PPM: ఈనెల 23వ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మన్యం జిల్లా లో 33 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని DIEO వై.నాగేశ్వరరావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 17,530 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. రెండు ఫ్లయింగ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్, DEC మెంబర్స్ కన్వీనర్ DIEO మొత్తం నాలుగు వాహనాల్లో పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో తనిఖీలు నిర్వహిస్తారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం సుబ్బారావు పేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో మద్దా నూతయ్య, వనులమ్మకు చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు ఏసు తదితరులు బాధిత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించి నిత్యవసర సరుకులు అందజేశారు. దృష్టి తీసుకెళ్ళి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
SKLM: స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. డీసీబీ కాలనీలో మొక్కలు నాటడం, ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో శుభ్రతా పనులు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కార్మికులతో కలిసి స్వయంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన అన్నారు.
సత్యసాయి: లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌవలసముద్రం టోల్ ప్లాజా వద్ద పోలీసులు శనివారం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సై నరేంద్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తూ, పలువురికి హెల్మెట్లు పంపిణీ చేశారు.
ADB: ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్గా బండారి అనూష శనివారం ఆమె కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు వైస్ ఛైర్మన్ రోహిత్, కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, గండ్రత్ సుజాత శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
TG: చంచల్గూడ జైలు ములాఖత్లో నగర విధ్వంసానికి ఉగ్రకుట్ర జరిగినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాది జైలు నుంచే ఈ ప్లాన్ రచించినట్లు సమాచారం. దీంతో మూసారాంబాగ్, సైదాబాద్, మలక్పేట ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. ములాఖత్ సమయంలోనే దాడులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు.
ATP: పెళ్లికి వెళ్తూ జరిగిన కారు ప్రమాదంలో ఉరవకొండకు చెందిన వైసీపీ కార్యకర్త నాగేష్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి నాగేష్ భౌతికకాయానికి శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తను కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ (MPP) కార్యాలయ ఆవరణలోని జాతీయ జెండా దిమ్మెను గుర్తుతెలియని ఆగంతుకులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
RR: షాద్నగర్ పట్టణంలోని 23వ వార్డు మైసమ్మ దేవాలయంలో నూతన ఛైర్మన్ బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ అందేమోహన్, కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సాయి మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు సత్యనారాయణ వారికి అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు భావిస్తున్నారన్నారు.
ASR: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కొయ్యూరు మండలాభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ బడుగు రమేశ్ సూచించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
SKLM: తిరుపతి విమానాశ్రయ పురోగతి, అభివృద్ధి పనులను MoCA కార్యదర్శి సమీర్ కుమార్ శర్మ, AAI ఛైర్మన్ కుమార్ జైన్లతో కలిసి శనివారం కేంద్ర విమానయాన శాఖమంత్రి రాంమోహన్ సమీక్షించారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు “కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్” విజన్కు అనుగుణంగా, పవిత్ర తిరుపతి ఎయిర్పోర్ట్ని మెరుగైన రీతిలో అనుసంధానం చేయడానికి చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
BHNG: మోత్కూరు మండలం పనకబండకు చెందిన మారుపాక మమత అనారోగ్యంతో HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారి పరిస్థితిని ఉప సర్పంచ్ మల్లేశం, తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ కడియం రామచంద్రయ్య దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో CMRF నిధుల కోసం దరఖాస్తు చేయించి చెక్కును అందజేశారు.
SRPT: నాగారం మండలం పస్తాల, పసునూరు స్టేజి మరియు రావులపల్లి ఎక్స్ రోడ్ రహదారులు గుంతలమయమై వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా, గతంలో నిధులు మంజూరయ్యాయని చెబుతున్నా.. నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ATP: గుత్తి మండలం కరటికొండ సమీపంలోని 44 హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న ఆచారి అనే వ్యక్తిని కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆచారికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కారు కర్నూలు నుంచి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NLG: దేవరకొండలోని తెలంగాణ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో VTG-CET 2026, గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.హరిప్రియ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులు తమ హాల్ టికెట్తో పాటు ఆధార్, తదితర ఐడీ కార్డులతో కళాశాలకు ఉదయం 9 గంటల వరకు చేరుకోవాలని సూచించారు.