కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిర్వహించే అన్నదాన పథకానికి రాజమహేంద్రవరం వాస్తవ్యులు మిధున్ చక్రవర్తి కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళాన్ని మంగళవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ధాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.
AP: నెయ్యి కల్తీ జరగలేదని వైసీపీ అబద్దాలు ఆడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వస్తోందని, వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులు జరిగినప్పుడు కూడా తాము వారిపై ఆరోపణలు చేయలేదన్నారు. నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచి కూడా తయారు చేయవచ్చని చూపించినట్లు తెలిపారు. నెయ్యి కల్తీ అప్పటి టీటీడీ పాలకమండలి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
TG: ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న BRS నేత బాల్క సుమన్ను కలిసేందుకు మాజీ మంత్రి KTR బయలుదేరారు. మార్గమధ్యలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ KTRకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన KTR.. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే అని.. ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు నిరాశలో ఉన్నారన్నారు.
HYD సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ ద్వారా దేశ వ్యాప్తంగా భారీ నెట్వర్క్ను ఛేదించారు. 16 రాష్ట్రాల్లో దాడులు చేసి 104 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. వీరిలో బ్యాంకు అధికారులు ఉండటం గమనార్హం. వీరిపై 1,055 కేసులు ఉండగా, ఇప్పటివరకు రూ.127 కోట్ల మోసాలకు పాల్పడ్డారు. నిందితుల నుంచి రూ.36 లక్షల నగదు, 200లకు పైగా మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు.
AP: లిక్కర్ స్కామ్ కేసులో ముప్పిడి అవినాష్రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 26వ తేదీన విచారణ అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. లొంగిపోయిన తర్వాత బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి శ్రీలంకలో తలదాచుకున్నట్లు సమాచారం.
W.G: నరసాపురం పట్టణంలో మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వైఎన్.కళాశాల, సూర్య, గౌతమి, ఆదిత్య, భాస్కర కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పరీక్షల దృష్ట్యా కేంద్రాల పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు.
SS: పుట్టపర్తి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంగళవారం కదిరికి చెందిన ఎస్. ఫరూఖ్ అనే హిజ్రాకు ఐడీ కార్డు నుంచి సర్టిఫికెట్ను జేసీ అందజేశారు. జిల్లాలో అర్హులైన హిజ్రాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే కార్డులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ పథకాలు పొందడానికి ఈ గుర్తింపు కార్డులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
KNR: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రెండు నెలల పాప మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ స్టేజ్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పూసల సంపత్ మాట్లాడుతూ.. అగ్రవర్ణ దురహంకారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.
ELR: గ్రామాలలో ఆదాయ వనరులను గుర్తించి అభివృద్ధికి సహకరించాలని గణపవరం ఎంపీడీవో పివి.సత్యనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శివాజీ, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
PLD: పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శంకరమంచి రాజేశ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష అలంకరణలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకన్నారు.
WNP: జిల్లా సర్వేశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నూతన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ప్రజల భూ సమస్యల పరిష్కారంలో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. భూ సర్వే ప్రక్రియల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని సూచించారు.
ATP: జిల్లా కోర్టుకు నేడు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా ఈ హెచ్చరిక పంపినట్లు కోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్ సహాయంతో న్యాయస్థాన ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పదేపదే ఇలాంటి బెదిరింపులు వస్తుండటంతో న్యాయవాదులు, సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా: పెడన మండలం నందిగామ పంచాయతీలో ఒడ్డు చెరువులో గుర్రపు డెక్క తొలగించే పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కాగిత లక్ష్మీ నాగేశ్వరరావు, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు స్వచ్ఛందంగా కూలీలతో గుర్రపు డెక్క తొలగింపు పనులను చేపట్టారు. గుర్రపు డెక్క తొలగించడంతో నీరు ఒకచోట నిలిచిపోకుండా సాఫీగా ప్రవహిస్తుందని నాగేశ్వరరావు తెలిపారు.
NZB: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మోర్తాడ్ ఉదయ్ని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ తెలిపారు. ఈ రోజు నియమాక పత్రాన్ని అందజేసి ఎస్సీల సంక్షేమం కోసం పాటు పడాలని సూచించారు. ఉదయ్ మాట్లాడుతూ.. ఎస్సీల అభివృద్ధికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.
SKLM: సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన టెంక విశ్వనాథం (36) సోమవారం ఉదయం బూరగాం గ్రామ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొంతు క్యాన్సర్తో బాధపడుతూ… ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురై, మరోవైపు గొంతు నొప్పులు తాళలేక ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు ఉన్నారు.