KRNL: దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే జనగణనలో భాగంగా మొట్టమొదటిసారిగా ప్రవేశ పెట్టిన ఈ-స్వీయ గణన రేపటితో ముగియనుందని, శుక్రవారం నుంచి గృహ గణన సర్వే ప్రారంభమవుతుందని కమిషనర్ చల్లా ఓబులేసు ఇవాళ తెలిపారు. ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నందున ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వీయ జనగణనలో భాగంగా తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని కోరారు.
GNTR: మంగళగిరి మండలం చినకాకానిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మంత్రి లోకేష్ చొరవతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. లలిత హాస్పిటల్స్ యాజమాన్యం తమ సీఎస్సార్ నిధుల కింద రూ.80 లక్షలు కేటాయించింది. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తయితే సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు సౌకర్యంగా ఉండనుంది.
ప్రకాశం: తాళ్లూరు మండలం సోమవరప్పాడు గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంటు లోడ్తో వెళ్తున్న లారీని శివరాంపురం రోడ్డు మలుపు వద్ద వెనుక వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. గ్రీన్ ఫీల్డ్ హైవేకి మట్టి సరఫరా చేస్తున్న ఈ టిప్పర్ అదుపుతప్పి లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ వడ్డే సుంకప్పకు తీవ్ర గాయాలు అయినట్లు తెలిసింది.
KDP: చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను పులివెందుల జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటన జర్నలిస్టుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ పులివెందుల జర్నలిస్టుల సంఘం నాయకులు స్థానిక డీఎస్పీ మురళి నాయక్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
విజయనగరంలో విశ్వసాహితీ కళావేదిక సంస్థ ఆవిర్భావం బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయములో ఘనంగా జరిగింది. సమాజానికి ముఖ్యంగా యువతను ప్రోత్సహిస్తూ సాహిత్యము, సంస్కృతి, సేవ విభాగాలలో కళాకారులను ప్రోత్సహించాలి అన్నది ముఖ్య ఉద్దేశ్యమని సంస్థ అధ్యక్షురాలు భోగరాజు సూర్య లక్ష్మి తెలిపారు. అనంతరం పలు రంగాలలో సేవలందించిన వారికి సత్కరించారు.
VZM: కొత్తవలస మండలం వీరభద్రపురం పంచాయతీ పరిధిలో నిర్మించిన శ్రీ పైడితల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కోనసీమ: రామచంద్రపురం మండలం రత్నంపేట మున్సిపల్ హైస్కూల్లో వేసవి వినోద కార్యక్రమాలు బుధవారం సందడిగా జరిగాయి. జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి రామారావు విద్యార్థులకు గణిత సూత్రాలు, క్లిష్ట సమస్యలను సరళంగా వివరించారు. అనంతరం చిత్రకళ ఉపాధ్యాయుడు త్రినాధ్ విద్యార్థులకు డ్రాయింగ్లో మెలకువలు గురించి వివరించారు.
E.G: రాజమండ్రిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధిపై ఫోకస్ పెడుతున్నట్లు నగర కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. ఫుట్ పాత్లు, డ్రెయిన్ల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పలు ఆక్రమణలను గుర్తించి ముందస్తు నోటీసులు ఇచ్చామని, పక్కా ప్రణాళికతో వాటిని తొలగిస్తామన్నారు. నగర సుందరీకరణకు ప్రజలు సహకరించాలని కోరారు.
సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు కొత్తచెరువు మండలం మైలేపల్లిలో మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీం అవగాహన సదస్సు నిర్వహించింది. మహిళలు అత్యవసర వేళల్లో శక్తి యాప్ను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. బాల్య వివాహాల దుష్పరిణామాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు.
SKLM: మెలియాపుట్టి మండలంలోని కోసమాల, మెలియాపుట్టి గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు ఎంపీడీవో పి. నరసింహ ప్రసాద్ తెలిపారు. స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా మెలియాపుట్టిలో చెత్తాచెదారాలను తొలగించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు తెలిపారు. ఆయనతో పాటు డిప్యూటీ ఎంపీడీవో వి. అప్పయ్య, తదితరులు ఉన్నారు.
మార్కాపురం కలెక్టర్ ఎం.విజయ సునీత స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలను మార్చాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. గ్రామాల్లో రహదారుల వెంట ఉన్న చెత్తను తొలగించి శుభ్రత పాటించాలని, ప్రతి బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
GNTR: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనను కలిసి అభినందించారు. లోకేష్ సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదిన వేడుకలు నిర్వహించారు.
PLD: చిలకలూరిపేట మండలంలోని 15 పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ స్పష్టం చేశారు. బుధవారం ఓ బంకును ఆయన తనిఖీ చేశారు. వాహనదారులు ఆందోళన చెంది అనవసరంగా ఆయిల్ స్టాక్ చేసుకోవద్దని సూచించారు. వ్యవసాయానికి ఆయిల్ కావాల్సిన రైతులు వీఏవో వద్ద కూపన్ తీసుకుని పొందవచ్చన్నారు.
CTR: పూతలపట్టు జనసేన నాయకులు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ని హైదరాబాదులోని వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రఘురాం చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు పూల ప్రభాకర్ పాల్గొన్నారు.
అన్నమయ్య: కోడూరు మండలంలో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ ఛైర్మన్ కేకే చౌదరి అధికారులను ఆదేశించారు. ఇవాళ కోడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని ప్రధాన సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.