KDP: గోపవరంలో సంఘ సముద్రం గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వ స్థలంపై అక్రమ నిర్మాణం వివాదం రేగింది. సర్వే నెంబర్ 1122-2Aలో అధికారులు ఏర్పాటు చేసిన చూచిక బోర్డును తొలగించి ఓ వ్యక్తి నిర్మాణం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
KRNL: కోసిగి మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంగ్లిష్ మీడియం 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు సుందర్ తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. మార్చి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. OC, BC విద్యార్థులు రూ.200, SC, ST విద్యార్థులు రూ.125 చెల్లించాలన్నారు.
VSP: విశాఖకు చెందిన తెలుగు యూట్యూబర్ కోమలి (21) హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఆత్మహత్యకు పాల్పడింది. చదువుతో పాటు హాబీగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ గుర్తింపు పొందిన ఆమె, సొంతూరికి చెందిన యూట్యూబర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అఖిల్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ప్రేమ విఫలమవడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నట్లు సమాచారం.
GNTR: తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును సీబీఐ క్లోజ్ చేయడంపై ఆమె తల్లిదండ్రులు శంషాబాద్ బేగం, ఇక్బాల్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 27న ఆయేషా మీరా శరీర అవశేషాలను తిరిగి ఖననం చేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు పోరాటం చేసినా తమ కుమార్తెకు న్యాయం జరగలేదని, అదే రోజు సత్యం–న్యాయం–ధర్మాన్ని సమాధి చేస్తున్నట్టేనని వారు వేదనతో చెప్పారు.
TPT: శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి బదిలీ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజే ఈవోని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతనంగా ఏర్పడిన ఆలయ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయి, ఈవోకి మధ్య విభేదాలు వచ్చాయి. ఒకానొక సమయంలో ఈ విషయాన్ని ఛైర్మన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లారు.
GNTR: రాజధాని గ్రామాల్లో రూ. 1,000 కోట్లతో చేపట్టే మౌలిక వసతుల పనులను, ప్రస్తుతం ప్లాట్లు అభివృద్ధి చేస్తున్న పాత సంస్థలకే అప్పగిస్తున్నట్లు మంత్రి నారాయణ గ్రామ సభల్లో ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఉన్న పనుల గడువు పూర్తి చేయడానికి ఆ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయని, ఈ అదనపు పనులు కూడా వారికే ఇవ్వడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
NLR: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. వెంకటగిరి అభివృద్ధికి సహకరించాలని వినతపత్రం అందించారు. వెంకటగిరికి ఎంతో చరిత్ర ఉందని.. ఇక్కడి సమస్యలకు పరిష్కారం చూపాలని విన్నవించారు.
SKLM: శ్రీకాకుళం నగరంలోని కొన్ని ప్రాంతాలలో డయేరియా కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకూ అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన వద్దని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ ప్రజలకు దైర్యం చెప్పారు. డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఢిల్లీ నుంచి వర్చ్యువల్ విధానంలో కలెక్టర్, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేతో సమీక్షించారు.
ASR: జీకేవీధి మండలం సీలేరు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న చింతపల్లి క్యాంపులో సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ తమ సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు.
NDL: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి ఇందిరా రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.
CTR: పెనుమూరు మండలం సాతంబాకం బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడు గుడియాత్తం తాలూకా పార్వతీపురానికి చెందిన కుమార్(47) ఆదివారం బంధువుల వద్దకు వచ్చాడు. కుటుంబ సమస్యల కారణంగా బాధలో అతిగా మద్యం సేవించి, ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు తెలిపారు.
ATP: గుత్తి పట్టణ శివారులో గంజాయి విక్రయిస్తున్న పదిమంది గంజాయి విక్రేతలను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రామారావు మాట్లాడుతూ.. గంజాయి విక్రయిస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు.వారి వద్ద నుంచి 2.500 గ్రాముల గంజాయి, రూ.20వేలు నగదు, 2 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.
E.G: అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పూర్ణిమ రాజు హెచ్చరించారు. కోరుకొండ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. వర్కర్లకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అన్నమయ్య: రాయచోటిలో మంగళవారం నుంచి రాయలసీమ జిల్లాల ఎంఈవోలు, డైట్ అధ్యాపకులకు రెండు రోజుల GFLN శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులలో చదవడం, గణిత నైపుణ్యాలను పెంచడమే ఈ శిక్షణ లక్ష్యమని డీఈవోలు తెలిపారు. మార్చి 2026 నాటికి లక్ష్యాలను చేరుకోవడానికి 75 రోజుల కార్యాచరణను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
KRNL: హొళగుందలో నేడు వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ షఫీ ఉల్లా తెలిపారు. ఈ సమావేశానికి ఆలూరు MLA బూసినే విరూపాక్షి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. కొగిలాతోట రోడ్డులోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ZPTCలు, MPP, MPTCలు, సర్పంచులు, నాయకులు పాల్గొనాలన్నారు.