KRNL: మంత్రి ఎన్ఎండి ఫరూక్ నేడు ఉదయం 8:30 కు నంద్యాల టౌన్ 14వ వార్డు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత ఉదయం 11:30 నేషనల్ డిగ్రీ కాలేజ్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, విద్యార్థులు పాల్గొని మంత్రి సూచనలు స్వీకరిస్తారు.
VSP: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురు యువతను మోసం చేసిన కేసులో ఐదుగురికి విశాఖ నాల్గవ అదనపు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఎంవీపీ పోలీసుల వివరాల ప్రకారం.. 2021లో డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా కూడా విధించింది.
కడప: జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
BPT: సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, టీడీపీ నేత వర్ల రామయ్య శుక్రవారం సీఐడీ డీజీకి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజలు తిరస్కరించినా వారిలో ఎలాంటి మార్పు రాలేదని నసీర్ మండిపడ్డారు.
NDL: కలెక్టర్ రాజకుమారి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులకు శుక్రవారం కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సునీల్ షౌరాణ్తో కూడిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
అన్నమయ్య: రాజంపేట పార్లమెంటు కార్యాలయం ఎదుట TDP పార్టీ ప్రచార రథాన్ని రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ ప్రారంభించారు. మార్చి 2న జరిగే పార్లమెంటు పార్టీ అధ్యక్ష,కార్యదర్శులు, కమిటీలోని 41 మంది ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
CTR: చీటీల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇటివల పలమనేరులో ఓ ఘటన వెలుగు చూడగా, నేడు పూతలపట్టులో అనధికార చీటీ నిర్వాహకుడు పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2-3 కోట్ల మేర చీటీ డబ్బులతో ఓ వ్యాపారి ఉడాయించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో సహా అందుబాటులో ఉండకపోవడం, చీటీ కార్యాలయాన్ని మూసివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ATP: జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. అంగన్వాడీ, పీహెచ్సీల పరిధిలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అన్నారు. తక్కువ బరువున్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, బాలింతలకు పౌష్టికాహారం సకాలంలో అందించాలని సూచించారు.
KKD: రాష్ట్రంలో పాలు కల్తీ, నీళ్లు కల్తీ, అధికారమే కల్తీగా మారిందని వైసీపీ మాజీమంత్రి కాకినాడ రూరల్ ఇంఛార్జ్ కురసాల కన్న బాబు ఆరోపించారు. శుక్రవారం రూరల్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కల్తీ పాలు తాగి జనం చచ్చిపోతే శవాల వద్ద కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే అధికార ఎమ్మెల్యేలు ఆటలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సత్యసాయి: కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు అంకురార్పణ పూజలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుల ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకుని గౌరవంగా ఆహ్వానించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ ఆన్లైన్ టికెట్లు, ఈ-హుండీ, ఏసీ సేవలను ప్రారంభించారు. అనంతరం స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.
SKLM: పలాస మున్సిపాలిటిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
W.G: భీమవరంలో పలు పాల కేంద్రాలపై శుక్రవారం ఆహార భద్రత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాస్ సెంటర్, డీఎన్ఆర్ కళాశాల రోడ్డులోని కేంద్రాల్లో నిల్వ ఉన్న పాలను పరిశీలించి, నమూనాలను సేకరించారు. ఆహార భద్రతాధికారి సుందరరామిరెడ్డి మాట్లాడుతూ.. సేకరించిన శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు.
BPT: రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాల్లో జరగనుంది. ఛైర్మన్ కట్ట మంగ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ భేటీలో తాగునీరు, శానిటేషన్, అభివృద్ధి పనులతో సహా మొత్తం 14 అంశాలపై చర్చించనున్నట్లు కమిషనర్ సాంబశివరావు తెలిపారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొనాలని తెలిపారు.
E.G: కొవ్వూరు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో-1)గా ఉందుర్తి శాంసన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఎండీ ఇమ్రాన్ భాషా, కె. శ్రీనివాసన్, పీవీ రవికుమార్, డి. మహేష్ తదితరులు ఆయనను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన ఎంఈవోకు శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
GNTR: తెనాలి 36వ వార్డులో శుక్రవారం రాత్రి జరిగిన జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త ఒక ఉద్యమంలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒకరు సభ్యత్వం తీసుకుని రాబోవు రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.