GNTR: ఫిరంగిపురం మండలం ఎర్రగుంట్లపాడు గ్రామ పరిధిలోని NSP కాల్వ లాకుల వద్ద శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వెలుగులోకి వచ్చింది. మృతుడు సుమారు 40-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతని ఎడమ చేతిపై “ఫరోన్ ఇమాన్ షా” అనే పచ్చబొట్టు ఉంది. మృతుని వివరాలు తెలిసిన వారు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
CTR: పుంగనూరు పట్టణంలోని స్థానిక BMS క్లబ్ ఆవరణలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి. శివ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు.
KRNL: మంత్రాలయం మండల పరిధిలోని కలుదేవకుంట గ్రామంలో పట్ట పగలే దొంగలు ఓ ఇంట్లో రూ.50 వేల నగదును చోరీ చేసినట్లు బాధితుడు జగదీష్ తెలిపారు. శనివారం ఉదయం తన అన్న కుమారుడికి సంబంధం మాట్లాడేందుకు గ్రామంలోనే తన అన్న ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నగదును దోచుకున్నట్లు బాధితుడు తెలిపాడు.
W.G: జిల్లాలోని జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు అమలు చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను మరో ఏడాది అనగా 2026-27కు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ జీవోఎంఎస్ 43 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SKLM: సరుబుజ్జిలికి చెందిన భద్ర రామారావును వైసీపీ ఆర్టీఐ విభాగం స్టేట్ సెక్రటరీగా నియమించారు. ఈ నియామకానికి పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైసీపీ ఆర్టీఐ వింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, ఆర్టీఐ విభాగ రాష్ట్రస్థాయి సమావేశంలో శనివారం అభినందనలు తెలిపారు.
PPM: నీలకంఠాపురం ప్రధాన రహదారిపై ఎస్సై నీలకంఠ రావు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టాలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
GNTR: తెనాలిలో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి ఇవాళ సోలార్ హెల్మెట్లు పంపిణీ చేశారు. సోలార్ ద్వారా చల్లదనం కలిగించే ఫ్యాన్లతో ఉన్న 40 హెల్మెట్లను అందించారు. పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు దివంగత నేతి పరమేశ్వర శర్మ కుమారుడు, కేంద్రీయ విద్యాలయ విశ్రాంత ప్రిన్సిపల్ చలపతి దంపతులు వితరణగా ఇచ్చారు. కార్యక్రమంలో వన్ టౌన్, టు టౌన్ సీఐలు పాల్గొన్నారు.
KKD: తాళ్లరేవు 216 జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ముమ్మిడివరం నుంచి ఒరిస్సాకు కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న లారీ కింగ్ పిన్ విడిపోవడంతో నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
PLD: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే సమాజ సమానత్వం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
కోనసీమ: అంతర్వేది శ్రీలక్ష్మినరసింహ స్వామివారిని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి , వేదాశీర్వచనం అందించారు. అలాగే, స్వామివారి దర్శన అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ శ్రీ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
AKP: ఎస్.రాయవరం మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. గాజువాక నుంచి నక్కపల్లి వైపు బైక్పై పప్పల సుజాత వెనక కూర్చుని వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఆమెపై నుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ASR: అనంతగిరి మండలం జాలాడ నుంచి కుడియా వరకు రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రహదారి అంతా కంకర రాళ్లతో ఉండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. శనివారం ఇద్దరు ఉపాధ్యాయులు బైక్పై వస్తుండగా వాహనం జారి పడిపోవడంతో స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. తక్షణమే అధికారులు రహదారి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
KDP: ముద్దనూరు మండలంలో జరిగిన గొర్రెల దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. కే.తిమ్మాపురం, కొలవాలి గ్రామాల్లో రాత్రివేళల్లో గొర్రెల దొంగతనాలు జరిగిన ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో తాడిపత్రి మండలానికి చెందిన గంగరాజు, చంద్ర కులయ్య ఈ దొంగతనాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. శనివారం వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
ATP: శింగనమల నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ సాకే శైలజనాథ్ శనివారం సోషల్ మీడియా, ఐటీ విభాగం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలందరూ తన కుటుంబ సభ్యులతో సమానమని, వారిని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగనన్న కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఏఐ సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించారు.
W.G: జిల్లాలో జలధార-జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలనీ అధికారులని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శనివారం అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అటవీ అధికారులు లంక, తీరప్రాంత గ్రామాలలో మడ అడవులు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.