KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధి పార్వతీపురంలో పైపులైను లీకేజీ అయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత నీరు సరఫరా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 నెలలు కావస్తున్నా అధికారులు పట్టించుకోలేదని పలువురు చెబుతున్నారు. లీకేజీ ప్రాంతం బురదమయం కావడంతో కష్టంగా ఉందని వాహనదారులు తెలిపారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ADB: నార్నూర్ మండలంలోని ఖైర్థత్వ గ్రామానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి శనివారం అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా అడవి పందులు అకస్మాత్తుగా దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సచిన్, ప్రదీప్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.
NDL: పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో ఇవాళ దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ పర్యటించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చంద్రశేఖర్ ఆజాద్ చేరుకోగానే ఆలయ అధికారులు అర్చకులు కలిసి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
W.G: నరసాపురం మండలం సరిపల్లి శివారులో శనివారం పోలీసులు జరిపిన దాడిలో ఐదుగురు పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 8,760 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై టి. వెంకట సురేశ్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జూదం ఆడుతూ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
MDK: తూప్రాన్ మండలం ఘనాపూర్ శివారులో అక్రమంగా మట్టి తరలిస్తున్న 9 ట్రాక్టర్లు, ఒక జేసీబీ యంత్రాన్ని సీజ్ చేసినట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదు రాగా శనివారం దాడులు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు
నల్గొండ: మర్రిగూడ మండలం ఖుదాబాక్షపల్లిలో సర్పంచ్ పందుల జయలక్ష్మి పాండు అధ్యక్షతన శనివారం మొదటి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వార్డు సభ్యులు, ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
MBNR: మహబూబ్ నగర్ ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందించింది. డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు నెలల పాటు గ్రూప్-1,2,3,4, ఆర్ఆర్బీ బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వబడుతుందన్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 22లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
KRNL: AITUC 21వ జిల్లా మహాసభలు ఆలూరులో మార్చి 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి ఎస్. మునెప్ప శనివారం తెలిపారు. ఈ మహాసభలకు కార్మిక లోకం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మిగనూరులోని సీపీఐ కార్యాలయం ముందు మహాసభల కరపత్రాలను విడుదల చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
GNTR: ఆస్తి పన్ను, బకాయిలు చెల్లించడానికి ఆదివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్ను చెల్లింపు కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 వరకు యధావిధిగా పనిచేస్తాయని GMC కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
TG: హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లోని క్రేయాన్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే 6 నెలల శిశువు మృతి చెందాడు. అయితే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే.. బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేశారు.
VZM: చీపురుపల్లి పట్టణంలోని పిల్లపేటలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శనివారం పర్యటించారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వైసీపీ గ్రామ, అనుబంధ కమిటీల నియామకంపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కమిటీలు అత్యంత కీలకమని, వార్డుల వారీగా బాధ్యతగా పనిచేసి కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కష్టపడిన వారికి కమిటీల్లో చోటు కల్పించాలన్నారు.
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘కల్ట్’. ఈ మూవీ టీజర్ను ఈరోజు ఘనంగా విడుదల చేశారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు రవి బస్రూర్కు విశ్వక్ సేన్ ఖరీదైన రోలెక్స్ వాచ్ను బహుమతిగా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. రవి బస్రూర్ అందించిన అద్భుతమైన సంగీతానికి కృతజ్ఞతగా ఈ స్పెషల్ గిఫ్ట్ అందించినట్లు విశ్వక్ తెలిపాడు.
HYD: శామీర్పేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి నివాసంపై దాడి ఘటన నేపథ్యంలో పరామర్శించేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని ఖండించిన ఈటల ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.
WNP: ఖిల్లా ఘనపూర్ మండలంలోని గ్రామాల ఇంటర్ సెకండియర్ Mpc, Bipc చదువుతున్న విద్యార్థులకు ఉన్నత చదువుల నిమిత్తం సాయం చేసేందుకు దాతలు ముందుకొచ్చారు. ఖిల్లా సేవా సమితి ద్వారా దాతలు రేపు ఉ.9:30 గంటలకు బాలుర హైస్కూల్లో పరీక్ష రాసి పాసైన విద్యార్థులకు నెలకు రూ.12,500 స్కాలర్షిప్తో పాటు ఉచిత హాస్టల్ 3 ఏళ్లు సౌకర్యం కల్పించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
RR: నందిగామ మండలం అప్పారెడ్డి గూడ గ్రామంలో రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకొని గ్రామంలో ఉన్న మసీదుకు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం రూ. 30 వేల నగదును మజీద్ నిర్వాహకులకు అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజా సేవలో భాగంగా తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజాసేవలో భాగంగా సేవ గుణాన్ని చూపిన మాణిక్యంను నిర్వాహకులు ప్రశంసించారు.