ATP: కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఆదివారం కంబదూరు మండలంలో పర్యటిస్తారని పార్టీ కార్యాలయ ప్రతి నిధులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం ఎర్రబండ గ్రామంలో వైసీపీ చేపట్టిన లక్ష పోస్టుకార్డుల ఉద్యమంలో పాల్గొంటారన్నారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పట్టాభిషేకం మహోత్సవ ఏర్పాట్లను శనివారం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పరిశీలించారు. రామయ్య కళ్యాణం వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చే క్రమంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఏఎస్పీ తెలిపారు. కళ్యాణ వేదిక భారీకేడ్లు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలను చేశారు.
పల్నాడు: వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతూ ఆదివారం వెల్దుర్తి మండల ప్రజలు ఒకరోజు ఐక్య నిరాహార దీక్ష చేపట్టనున్నారు. జీవో నంబర్ 104 ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించి 25 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని ప్రజలు ఎవరికి వారు వారి సొంత గృహంలోనే నిరాహార దీక్ష చేపట్టాలని వరికపూడిశెల జేఏసీ పిలుపునిచ్చింది.
JN: జనగామ ఐడీఓసీ సమీపంలోని ఇందిరా మహిళా శక్తి కాంటీన్ను తొలగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పాలమకుల చిన్న మంజుల, విజయలక్ష్మి 2025 ఆగస్టు నుంచి ‘వనిత టీ స్టాల్’ నిర్వహిస్తున్నారు. సరైన నోటీసు ఇవ్వకుండా తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారని వారు ఆరోపించారు. ఈ కేసులో ఏప్రిల్ 1 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు తెలిపింది.
తమలపాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తమలపాకులను నీటిలో మరిగించి తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్లు దృఢపడతాయి. వీటిలోని యాంటీసెప్టిక్ గుణాలు చర్మ అలర్జీలను, దురదలను నయం చేస్తాయి. గాయాలపై వీటి రసం రాసి కట్టుకడితే త్వరగా మానుతాయి. భోజనం తర్వాత వీటిని నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
BPT: మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన రాకేష్ కుమార్ అమెరికాలోని జఫర్సన్ ఐన్స్టీన్ మెడికల్ యూనివర్సిటీలో ఇంటర్నల్ మెడిసిన్ MD సీటు సాధించాడు. సంవత్సరానికి సుమారు రూ. 85 లక్షల స్టైఫండ్ పొందనున్నాడు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్థాయి సీటు దక్కించుకున్న ఏకైక విద్యార్థిగా నిలిచాడు.
MLG: వెంకటాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో శనివారం సాయంత్రం SI తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో “ARRIVE AND ALIVE” రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.
ప్రత్యర్థి బ్యాటర్లకు ఆందోళన కలిగించేలా KKR బౌలింగ్లో ఒకప్పటి వైవిధ్యం ఇప్పుడు లేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. వరుణ్ చక్రవర్తి కొత్త దారులు వెతకాలని, నరైన్ వేగవంతమైన బంతులు వేయలేడని పేర్కొన్నాడు. వీళ్లపై భారీ షాట్లు ఆడేందుకు బ్యాటర్లు వెనకాడరని చెప్పాడు. హర్షిత్, ఆకాశ్ దూరమవడంతో మరింత బలహీనపడిన KKRకు హిట్టింగ్ ప్లేయర్లను ఎదుర్కోవడం పెద్ద సవాలేనని అన్నాడు.
NDL: శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి విదేశీ, ఎన్ఆర్ఐ భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం లెక్కింపులో అత్యధిక సంఖ్యలో విదేశీ కరెన్సీ రావడమే అందుకు నిదర్శనం. 624 USA డాలర్లు, 210 UAE దిర్హమ్స్, 10 సింగపూర్ డాలర్స్, 20 ఇంగ్లాండ్ పౌండ్స్, 25 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూరోలు, కువైట్ దినార్లు, కెనడా, న్యూజిలాండ్ డాలర్లు వచ్చాయని అధికారులు వివరించారు.
RR: గిరిజనుల హక్కుల కోసం, అస్తిత్వం కోసం పోరాడే సమయం ఆసన్నమైందని ఈనెల 25న జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి కార్యదర్శి మోహన్ నాయక్ పిలుపునిచ్చారు. షాద్నగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్లో బంజారాలకు స్థానం కల్పించాలని, చేవెళ్ల డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
NLG: నాగార్జునసాగర్ కొండ ప్రాంతం ప్రకృతి సోయగాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పచ్చని అటవీ ప్రాంతం, కొండల మధ్య విస్తరించిన కృష్ణా నది అందాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సాగర్ డ్యామ్ వ్యూ పాయింట్ నుంచి కనిపించే నీటి విస్తీర్ణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొండపై ఉన్న వ్యూ పాయింట్లు, అడవిలోని సహజ దృశ్యాలు ఫొటోగ్రఫీకి అనుకూలంగా ఉంటాయి.
SRPT: జిల్లాలో పలు గ్రామాల్లో గ్యాస్ బుకింగ్ సమస్య తీవ్రంగా మారింది. “గ్యాస్ బుక్ అయింది, త్వరలో డెలివరీ అవుతుంది” అనే మెసేజ్ వస్తున్నప్పటికీ వారం రోజులుగా గ్యాస్ అందడం లేదని, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను సంప్రదించిన వారు స్పందించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా గ్యాస్ సిలిండర్ రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. మీకు ఇలానే వచ్చిందా ? COMMENT
KMR: అగ్ని వీర్ ద్వారా దేశ సైన్యంలో చేరేందుకు అర్హులైన యువత ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. దరఖాస్తులను ఏప్రిల్ ఒకటో తేదీలోగా సమర్పించాలన్నారు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 22 మధ్య ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NZB: తొమ్మిది రోజులుగా రైల్వే ట్రాక్ మరమ్మతులతో మూసి ఉంచిన ఇందల్వాయి రైల్వే గేట్ శనివారం మధ్యాహ్నం తెరుచుకుందని సీనియర్ సెక్షన్ ఇంజినీర్ రవి నాగ శంకర్ తెలిపారు. తొమ్మిది రోజులుగా ధర్పల్లి, సిరికొండ, భీమగల్ మండలాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు శనివారం రైల్వే ట్రాక్ పనులు ముగియడంతో గేటును తెరిచారు.
ELR: అకాల వర్షాల కారణంగా జిల్లాలోని పొగాకు రైతులకు భారీ నష్టం వాటిల్లింది. కోత దశకు వచ్చిన పంట దెబ్బతిని చాపలా మారిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక రోజుల పాటు కష్టపడి సాగు చేసిన పంట ఒక్కసారిగా నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటామని ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు తిరిగి రావని దిగులు చెందుతున్నారు.