NGKL: కల్వకుర్తి పట్టణంలోని మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన జిల్లా యువజన అధికారి కోట నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
KNR: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు ప్రగతి ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (FPO)కు 2025 సం. గాను NCDC భారత ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం “కోఆపరేటివ్ ఎక్సలెన్స్ & మెరిట్-2025″ అవార్డు లభించింది. ఈ అవార్డును HYDలోని TGCAB కార్యాలయంలో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా తీసుకున్నారు.
SDPT: బెజ్జంకి(మం) దాచారంలోని ఉమామహేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సర్పంచ్ బైరా మానస ఆధ్వర్యంలో దేవతలకు పట్టు వస్త్రాలు, సంప్రదాయ కానుకలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీటి బాలనర్స్, వార్డ్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గద్వాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఆదేశించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో జరిగిన సమావేశంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని, శాఖల మధ్య సమన్వయంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
NRML: ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఖానాపూర్ సీఐ అజయ్ కుమార్ సూచించారు. రోడ్డు భద్రతా నియమాల్లో భాగంగా శుక్రవారం ఖానాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని కంటి ఆసుపత్రిలో ఆటో డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాహుల్ గైక్వాడ్ ఉన్నారు.
TG: రెండేళ్లలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని DGP శివధర్ రెడ్డి వివరించారు. పోలీసుల సమన్వయం, ప్రభుత్వ పునరావాస విధానాలతో జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని తెలిపారు. మాజీ మావోస్టులకు భద్రత, గౌరవంగా జీవించేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
PPM: పోలీసు సిబ్బంది యొక్క శాఖాపరమైన, ఆరోగ్య పరమైన పరిష్కారానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విన్నవించారు. వినతులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
AKP: గొలుగొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగులు ఖాళీలు భర్తీ చేసేందుకు మార్చి 2న జరగాల్సిన ప్రవేశ పరీక్ష 8వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు జరుగుతున్నందున ఈ మార్పు చేశారన్నారు.
HYD: మంత్రి కొండా సురేఖ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రసాదం నాణ్యత, శుభ్రతపై ఆరా తీసి శాంపిళ్లు పరీక్షలకు పంపించారు. 200 గ్రాముల పులిహోర ప్యాకెట్ 150 గ్రాములే ఉండటాన్ని గుర్తించారు. నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఒక పూజారిని తొలగించారు. EO, సూపరింటెండెంట్ సస్పెన్షన్కు ఆదేశించినట్లు సమాచారం.
TPT: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులకు ఆదేశించారు. మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో సుమారు 33 వేల మంది విద్యార్థులు 179 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతారని అధికారులు తెలిపారు.
NZB: మోపాల్ మండలం సిర్పూర్ శివారులోని గుట్ట వద్ద ఓ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గుట్ట వద్దకు వెళ్లగా అక్కడ అస్థిపంజరం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా మృతదేహం నెల రోజుల క్రితం గల్లంతైన ఈర్ల సాయిలుగా గుర్తించారు.
SRPT: మంచ్య తండా ఎంపీపీఎస్ పాఠశాలలో ‘సెల్ఫ్ గవర్నమెంట్ డే’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయుల వేషధారణలో చిన్నారులు అలరించడమే కాకుండా, నాయకత్వ లక్షణాలు, బాధ్య తాభావంతో తరగతులు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామిరెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.
CTR: కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం వద్ద లారీ ముందువైపు వెళుతున్న ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కెనమాకన పల్లికి చెందిన లోకేశ్ రెడ్డి(25) తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తుండగా తమిళనాడు సేలం నుంచి కలకత్తా వెళ్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు.
EG: కోరుకొండ గ్రామంలో వేంచేసియున్న స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో శుక్రవారం జరిగిన భారీ రధోత్సవం కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రతి ఏటా జరిగే మహోత్సవాలలో నిర్వహించే రథోత్సవానికి పరిసర గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
AP: ఉండవల్లిలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేకు కలిపేలా ప్రభుత్వం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతోంది. ఈ పనులను పరిశీలించిన మంత్రి.. కాంక్రీట్ పిల్లర్లపై స్టీల్ గడ్డర్ల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. స్టీల్ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి వారికి సూచించారు.