL: రేగొండ మండలం కొడవటంచలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. వందల ఏళ్ల తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ జరగగా, ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో గర్భాలయంలో పూజలు చేశారు. నూతన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి, గోపురాలపై కలశస్థాపన నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమనికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
SRPT: సమస్యలు చెప్పండి పరిష్కరించే బాధ్యత నాదని సూర్యాపేట మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ దత్త సాయి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఛైర్పర్సన్ కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని సిలార్పల్లి, తిమ్మరాసిపల్లి ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా సిలార్పల్లి సమీపంలోని పొలంలో దాదాపు 30 గొర్రెలపై కుక్కలు దాడి చేసి చంపివేయడం కలకలం రేపింది. అటు పెంపుడు కోళ్లను సైతం వదలకుండా వేటాడుతున్నాయని, అధికారులు కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.
WNP: తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ‘సి.ఎం. కప్ 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా’ టోర్నమెంట్ను శనివారం అట్టహాసంగా ప్రారంభించారు.క్రీడలకు బడ్జెట్లో రూ. 700 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.
RR: నందిగామ గ్రామాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో సమస్యలు లేని గ్రామంగా రూపకల్పన చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని సర్పంచ్ కొమ్ము కృష్ణ అన్నారు. 3వ వార్డు సభ్యులు సురేష్ ఆధ్వర్యంలో కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమస్యలపై పోరాటం చేస్తూ ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
SRCL: వేములవాడ నుంచి కోరుట్ల పట్టణం సమీపంలోని యకీన్ పూర్ వరకు 100 ఫీట్లతో 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరైనట్లు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే వేములవాడ – కోరుట్ల రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించగా.. వేములవాడ నుంచి యకీన్ పూర్ వరకు రోడ్డు నిర్మాణానికి ఈ నిధులు మంజూరు అయ్యాయని విప్ తెలిపారు.
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ రఘు వంశీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలింతలకు, చిన్నారులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కేంద్రంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. పిల్లల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
NGKL: పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. తాడూరు మండలం మేడిపూరులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై, రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.. అర్హులైన పేదవాడికి గృహ నిర్మాణ పథకం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
NLG: అమెరికా సామ్రాజ్యవాద ధోరణులు ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘రెడ్ బుక్ డే’ సందర్భంగా నల్గొండ పట్టణంలోని స్టడీ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో ‘బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం’ అనే పుస్తకాన్ని ఆయన విశ్లేషించారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు.