VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్ట్లో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి చదువుకున్న ఇదే వేదికపై నిలబడటం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోందని, ఈ కార్యక్రమంలో పాల్గొనడమే తనకు దక్కిన పెద్ద పురస్కారమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ పాల్గొన్నారు.
ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి మంత్రి నారా లోకేష్ను కలిశారు. మార్కెట్ యార్డ్లో రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యార్డ్ను ఆధునీకరించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని పల్లవి వివరించారు. అనంతరం స్థానిక రాజకీయాలపై చర్చించారు.
సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో సోమందేపల్లి-పెనుగొండ మధ్య బైక్ రేసింగ్ నిర్వహించిన యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. సరదా కోసం చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తాయని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
VZM: బొండపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై యూ. మహేష్ సోమవారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వాహనదారులకు సూచించారు. డ్రైవింగ్ సమయంలో వాహనపత్రాలు వెంట ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని కోరారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
SKLM: జిల్లాలో మరో రెండు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఇవాళ, రేపు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు తెలిపారు. నిన్న ఎచ్చెర్లలో 52.5 మిమీ అధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు
AKP: ఎలమంచిలి మండలంలో 17 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో కొండలరావు సోమవారం తెలిపారు. మూడు నుంచి నాలుగు పంచాయతీలకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక అధికారులుగా నియమించిన వారిలో తనతో పాటు, తహసీల్దార్ కె. వరహాలు, డిప్యూటీ ఎంపీడీవోలు అనంతనాగ్, వి.దీపిక, మోహన్ రావు ఉన్నట్లు పేర్కొన్నారు.
GNTR: తెనాలి మహిళా మండలి భవన్లో మెప్మా ఆఫీసులో నిన్న స్లమ్ సమాఖ్య మహిళలకు హోమ్ కంపోస్ట్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు పాల్గొన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. తడి చెత్తతో ఎరువు తయారు చేసుకుని మొక్కలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. హోమ్ కంపోస్ట్ ద్వారా చెత్త తగ్గించి పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.
KDP: ఊటుకూరు సర్కిల్ వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ A. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సీ.ఐ బాల మద్దిలేటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
SKLM: ఎచ్చెర్లలో ఉన్న ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో సోమవారం నుంచి విద్యార్థినుల కోసం పాలీసెట్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. పదో తరగతి విద్యార్హతతో డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి పాలీసెట్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ విక్టర్ పాల్ విద్యారి తెలిపారు. తక్కువ ఖర్చుతో మంచి భవిష్యత్తు డిప్లమోతో సాధ్యమన్నారు.
GNTR: తెనాలి మండలం సంగం జాగర్లమూడి వద్ద సోమవారం ప్రమాదం జరిగింది. తెనాలి-నారాకోడూరు మార్గంలోని మూలమలుపు వద్ద మెడికల్ సరుకు లోడ్తో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి కాలువ గట్టుపైకి దూసుకెళ్లింది. కాలువ అంచున ఆటో నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే ఆటోలోని మందుల బాక్సులన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
కృష్ణా: మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 35 ఫిర్యాదులను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సమర్పించే అర్జీలపై ఎలాంటి జాప్యం లేకుండా స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
PLD: శావల్యాపురం మండలం కనుమర్లపూడిలో ‘నీటి భద్రత’ కార్యక్రమం జరిగింది. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని ప్రోక్లైన్తో చెరువు పనులను ప్రారంభించారు. కాలువల్లో పూడికతీతతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రతి ఊరిలో ‘గ్రామ నీటి బడ్జెట్’ రూపొందించాలన్నారు. భవిష్యత్ తరాల కోసం జల వనరులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
NTR: సర్పంచుల పదవీకాలం ముగియడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు నందిగామ MPDO ఆర్.వి.ఎస్. ప్రసాదరావు సోమవారం కంచల గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ELR: పోలవరం మండలంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మొక్కజొన్న రైతుల సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు పెరిగాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్దతు ధరతో రైతులను ఆదుకుందని కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే క్వింటాకు రూ.2400ల మద్దతు ధర ఇవ్వాలన్నారు.
KRNL: కోసిగి మండలంలో ఆరు సంవత్సరాలుగా కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన అంబేద్కర్ విగ్రహ నిర్మాణ సమస్యకు ఇవాళ పరిష్కారం లభించింది. టీడీపీ ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి చొరవతో, గ్రామ పెద్దల సమక్షంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. ఈ పరిష్కారంతో కోసిగిలోని మూడు ఎస్సీ కాలనీల దళితులు, మండలంలోని ఇతర దళితులు సంతోషం వ్యక్తం చేశారు.