ATP: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని శింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. కర్నూలులో ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన ‘సాగునీటి ప్రాజెక్టులు-సమాలోచన’ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతోనే ప్రాంతీయ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
సత్యసాయి: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అమరావతిలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఏడీసీసీబీ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బొకే అందించి, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టినందుకు నేతలు హర్షం వ్యక్తం చేశారు.
GNTR: ఎమ్మార్పీఎస్ నేత మందా కృష్ణ మాదిగ అర్చకులు, బ్రాహ్మణులపై చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని అర్చక & బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు అన్నారు. తెనాలిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. అనేక దేవాలయాల్లో బ్రాహ్మనేతరులు అర్చకులుగా ఉన్న విషయాన్ని కృష్ణ మాదిగ తెలుసుకోవాలని అనంతాచార్యులు, రఘు సూచించారు. దేశ విభజనకు మేము కారణమన్న వ్యాఖ్యలు దారుణమన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్పేటలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెక్టార్ సూపర్వైజర్ కృష్ణమ్మ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు మెరుగుపరచాలని, వారిని సంరక్షించాలని తల్లిదండ్రులకు సూచించారు. అదేవిధంగా గర్భిణీలకు, బాలింతలకు, పిల్లల తల్లులకు పోషణ పక్వాడాపై అవగాహన కల్పించారు.
AKP: స్వచ్ఛ రథం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కైలాసపట్నంలో స్వచ్ఛరథం గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అట్టపెట్టెలు, పనికిరాని ఇనప వస్తువులు, కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు స్వచ్ఛరథానికి అందిస్తే కావలసిన నిత్యవసర సరుకులను పొందవచ్చునని అన్నారు.
PPM: వీరఘట్టం పీహెచ్సీని ఆకస్మికంగా డా. ఎన్.ప్రభాకర రెడ్డి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగులతో స్నేహభావంగా మెలగాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అలాగే, రోగులు ఆసుపత్రిలోకి అడుగు పెట్టిన నాటి నుంచి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లేంత వరకు పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు.
ప్రకాశం: జిల్లాలో రోడ్డు ప్రమాదల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మూల మలుపులు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో పోలీసులు మిర్రర్లు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు నివారణకు మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ASR: డుంబ్రిగుడ మండలంలోని గిరిజన గ్రామాలకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సేవా కేంద్రాల ద్వారా ఖాతాల ప్రారంభం, ఇన్సూరెన్స్ వంటి సేవలు 5 నిమిషాల్లో అందిస్తున్నారు. డోర్స్టెప్ బ్యాంకింగ్ సదుపాయం కల్పించామని జోనల్ హెడ్ శ్రీనుబాబు తెలిపారు. గిరిజనులకు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
CTR: ఆరోగ్య సూత్రాలు పాటించినప్పుడే రోగాలు దరి చేరవని పుంగనూరు అర్బన్ PHC డాక్టర్ కిరణ్మయి విద్యార్థులకు సూచించారు. గురువారం మేలుపట్ల గిరిజన బాలికల వసతి గృహంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యక్తిగత శుభ్రత, హ్యాండ్ వాష్, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ అవగాహన కల్పించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
ELR: పోలవరం కుడి కాలువ పరిసర గ్రామాలకు గోదావరి జలాలను తాగునీరుగా అందించేందుకు తక్షణమే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇవాళ దెందులూరులో నిర్వహించిన ‘జలజీవన్ మిషన్ 2.0’ సమీక్షలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడడమే తమ లక్ష్యమని, అధికారులు సమన్వయంతో పనిచేసి అంచనాలు రూపొందించాలన్నారు.
W.G: కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యమని వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు అన్నారు. ఇవాళ తాడేపల్లిగూడెం తన కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. జెండా మోసిన కార్యకర్తల సూచనలు, సలహాల మేరకు ముందుకు సాగుతామన్నారు. జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.
KDP: గ్యాస్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారి సునీల్ కుమార్ రెడ్డి మహిళలకు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఇవాళ పులివెందులలోని జయమ్మ కాలనీలో ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్లను ఆఫ్ చేయాలన్నారు.
NDL: బనగానపల్లెలోని SRBC కాలనీలో ఇవాళ ఈద్గా కూల్చివేత ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. ఘటన స్థలానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈద్గా కూల్చివేత సమయంలో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో నిర్మాణాల కన్నా కూల్చివేతలే అధికంగా ఉన్నాయని కాటసాని ఆరోపించారు.
SKLM: జిల్లాలో ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,855 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు.
కృష్ణా: వల్లభనేని వంశీ తనపై సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు. గురువారం ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారం చేస్తున్న వారి ఆధారాలను వంశీ పోలీసులకు సమర్పించారు. వీడియో మార్ఫింగ్ చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.