అన్నమయ్య: ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ నిర్మానుష్యంగా మారింది. ఎండలు విపరీతంగా పెరగడం, కొండపై కూడా చల్లదనం లేకపోవడంతో సందర్శకుల రాక తగ్గిపోయింది. ఏసీ గదులను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో పర్యాటకులు ఆసక్తి చూపడం లేదు. మంగళవారం కొండపై 37°C ఉష్ణోగ్రత నమోదై, సాయంత్రానికి 35°Cకు తగ్గింది. దీంతో పర్యాటకుల సంచారం లేక కొండ బోసిపోయింది.
KDP: ఎండాకాలం ప్రభావం, ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో లేకపోవడంతో గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 22.228 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ ఉమా మహేశ్వర్లు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గండికోట ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 26.85 టీఎంసీలు ఉంటుంది.
కడపలో తిరుమల తొలి గడపలో ఈ నెల 29 నుంచి మే 1 వరకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం స్వామివారు దేవేరులతో కలిసి పుష్కరిణిలో తెప్పపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
TPT: దొరవారిసత్రం మండలం నెలబల్లిలో గురువారం నుంచి గంధోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆదివారం వరకు జరిగే ఈ వేడుకల్లో భాగంగా.. గురువారం గంధం ఊరేగింపు, శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు పాటకచేరి, ఆదివారం రాత్రి జబర్దస్త్ ఆర్టిస్టులతో ప్రత్యేక వినోద కార్యక్రమం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు భారీగా తరలిరావాలని కోరారు.
బాపట్ల: రేపల్లె రూరల్ మండలం గుడ్డికాయలంకలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పేరం ఆదిశేషరావు ఇంట్లో బుధవారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: చెత్త నుండి సంపద సృష్టించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో కవిటి మండలానికి చెంది న స్వచ్చ రథాన్ని ప్రారంభించారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించి స్వచ్ఛ గ్రామాలు తయారుచేయాలన్నారు.
NLR: ఏటా 500 మంది ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ఇంటర్ రెసిడెన్షియల్ విద్యతో పాటు జేఈఈ మెయిన్స్, నీట్ శిక్షణ అందిస్తామని ఏపీ వర్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. పూర్తి ఖర్చు వర్ఫ్ బోర్డు భరించేలా మంగళవారం జరిగిన 14వ బోర్డు సమావేశంలో తీర్మానించామని తెలిపారు. ముస్లింల సంక్షేమానికి వర్ఫ్ బోర్డు కట్టుబడి ఉందన్నారు.
W.G: భీమవరం మున్సిపాలిటీలో నిధులు, అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. కమిషనర్ శ్యామలతో పాటు మరో ఆరుగురు అధికారులపై విచారణ జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణకు అధికారులుగా ఆర్డీ నాగనరసింహారావు, ప్రస్తుత కమిషనర్ రామచంద్రారెడ్డిలను ప్రభుత్వం నియమించింది. 2 నెలల్లోగా సమగ్ర విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోరింది.
NTR: విజయవాడలో జరిగిన కొండపల్లి బొమ్మల పండుగ కార్యక్రమంలో సమాచార & పౌరసరఫరాల శాఖ మేనేజర్ విశ్వనాధ్తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ నిన్న పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కొండపల్లి బొమ్మలు మన గొప్ప వారసత్వానికి ప్రతీక అని అన్నారు. కొండపల్లి బొమ్మలను ప్రపంచానికి పరిచయం చేయాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. కొండపల్లి కలకు కొత్త ఊపిరి లభించిందన్నారు.
సత్యసాయి: సింగపూర్ అధికారిక పర్యటనలో భాగంగా రెండో రోజు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లిటిల్ ఇండియాలోని నలన్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ సింగపూర్ హోం వ్యవహారాల మంత్రి కే. షణ్ముగంతో కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరిపాలనా అంశాలు, ఇతర కీలక విషయాలపై చర్చించారు.
TPT: తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. మే ఒకటో తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని కాలేజీలను వర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడు ఆదేశించారు. జూన్ 15వ తేదీన కళాశాలలు తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
KDP: పులివెందులలోని తన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డిని కోదండ రామాలయానికి చెందిన వేదపండితులు కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు. వేదమంత్రాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని పండితులు ఆకాంక్షించారు.
అన్నమయ్య: రామాపురం మండల కేంద్రమైన రామాపురంలో బుధవారం నుంచి 15 రోజుల పాటు మహాభారత యజ్ఞం నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యజ్ఞాన్ని హరికథ రూపంలో ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. రాత్రి వేళల్లో మహాభారతాన్ని నాటక రూపంలో వేషధారణలతో ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
VSP: సింగల్ యూజ్ ప్లాస్టిక్ ప్రకృతిని, మానవ జీవనశైలిని కలుషిత పరుస్తోందని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పక్షులు, జీవరాశులు, జలరాశులు రోగాల బారిన పడుతున్నాయన్నారు. ప్రజలు దీనికి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని, సముద్రపు జీవ రాశులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.