WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఛైర్పర్సన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ ఉద్యోగులతో సమీక్షా సమావేశం జరిగింది. వార్డుల్లో మురికి కాలువల శుభ్రత, దోమల నివారణ ఫాగింగ్, వీధి దీపాల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
BHPL: రేగొండ మండల కేంద్రానికి చెందిన BRS యూత్ నాయకులు శ్రీకాంత్ మాతృమూర్తి తడక రాధమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న BJP జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఇవాళ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
MHBD: తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) సెక్రటరీ వెలుగు మురళిని డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ ఇవాళ సస్పెండ్ చేశారు. సొసైటీ నిధుల దుర్వినియోగం చేశారనే ఫిర్యాదులపై ఇటీవల విచారణ ప్రారంభించారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తుది నివేదిక వచ్చే వరకు విధుల నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
HYD: సికింద్రాబాద్ ఏంఆర్వో ఆఫీస్లో ఆర్డీవో సాయిరాంను బుధవారం మోండా మార్కెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న మారేడ్పల్లి 2BHK లబ్ధిదారుల జాబితాపై చర్చించారు. దీనికి ఆర్డీవో సానుకూలంగా స్పందించినట్లు కార్పొరేటర్ తెలిపారు.
MHBD: జిల్లా వ్యాప్తంగా SFI ఆధ్వర్యంలో ఇవాళ మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ప్రారంభమైనట్లు SFI జిల్లా కార్యదర్శి పట్ల మధు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని MHBD జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓ పాఠశాలలో UTF రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి, SFI జిల్లా కార్యదర్శి మధు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2000 మంది విద్యార్థులకు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు మధు వెల్లడించారు.
MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన గోపాలమిత్ర భవనాన్ని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య ప్రారంభించారు. పాడి రైతులు పశు సంపద పెంచాలని ఈ సందర్భంగా రైతులకు పూజించారు. మండల పశువైద్యాధికారి లక్ష్మీరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు
SRD : యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. గుమ్మడిదలకు చెందిన ఆంజనేయులు, ఆనంద్ల నూతన ఆటోలను ప్రారంభించారు. ఉద్యోగాలకే పరిమితమవకుండా స్వతంత్ర ఉపాధి మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
NGKL: జిల్లాలోని కుమ్మెర జాతరలో రజక కుటుంబంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సీపీఎం నాయకుల బృందం డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పార్టీ నాయకులు టీ సాగర్, నరసింహారావు, స్కైలాబ్ బాబు తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు.
KMM: ఖమ్మం శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివసిస్తున్న 600 పేదల గుడిసెలను జేసీబీలతో కూల్చివేయడాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. కనికరం లేకుండా పేదలపై బలప్రయోగం చేయడం దుర్మార్గమని, కూల్చివేతలు నిలిపివేసి అర్హులకు తక్షణమే ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
JGL: రాయికల్ మండలంలోని భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో IMA ఆధ్వర్యంలో బాలికలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. 115 మంది బాలికలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి అనీమియాతో బాధపడుతున్న 73 మంది బాలికలకు నెలకు సరిపడా మందులు, సానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు హేమంత్, శ్రీనివాసరెడ్డి, అచ్యుత్, సాహితీ, సర్పంచ్ భావన పాల్గొన్నారు.
MDCL: పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో మల్కాజ్గిరి, గౌతంనగర్, ఇందిరానగర్, మౌలాలి, నేరెడ్మెట్ ప్రాంతాల్లోని మసీదులు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. ఉదయం సేహరీతో ప్రారంభమయ్యే దీక్షలు సాయంత్రం ఇఫ్తార్తో ముగుస్తాయి. రాత్రివేళ తరావీహ్ నమాజ్లకు భక్తులు భారీగా హాజరవుతున్నారు. జకాత్, ఫిత్రా ద్వారా అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు.
SRCL: జిల్లాలో ప్రణాళిక ప్రకారం రోడ్డు భద్రతా చర్యలు అమలుచేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. ముందుగా గత నెలలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం సందర్భంగా చర్చించిన అంశాలపై సమీక్ష చేశారు. రవాణా, ఆర్అండ్బీ, NH, పోలీస్ శాఖ సంయుక్తంగా చేసిన సర్వే వివరాలపై ఆరా తీశారు. అన్ని పెట్రోల్ బంక్లలో కచ్చితంగా నో హెల్మెట్ .. నో పెట్రోల్ అమలు చేయాలన్నారు.
VKB: పరిగిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర బుధవారం 1.50 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరు నిందితులు నితీశ్ రఝాక్(22), సూరజ్ కుమార్ (22)ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ నుంచి గంజాయిని పరిగికి తీసుకువచ్చి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న లేబర్లకు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
NLG: జిల్లాలో పైలెట్ పద్ధతిన ఎంపిక చేసిన గ్రామాలలో గృహ జ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న ‘రూఫ్ టాప్ సోలార్ సిస్టం’ ఏర్పాటు పనులను మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కనగల్లో టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో గృహజ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న ‘రూఫ్ టాప్ సోలార్ సిస్టం’ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు.
NZB : జక్రాన్పల్లి మండలం పడకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చందన జాతీయ స్థాయి 46వ సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు గడ్డం శ్రీనివాస్ తెలిపారు. వెస్ట్ బెంగాల్ పోల్బనగర్లో ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు.