ASF: సీఎం కప్, 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో కాగజ్నగర్కు చెందిన ముత్తు బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో ముగ్గురు క్రీడాకారులు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. యశ్వంత్ (52–54KGలు), హర్షిత (46-48KG ), శ్రేష్ఠ (44-46KG ) పతకాలు సాధించారు. ప్రతిభ కనబరిచిన విజేతలను కోచ్లు, క్రీడాభిమానులు అభిమానించారు.
నేడు జిల్లాకు ముఖ్యమంత్రి రాక తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ జిల్లాకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు రెడ్యాల గ్రామానికి చేరుకుని, అక్కడి నుంచి 3:00 గంటలకు దేవాదుల ప్రాజెక్టు సందర్శించనున్నారు. ప్రాజెక్టు పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
ASR: అరకు ప్రధమ శ్రేణి జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో మార్చి 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి రాము తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజీపడే అవకాశం ఉన్న కేసులు, లోక్ అదాలత్లో పరిష్కారం కోసం లాయర్లు, పోలీసు అధికారులు అవగాహన కల్పించాలన్నారు
నిర్మల్ జిల్లాలో నూతనంగా సదరం సర్టిఫికెట్లు పొందిన దివ్యాంగులకు త్వరలో పెన్షన్లు మంజూరు కానున్నాయని స్పందన దివ్యాంగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ తెలిపారు. అర్హులైన వారు అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలోని కొత్త దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
AKP: మండల కేంద్రమైన పరవాడలో ఆదివారం పైడిమాంబ అమ్మవారి పండగను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే తానాం గ్రామంలో పరదేశిమాంబ అమ్మవారి పండగను ఘనంగా నిర్వహించనున్నారు. రెండు గ్రామాల్లోనూ మూడు రోజులు పాటు పండగలు జరుగుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పండగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
BHNG: అడ్డగూడూరు మండల పరిధిలోని డి.రేపాక గ్రామ శివారులోని మూసీ నది నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. గ్రామానికి చెందిన లోడంగి శ్రీకాంత్ (29), ముక్కముల మల్లేష్ (25), కన్నా స్వామి (30) నుంచి మూడు ట్రాక్టర్లను అడ్డగూడూరు ఎస్సై వెంకట్ రెడ్డి స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
MDK: పెద్ద శంకరం పేట మండలం కమలాపూర్ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో పశువుల కాపరి మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపుర్కు చెందిన చాకలి బుచ్చయ్య గ్రామ శివారులో శనివారం పశువుల కాయడానికి వెళ్లి అనుమాదాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: దేవస్థానం ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణశాలలో పనిచేస్తున్న అగర్బత్తులు తయారీ కేంద్రాన్ని జీఈఈవో డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. ప్రస్తుతం చామంతి, గులాబీ, తామర సుగంధాలతో మూడు రకాల అగర్బత్తులు తయారవుతున్నాయని, త్వరలో సంపంగి, వెయ్యి వరహాలు, తులసి సుగంధాలతో మరో మూడు రకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
GNTR: గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో సుమారు 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తిని ఒక గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
TG: అడవుల పరిరక్షణ కోసం 2026-27లో రూ.367.59 కోట్లతో రూపొందించిన ప్రణాళికకు అటవీశాఖ ఆమోదం తెలిపింది. 2026-27 వార్షిక ప్రణాళికపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డాక్టర్ సువర్ణ, ఇతర అధికారులు సమగ్రంగా చర్చించారు. అటవీ రక్షణ, నేల-తేమ సంరక్షణ పనులు, వన్య ప్రాణుల ఆవాసాల అభివృద్ధి, టైగర్ రిజర్వ్ కోర్ ప్రాంతాల నుంచి గ్రామాల తరలింపు, పునరావాసం వంటివాటికి ఈ నిధులను వినియోగించనున్నారు.
KMR: జిల్లా DMHO(I/C)గా డా. రవీందర్ గౌడ్ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డా. రవీందర్ నాయక్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. డా. రవీందర్ గౌడ్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి KMRలో RMOగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్రితం డా. దుర్గా రామ్ కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, మళ్ళీ మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు DPH&F తెలిపారు.
JN: జిల్లాలో ట్రాన్స్జెండర్ల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు ట్రాన్స్జెండర్లకు ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున మొత్తం రూ.2.25 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు పునరావాస పథకం కింద 100 శాతం సబ్సిడీతో అందించినట్లు పేర్కొన్నారు
BHPL: జిల్లాలో పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ఉపకార వేతనాలు మంజూరు కావాలంటే విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఇందిర తెలిపారు. BC, EBC విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నా, బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ చేయకపోతే స్కాలర్షిప్ జమ కాదని స్పష్టం చేశారు. ఆధార్ సీడింగ్ త్వరగా చేసుకోవాలన్నారు.
GDWL: జిల్లాకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ఆదివారం రానున్నట్లు కార్యకర్తలు తెలిపారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ చౌరస్తాలో నిర్వహించే సీపీఎం జిల్లా విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరామ్ నాయక్ కూడా హాజరవుతారని జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పేర్కొన్నారు.
VZM: పట్టణంలో స్దానిక కోట వద్ద ఆదివారం ఉదయం 6.30 నుండి 8.30 వరకు హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మునిసిపల్ సహాయ కమీషనర్ కిల్లాన అప్పలరాజు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యాంత్రిక జీవితంతో సతమతమవుతున్న ప్రజానీకానికి మానసిక ఉల్లాసం కలిగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు.