GNTR: పెదనందిపాడు మండలం వరగానిలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస పాఠశాల బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. బస్సు నుంచి చిన్నారి దిగుతుండగా ఒక్కసారిగా బస్సు ముందుకు కదిలింది. ప్రమాదవశాత్తు బస్సు కింద పడి అక్కడికక్కడే చిన్నారి దుర్మరణం చెందింది.
NTR: తిరువూరులో కుమ్మరి బజార్లో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తూ.గో జిల్లా ఏడిద గ్రామానికి చెందిన నేరస్థుడు కందుల సత్యనారాయణను అరెస్ట్ చేశారు. సీఐ కే. గిరిబాబు నిందితుడిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ముద్దాయి వద్ద నుంచి 30 గ్రాముల బంగారం, 2116 కేజీల వెండి, రూ.10 వేల నగదు, ఎన్ఫీల్డ్ బుల్లెట్ను స్వాధీనం చేసుకున్నారు.
BPT: చాట్రాసి ఫౌండేషన్ చీరాల నియోజకవర్గంలోని ఆమోదగిరిపట్నం పరిధికి చెందిన యువతకు వాలీబాల్ కిట్ను పంపిణీ చేశారు. యువత అభ్యర్థనపై రామకృష్ణపురం క్యాంప్ కార్యాలయంలో ఫౌండేషన్ ఛైర్మన్ చాట్రాసి రాజేష్ కిట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఎప్పుడైనా అవసరమైతే.. సహాయం కోసం తనను సంప్రదించాలని సూచించారు.
ELR: ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా వెట్టి భారతి, కే. లతలు ఎన్నికైనట్లు తెలిపారు. ఆదివారం జంగారెడ్డిగూడెం ధర్మన్న మెమోరియల్ హాల్లో POW జిల్లా నూతన కార్యవర్గాన్ని 15 మందితో ఎన్నుకున్నారు. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యపానాన్ని నిషేధించాలని, మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ నిర్భయ చట్టాలను అమలు చేయాలన్నారు.
కర్నూలు జిల్లాలోని 16 ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 2,614 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,327 మంది హాజరైనట్లు డీఈఓ సుధాకర్ తెలిపారు. పెద్దపాడు పాఠశాల సహా పలు కేంద్రాలను ఆయన సందర్శించి, నిర్వహణను పర్యవేక్షించారు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పరీక్షలు జరిగినట్లు వెల్లడించారు.
బాపట్ల జిల్లా అద్దంకి మండలం కాకానిపాలెంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఈనెల 26న మహోత్సవం జరగనుంది. ఈ మేరకు కమిటీ సభ్యులు ఈ రోజు కరపత్రాలను విడుదల చేశారు. ఈ మహోత్సవంలో సుప్రభాతం, అభిషేకాలు, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ జ్యోతి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక మీ కోసం నిర్వహించ బడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VZM: గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం చినకాద గ్రామంలో ఆదివారం సాయంత్రం విద్యుత్ స్తంభం కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. శిదిలిమైపోయిన విద్యుత్ స్తంభం అకస్మాత్తుగా ఇంటిపైకి కూలిపోయినట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన కొత్త విద్యుత్ స్తంభాన్ని వేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రజల కోరుతున్నారు.
VSP: యారాడ తీరంలో ప్రతిపాదిత జెట్టీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. జెట్టీ వల్ల సముద్రపు అలల మార్పుతో ఉప్పునీరు పంట భూముల్లోకి చేరి వ్యవసాయం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోర్టు కాలుష్యం, సముద్ర కోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలన్నారు.
W.G: భీమవరం పట్టణంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం యోగా సాధన చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించవచ్చని వివరించారు.
ATP: గుత్తి RS లోని జడ్పీ బాయ్స్ హైస్కూల్లో 2001లో టెన్త్ క్లాస్ చదువుకున్న విద్యార్థులు అపూర్వ సమ్మేళనం పేరుతో ఆదివారం కలుసుకున్నారు. శ్రీ సునామ జకినీ మాత ఆలయంలో పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులు పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. తమ చిన్ననాటి మిత్రులతో సరదాగా గడిపారు.
KDP: ప్రొద్దుటూరు శివాలయం సెంటర్లో కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అమలాపురంలో బండారు ప్రశాంత్ కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని ఆత్మహత్య చేసుకోవడంతో అతన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, కార్మికులందరికీ జీతాలు పెంచాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
ELR: నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామంలో ఆదివారం ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సూర్య ఫలకాల గ్రిడ్ అనుసంధాన కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. సౌర శక్తిని వినియోగించుకునేందుకు ప్రపంచ దేశాలు పోటీలు పడుతున్నాయని అన్నారు. సోలార్ వినియోగంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకి సూచించారు.
KDP: అగ్రహారం గ్రామంలో హత్యకు గురైన కీర్తన కుటుంబాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి సంఘటన వివరాలు తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఖర్చులు, చదువు కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తూ, కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దోషులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు.
కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాలతో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రామచంద్రపురంలో ఆదివారం ‘కార్డెన్ సెర్చ్’ నిర్వహించారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల విక్రయాలను, నిల్వలను అరికట్టడమే లక్ష్యంగా సోదాలు నిర్వహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.