సత్యసాయి: నల్లమడ మండలంలోని గోపేపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన తోలేటి ప్రభావతమ్మకు చెందిన మామిడి తోట ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 400 మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. ఈ ఏడాది పూత బాగా రావడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించిన రైతుకు, ఈ ఘటన తీరని వేదన మిగిల్చింది.
E.G: ఈనెల 22న రాజానగరంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం తెలిపారు. మార్చి 14న ఆవిర్భావ దినోత్సవ ఉత్సవం & క్రియాశీలక సభ్యత్వ నమోదు, పలు కమిటీల నిర్మాణం, తదితర వాటిపై నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. కావున పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
చాలామందికి టాయిలెట్కు ఫోన్ తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఉండే ఈ-కోలై వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఫోన్ స్క్రీన్పైకి చేరుతుంది. చేతులు కడుక్కున్నా, ఫోన్ ద్వారా ఆ క్రిములు ఆహారంతో పాటు శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అంతేకాక, ఫోన్ చూస్తూ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగి పైల్స్ వచ్చే అవకాశం ఉంది.
NDL: జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ శుక్రవారం మధ్యాహ్నం కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత కేసులు వాటి పురోగతిపై సీఐ రమేష్ బాబును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్న దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే విషయాలను నమ్మవద్దన్నారు.
ELR: సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సభలో పాల్గొన్న సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక, సామాజిక, అసమానతలు, కుల, మత వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత తీవ్రతరం చేయాలన్నారు.
AP: విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. మార్చి 16 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉ.8 నుంచి మ.12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని వెల్లడించింది. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సా.5 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలోనూ మార్చి 16 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.
KDP: మాదకద్రవ్యాల నిర్మూలనకు అవగాహన పెంపొందించే లక్ష్యంతో డ్రగ్స్ అంతం, డివైఎఫ్ఐ పంతం, మాదకద్రవ్యాలను అరికడదాం – మంచి సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో రూపొందించిన పోస్టర్ను శుక్రవారం జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
MDK: చేగుంట ఏఎంసీ పాలకవర్గ తొలి సమావేశం ఛైర్మన్ తాడేం వెంగల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. రైతులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. సెక్రటరీ ఉష, సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, కమిటీ డైరెక్టర్లు కుర్మ లక్ష్మి, మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు, ఆంజనేయులు, కాషబోయిన శ్రీనివాస్, బాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 22 నుంచి మార్చి 9 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని CP రష్మీ పెరుమాళ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు నిర్వహించకూడదన్నారు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా సీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. బంద్ల పేరిట కారణాలు చెబుతూ సంస్థలు, కార్యాలయాలు మూసివేయాలని చూస్తే చర్యలు తప్పవన్నారు.
అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాయచోటి మండలం కాటిమాయకుంట గ్రామపంచాయతీలో స్వచ్ఛ రథం వెహికల్ ప్రారంభోత్సవం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్లాస్టిక్, పొడి చెత్త కొనుగోలు చేసి, చెత్త అందజేసిన వారికి బహుమతులు అందించనున్నట్లు ఎంపీడీవో పరిపూర్ణ అరుంధతి తెలిపారు.
GDWL: ఎనిమిది నెలల బేసిక్ శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగిలం ‘ఆర్య’ను జిల్లాకు కేటాయించారు. ఐఐటీఏ మొయినాబాద్లో శిక్షణ పొందిన ‘ఆర్య’ పేలుడు పదార్థాలను గుర్తించడంలో నైపుణ్యం సాధించిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం డాగ్ హ్యాండ్లర్ భీమేష్, డాగ్ స్క్వాడ్ ఎస్పీకి ఆర్యను పరిచయం చేశారు.
MBNR: జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం 2,082 క్వింటాళ్ల వేరుశనగ చేరింది. ఈ సందర్భంగా గరిష్ట ధర క్వింటాకు రూ.10,269గా నమోదైంది. కనిష్ట ధర రూ.4,500 కాగా, సాధారణ ధర రూ.9,169గా ఉంది. గతంలో క్వింటాకు రూ.12,000కు పైగా ధర పలికిన సందర్భాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మార్చి 1వ తేదీన తెలంగాణకు రాహుల్ గాంధీ రాబోతున్నారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ సులభంగా దక్కించుకునే అవకాశం ఉంది.
గ్లోబల్ పాప్ స్టార్ షకీరా ఏప్రిల్ 10, 15 తేదీల్లో ముంబై, ఢిల్లీలలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘ఫీడింగ్ ఇండియా’ ఆధ్వర్యంలో జరిగే ఈ కాన్సర్ట్ల ద్వారా వచ్చే నిధులను చిన్నారుల పోషకాహార లోప నిర్మూలనకు వెచ్చించనున్నారు. 2007 తర్వాత ఆమె మళ్లీ భారత్కు వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మెగా ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
మాల్స్లో జీవో నెం.15 ప్రకారం మొదటి 30 నిమిషాల పార్కింగ్ ఉచితం. కానీ, మాదాపూర్, గచ్చిబౌలిలోని కొన్ని మాల్స్ ‘డిజిటల్ ఎంట్రీ’ పేరుతో వాహనం లోపలికి వెళ్లకముందే సమయాన్ని లెక్కిస్తూ వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి. వెయిటింగ్ చేయిస్తూ, 30 నిమిషాలు దాటగానే రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తున్నాయి. షాపింగ్ చేసినా గంట ఉచితం అనే నిబంధనను కూడా గాలికొదిలేశాయి.