W.G: భీమవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యావరణ పరిరక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్వా వ్యర్థ జలాలను నిబంధనలకు విరుద్ధంగా కాలువల్లో వదిలే యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలుష్య ప్రభావంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
KDP: సిద్ధవటం(M)మాచుపల్లి పెన్నానదిలో JCB యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపడంపై స్థానిక రైతులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల్లోకి తోలుకోవాలని రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొంది,ఆ ఇసుకను కడపకు తరలించి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి,బోర్లలో నీరు తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
అన్నమయ్య: మదనపల్లె మండలం ఆవలపల్లిలో శనివారం సాయంత్రం వ్యవసాయ అప్పులు తీరక మనస్తాపానికి గురైన వెంకటేష్ అనే యువ రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
NDL: బనగానపల్లె మండలం పసుపులలో రూ.85.20 లక్షల అభివృద్ధి పనులను శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానికులు, పార్టీ నేతలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, రోడ్డు విస్తరణ పనులతో పాటు జల్ జీవన్ మిషన్ కింద రూ.50 లక్షలతో నిర్మించిన 60 కెఎల్ ఓవర్ హెడ్ ట్యాంక్ను బీసీ ప్రారంభించారు.
KRNL: కర్నూలు కలెక్టరేట్లో శనివారం హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.చిరంజీవి, ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డి.మహదేవరావు పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. విధి నిర్వహణలో వారు చూపిన నిబద్ధతను కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
CTR: రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖ చేపట్టిన గజ గణన ముగిసింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మూడు రోజులపాటు ఏనుగుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గణన చేపట్టారు. మొదటి రెండు రోజులు ఏనుగుల పాదముద్రలు, వెంట్రుకలు, పేడ సేకరించారు. మూడోరోజు ఏనుగులు ఎక్కువగా నీటి కోసం వచ్చే గుంటల వద్ద పర్యవేక్షించారు. ఈ డేటాను అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి పంపనున్నారు.
ATP: అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ వి.శ్రీనివాసరావు పదవీ విరమణ వీడ్కోలు సమావేశం పోలీస్ కన్వెన్షన్ హాలులో ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆయన్ను దుశ్శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందించారు. శ్రీనివాసరావు సేవలను ఎస్పీ కొనియాడారు. గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు 1989లో ఎస్సైగా ప్రస్థానం ప్రారంభించి సీఐ, డీఎస్పీ, ఏఎస్పీగా పదోన్నతులు పొందారు.
ATP: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో APSPDCL అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ పర్యవేక్షణకు జిల్లాకు ఒక చీఫ్ జనరల్ మేనేజర్ను నోడల్ ఆఫీసర్గా నియమించారు. స్తంభాలు, లైన్లు దెబ్బతింటే టోల్ ఫ్రీ నంబర్లు 1912, 1800425155333 లేదా నంబర్ 9133331912లో సంప్రదించాలని కోరారు.
E.G: ఎస్పీ డి.నరసింహ కిషోర్ శనివారం రాజమండ్రిలో జిల్లా పోలీసు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల నమోదు, సీసీటీఎన్ఎస్ నిర్వహణ, డిజిటల్ డాక్యుమెంటేషన్పై దిశానిర్దేశం చేశారు. న్యాయస్థానాల్లో సమన్లు, వారెంట్ల అమలులో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమన్నారు.
BPT: చీరాల మండలంలోని దేశాయిపేటలో నిర్వహించిన మహాలక్ష్మి అమ్మవారి పొంగళ్ల కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్లను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
కోనసీమ: మండపేట మండలంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరామర్శించారు. ద్వారపూడి గ్రామంలో మాజీ జెడ్పిటీసీ తులా రంగారావు, అనమాల రాము, ఆకుమర్తి సుబ్బారావు, అర్తమూరు గ్రామంలో మండా వెంకటరెడ్డి, సబ్బెళ్ళ రామారెడ్డి, ఏలేటి గణపతి, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రకాశం: ఒంగోలు మండలం గుండాయపాలెం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 20 మందిని శనివారం స్థానిక టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.17,350 నగదు 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించామని సీఐ భీమా నాయక్ తెలిపారు. పేకాట ఆడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
KRNL: గణేకల్లు గ్రామానికి చెందిన బల్లెకల్లు వీరేష్, తలారి మహేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ఇవాళ టీడీపీ నాయకులు ఉమాపతి నాయుడు, భూపాల్ చౌదరి సంతాపం వ్యక్తం చేశారు. ఆదోని ఏరియా ఆసుపత్రికి చేరుకుని అధికారులతో మాట్లాడి పోస్టుమార్టం త్వరగా పూర్తి చేయాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. కైలాసగిరి, జూ పార్క్, కంభాలకొండ, తదితర ప్రాంతాలను అనుసంధానిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా నైట్ సఫారీ వంటి సదుపాయాల ఏర్పాటు చేయనున్నామన్నారు.
CTR: బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి గ్రామానికి చెందిన కిరణ్ (11) శాంతిపురం మండలంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన కిరణ్ శుక్రవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా విష సర్పం కాటేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ చికిత్స పొందుతూ ఇవాళ బాలుడు మృతి చెందాడు.