PLD: మాచర్ల విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ హఠాన్మరణం చెందిన హుస్సేన్ కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. అందరూ కలిసి సేకరించిన రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మంగళవారం పల్నాడు జిల్లా ఎస్ఈ డాక్టర్ విజయకుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తా మన్నారు.
ప్రకాశం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రకాశం జిల్లా దర్శిలో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
CTR: విజయవాడలోని జరిగిన ఏపీ శాసనసభక్రీడా పోటీల్లో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు. మంగళవారం జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో ఆయన ప్రతిభకనబరిచి రెండో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
AKP: రాంబిల్లి(మం) మూలజంప జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు విద్యార్థులను చదివిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు హెచ్ఎం బాల ప్రభావతి, హిందీ టీచర్ రమణారావు తెలిపారు. శత శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
TPT: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అసెంబ్లీ సమావేశం తర్వాత DY.CM పవన్ కళ్యాణ్ను కలిసి వినతపత్రం అందించారు. వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు. వెంకటగిరికి ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాలను చూపాలని ఆయనకు విన్నవించారు.
ప్రకాశం: గిద్దలూరు సీడీపీవో కార్యాలయం ముందు మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. లేబర్ కోడ్స్ రద్దు చేసి, పాత చట్టాలనే అమలు చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీలకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు.
GNTR: గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా జనగణన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. జనగణన ప్రక్రియలో చార్జ్ ఆఫీసర్లు, అడిషనల్ చార్జ్ ఆఫీసర్లు, ఎన్యుమరేటర్ల బాధ్యతలు అత్యంత కీలకమని తెలిపారు. డిజిటల్ యాప్ల ద్వారా నిర్వహించనున్న జనగణనలో నాణ్యమైన డేటా సేకరణకు పూర్తి అవగాహనతో పాటు సమర్థ పర్యవేక్షణ అవసరమని సూచించారు.
ASR: నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్కు పాడేరు మండలం, గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాల 9వ తరగతి విద్యార్ధినిలు ఎంపికయ్యారు. అమృతసర్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్కు విద్యార్ధినిలు హాజరవుతున్నారు. ఈ మేరకు జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మంగళవారం విశాఖ ఎయిర్ పోర్ట్లో విద్యార్ధినిలకు శుభాకాంక్షలు తెలిపారు.
AKP: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి సుంకర మెట్టు నుంచి దేవిపురం వరకు సైక్లింగ్ ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి పీ. శైలజ తెలిపారు. అండర్ 18 విభాగంలో 45 మంది బాలురు, పదిమంది బాలికలు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలో ఎంపికైన వారు ఈనెల 28 నుంచి విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
PLD: అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామంలో శివాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం జరిగిన ముందస్తు పూజా కార్యక్రమాల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
BPT: ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లనే వసూలు చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం చార్జీల పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక వసూళ్లపై ఫిర్యాదు చేసేందుకు 7702806804 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు.
PPM: కొమరాడ మండలం వన్నాంగ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది మంగళవారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి మంగళవారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి పై కొలువున్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
PPM: బాల్య వివాహాలు సామాజిక శాపమని, అందుకే వాటి పట్ల అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (NIC) ఎం.ఏ.నాయుడు పేర్కొన్నారు. మంగళవారం పాచిపెంట మండలంలోని కొత్తవలస, కర్రివలస ZPHSలో ప్రత్యేక సదస్సులను ఆయన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు.
కృష్ణా: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు–సేవల పన్నుల వసూళ్లు సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.