KMM: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య నగరంలోని అల్లిపురం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ (UGD) పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత, మన్నిక విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
KNR: జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గుజ్జ గోపాలరావు (45) తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి నీటి పరిస్థితిని పరిశీలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ క్రమంలో పొలంలోనే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వెళ్లేసరికే ప్రాణాలు వదిలాడు.
MNCL: ఈ నెల 27న హైదారాబాద్లో జరిగే కమ్యూనిష్టు పార్టీ వందేళ్ల సభ పోస్టర్లను మంగళవారం శ్రీరాంపూర్లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కోల్ బెల్ట్ కార్యదర్శి బ్రహ్మానందం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన భూమి, భుక్తి, దేశ విముక్తి 1946- 51 వరకు తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిష్టు పార్టీ సాయుధ పోరాటం సాగించిందని తెలిపారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని 30 వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వైస్ ఛైర్మన్ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో BRS కౌన్సిలర్లు బుధవారం మున్సిపల్ కమిషనర్ తిరుపతికి మెమరాండం అందజేశారు. వార్డులలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటుతో, మంచినీటి ఇంటర్ కనెక్షన్లు కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ పేర్కొన్నారు.
JGL: నూతన పాలకవర్గం ప్రజలు ఇచ్చిన అధికారంతో ఎవ్వరిని ఇబ్బందులకు గురి చేయవద్దని, నాయకులుగా కాకండా సేవకులుగా పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. ధర్మపురి మున్సిపల్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 15 వార్డుల్లో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్నారు.
RR: న్యాయవాద రక్షణ చట్టం అమలు కోసం ఆలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రకు చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. న్యాయవాదులు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేయాలనే దృఢ సంకల్పంతో న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
NLG: మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. దూరం, సమీప, కలర్ విజన్, కంటి ఒత్తిడి పరీక్షలు నిర్వహించి, నైట్ విజన్ సమస్యలపై సూచనలు చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ..“డ్రైవర్కు కంటి చూపు స్పష్టంగా ఉండకపోతే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు.
NZB: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వండి పెట్టాలని వర్ని మండలం పైడిమల్ సర్పంచ్ అనూష చిరంజీవి సూచించారు. బుధవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రోజువారీగా విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలని సూచించారు.
BDK: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం మేడారం సమ్మక్క సారలమ్మల ను దర్శించుకున్నారు. ఇటీవల జరిగిన ఇల్లందు మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపొందిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, లతోపాటు కౌన్సిలర్లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమ్మక్క సారలమ్మల దయతో రాష్ట్రం సభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.
KMR: ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకు సంబంధించి అధికారులు ‘సెట్-బీ’ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. మొత్తం 246 మంది విద్యార్థులకు గాను 243 మంది హాజరు కాగా, ముగ్గురు గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.
SRCL: జిల్లాలో డ్రగ్స్, మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో మాదకద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.
ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్ను ప్రధాన్ పురోహిత్ జిల్లా సంఘం నాయకులు పట్టణంలోని ఎంపీ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్చి 15న రామ్ లీలా మైదానంలో నిర్వహించనున్న హీరా సుఖ జయంతి కార్యక్రమం గోడ ప్రతులను ఎంపీ నగేశ్తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.
MHBD: ప్రభుత్వ డిగ్రీ కళాశాల బలోపేతానికి అధిక నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. తొర్రూరు డిగ్రీ కళాశాలలో మార్చి 13వ తేదీన జరిగే జాతీయ సెమినార్కు హాజరుకావాలని ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపల్ ఆహ్వానం అందజేశారు. అనంతరం అడ్మిషన్ కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
MDK: టేక్మాల్ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆర్డీవో రమాదేవి మండల అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలోని వసతులను కళాశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని వారికి సూచించారు. వీరిలో తహశీల్దార్ తులసిరామ్, కళాశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
MBNR: మద్యం సేవించి వాహనాలు నడిపితే జీవితాలు రోడ్డుపాలవుతాయని మహబూబ్నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సీఐ బుధవారం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్ నిర్ణయ సామర్థ్యం తగ్గి ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.