AKP: స్వచ్ఛ రథం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కైలాసపట్నంలో స్వచ్ఛరథం గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అట్టపెట్టెలు, పనికిరాని ఇనప వస్తువులు, కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు స్వచ్ఛరథానికి అందిస్తే కావలసిన నిత్యవసర సరుకులను పొందవచ్చునని అన్నారు.
PPM: వీరఘట్టం పీహెచ్సీని ఆకస్మికంగా డా. ఎన్.ప్రభాకర రెడ్డి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగులతో స్నేహభావంగా మెలగాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అలాగే, రోగులు ఆసుపత్రిలోకి అడుగు పెట్టిన నాటి నుంచి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లేంత వరకు పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు.
ASR: డుంబ్రిగుడ మండలంలోని గిరిజన గ్రామాలకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సేవా కేంద్రాల ద్వారా ఖాతాల ప్రారంభం, ఇన్సూరెన్స్ వంటి సేవలు 5 నిమిషాల్లో అందిస్తున్నారు. డోర్స్టెప్ బ్యాంకింగ్ సదుపాయం కల్పించామని జోనల్ హెడ్ శ్రీనుబాబు తెలిపారు. గిరిజనులకు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
CTR: ఆరోగ్య సూత్రాలు పాటించినప్పుడే రోగాలు దరి చేరవని పుంగనూరు అర్బన్ PHC డాక్టర్ కిరణ్మయి విద్యార్థులకు సూచించారు. గురువారం మేలుపట్ల గిరిజన బాలికల వసతి గృహంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యక్తిగత శుభ్రత, హ్యాండ్ వాష్, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ అవగాహన కల్పించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
W.G: కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యమని వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు అన్నారు. ఇవాళ తాడేపల్లిగూడెం తన కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. జెండా మోసిన కార్యకర్తల సూచనలు, సలహాల మేరకు ముందుకు సాగుతామన్నారు. జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.
ELR: పోలవరం కుడి కాలువ పరిసర గ్రామాలకు గోదావరి జలాలను తాగునీరుగా అందించేందుకు తక్షణమే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇవాళ దెందులూరులో నిర్వహించిన ‘జలజీవన్ మిషన్ 2.0’ సమీక్షలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడడమే తమ లక్ష్యమని, అధికారులు సమన్వయంతో పనిచేసి అంచనాలు రూపొందించాలన్నారు.
KDP: గ్యాస్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారి సునీల్ కుమార్ రెడ్డి మహిళలకు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఇవాళ పులివెందులలోని జయమ్మ కాలనీలో ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్లను ఆఫ్ చేయాలన్నారు.
NDL: బనగానపల్లెలోని SRBC కాలనీలో ఇవాళ ఈద్గా కూల్చివేత ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. ఘటన స్థలానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈద్గా కూల్చివేత సమయంలో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో నిర్మాణాల కన్నా కూల్చివేతలే అధికంగా ఉన్నాయని కాటసాని ఆరోపించారు.
SKLM: జిల్లాలో ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,855 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు.
కృష్ణా: వల్లభనేని వంశీ తనపై సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు. గురువారం ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారం చేస్తున్న వారి ఆధారాలను వంశీ పోలీసులకు సమర్పించారు. వీడియో మార్ఫింగ్ చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. భూ వివాదాలు, మ్యుటేషన్ దస్త్రాలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
VZM: ప్రజలకు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను డీసీసీబీ అందిస్తోందని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు. ఈ మేరకు విజయనగరం పట్టణానికి చెందిన ఎం. లక్ష్మి నారాయణ, ఛైర్మన్ సమక్షంలో గురువారం విజయనగరం బ్రాంచ్లో FD రూపంలో రూ. 5,10,000లు జమ చేశారు. డీసీసీబీ ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తూ ఆర్థికంగా బలంగా ఎదుగుతోందన్నారు.
W.G: ఉపాధి హామీ పథకం కార్మికులకు ముఖ ఆధారిత మస్తర్ విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు డిమాండ్ చేశారు. ఇవాళ తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో ఉపాధి హామీ పని ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ముఖ ఆధారిత మస్తర్ విధానం వల్ల కూలీల కళ్లు సరిగా స్కాన్ కావడం లేదన్నారు. దీంతో నిరాశతో కూలీలు వెనుతిరుగుతున్నారన్నారు.
PPM: సీతానగరం మండలం చినభోగిలి గ్రామంలోని శ్రీ రామాలయాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం సందర్శించారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం ఆయన శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
VZM: జామి మండలం కుమారం గ్రామంలో గురువారం ACLP డ్వాక్రా సంఘాల శిక్షణ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎం అప్పలనాయుడు మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా యాన్యువల్ క్రెడిట్ లైలీవుడ్ ప్లాట్స్, వార్షిక రుణ జీవనోపాదుల ప్రణాళిక వంటి అంశాల మీద చర్చించారు.