E.G: ఆర్యాపురం సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత పనుల కారణంగా గురువారం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. సీతంపేట, టీచర్స్ కాలనీ, ఈఎస్ఐ ఆస్పత్రి, కృష్ణనగర్, కొత్త రోడ్డు, స్వతంత్ర ఆస్పత్రి ప్రాంతాలు ప్రభావితమవుతాయి. పనులు పూర్తయ్యాక సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు.
KKD: పిఠాపురం పురపాలక సంఘానికి పదోన్నతి లభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. Dy. CM పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో సెకండరీ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా పిఠాపురం అప్గ్రేడ్ అయింది. ఈ హోదాతో పట్టణ అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు కానున్నాయి. పవన్ కృషి పట్ల జనసేన నాయకులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ELR: జిల్లాలో భవన నిర్మాణ రంగ కార్మికులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. భీమా పథకంలో నమోదైన కార్మికులకు వివాహ కానుక పథకం కింద రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజనం కింద రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 18-60 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులన్నారు.
ATP: అనంతపురం పట్టణ అభివృద్ధి సంస్థ (అహుడా) పరిధిలో అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆనంద్, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ చర్చించారు. నగరంలో పింక్ టాయిలెట్స్, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టుల గురించి చైర్మన్ కలెక్టర్కు వివరించారు. అహుడా అభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని, అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
W.G: పాలకొల్లు పట్టణం క్రిస్టియన్ పేటకు చెందిన వరుడు చందక సాయికుమార్పై దాడికి పాల్పడిన గోగులమండ శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14న వధువు ఇంటి వద్ద జరిగిన రిసెప్షన్ వేడుకలో శ్రీను తనపై కత్తితో దాడిచేసి గాయపరిచినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
కర్నూలులోని ఓ థియేటర్లో జరిగిన వీరశైవుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం మాట్లాడారు. వీరశైవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. వారిని ఓబీసీ జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంటులో చర్చిస్తానన్నారు. అనంతరం ఆయన బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకాశం: పొదిలి మండలం తూర్పు పాలెంలో దుండగుడు ఓ ఇంట్లోకి చొరబడి మొబైల్ ఫోన్ను దొంగిలించాడు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై రాజేష్ దర్యాప్తు చేపట్టారు. సమీప సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు నిందుతుడు ఫిరోజ్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, నిందితుడికి 15 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు.
KDP: ఎర్రగుంట్ల-ముద్దనూరు రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం రానున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురు భాస్కర్ రెడ్డి తెలిపారు. పాఠశాలలోని నిర్మిస్తున్న స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించేందుకు ఆయన వస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.
E.G: రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద ఇటీవల గుర్తు తెలియని సుమారు 6 నెలల చిన్నారిని స్థానికులు గుర్తించి రెండో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఛైల్డ్ లైన్ 1098కు సమాచారం అందించడంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సిబ్బంది చిన్నారిని శిశు గృహకు చేర్చి సంరక్షిస్తున్నారు. ఈ పాప వివరాలు తెలిసిన వారు పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు.
ELR: ఏపీ స్కిల్ డెవలప్మెంట్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జీలుగుమిల్లి మండలం బర్రెంకలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 9:00 నుంచి జరిగే ఈ జాబ్ మేళాలో 16కి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 10, ఇంటర్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్, D/B/M/ఫార్మసీ చేసి, 18-35 వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.
BPT: ఈ నెల 23వ తేదీన బల్లికురవ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కుసుమకుమారి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుందని, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై మండల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని కోరారు. సమావేశానికి సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా రావాలని ఎంపీడీవో సూచించారు.
KRNL: కౌతాళం మండల MROగా పి. రవిచంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రవిచంద్ర మాట్లాడుతూ.. మండల ప్రజలకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. భూ సమస్యలు, ధ్రువపత్రాల జారీ సేవలను సమయానికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ATP: గుంతకల్లు రైల్వే డివిజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని యశ్వంతపూర్- సహర్ష మధ్య వయా గుత్తి మీదుగా ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు నడుపుతునట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రతి గురువారం రాత్రి 10:25గంటలకు సహర్షలో బయలుదేరి శనివారం రాత్రి 10:30కు యశ్వంత్పూర్కు చేరుకుంటుందన్నారు.
కృష్ణా: డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర బుధవారం గన్నవరం మండలం చిన్నఅవుటపల్లికి చేరుకుంది. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలో మీటర్ల మేర వైబ్రేంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో విజయ్ కలాం బృందం యాత్ర కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా డా.పిన్నమనేని సిద్ధార్థ కళాశాలలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు.