SKLM: పోలాకి మండలంలో జడూరు గ్రామంలో కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు శనివారం రాత్రి వ్యభిచార గృహంపై దాడి చేశారు. అప్పటికే అక్కడ ఉన్న ఓ మహిళను, విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు నిర్వాహకులను అరెస్టు చేసినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.
VSP: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేడు జిల్లా పర్యటనకు రానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నగరంలోని సంపత్ వినాయనగర్, సింహాచలం దేవస్థానం పాలకమండలి ఛైర్మన్తో భేటీ కానున్నారు. అనంతరం సింహాచలం అప్పన్నస్వామి, కనకమహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొనున్నారు.
ELR: డిసెంబర్ 16న సీఎం చంద్రబాబు పోలవరం చేరుకుంటారని కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డయాఫ్రమ్ వాల్ తదితర ప్రాజెక్టులను సీఎం పరిశీలిస్తారని, అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారని అన్నారు. ఈ సందర్భంగానే అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
VZM: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా బి.సి. సంక్షేమ శాఖ అధికారి పెంటోజీ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి అమరజీవికి ఘనంగా నివాళులు అర్పించనున్నట్లు వెల్లడించారు.
ASR: ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి అందాలు ఎంతో బాగున్నాయని డ్వామా పీడీ డా. విద్యా సాగర్ అన్నారు. శనివారం చింతపల్లి మండలం లంబసింగిలో పర్యటించారు. మంచు అందాలు ఆస్వాదించారు. చెరువులవేనం వ్యూ పాయింట్ వద్ద సందర్శించారు. తాజంగి జలాశయంలో బోటు షికారు చేశారు. ప్రకృతి అందాలు ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పండిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోటలను పరిశీలించారు.
ప్రకాశం: మార్కాపురం పరిధిలోని బోడపాడు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-ఒంగోలు హైవే పై శనివారం బైక్ను, ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
TPT: ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్పపీడం ఏర్పడనుందని రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తిరుపతిలోను ఈనెల 17, 18 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ప్రకాశం: గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా సౌత్ జోన్ ఇండియా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ముండ్లపాడు సెయింట్ జేకబ్స్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పాల్గొనాలనుకునే వారు ఈ నెల 20లోపు పేర్లను నమోదు చేసుకోవాలని, ఎంట్రీ ఫీజు రూ. 500 చెల్లచాలన్నారు.
KDP: వేముల మండలంలో మీడియా విలేకరులపై జరిగిన దాడిని ఖండిస్తూ గాలివీడులో డిప్యూటీ తాహశీల్దారుకు శనివారం విలేకరులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటి సంఘాల ఎన్నికలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం అమానుషం అన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
VSP: భారత నౌకాదళం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఇవాళ 9వ ‘వైజాగ్ నేవీ మారథాన్’ ఆర్కే బీచ్ వద్ద నిర్వహిస్తున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. ఉదయం విశ్వప్రియ ఫంక్షన్ హాలు నుంచి తెల్లవారుజామున 4.15 గంటలకు మారథాన్ను ప్రారంభిస్తారన్నారు. మారథాన్ ముగిసిన అనంతరం ఉదయం 7 గంటలకు ప్రశంసాపత్రాల పంపిణీ ఉంటుందన్నారు.
NLR: నెల్లూరు జిల్లాలో పదివేల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు నగరంలోని వేమిరెడ్డి నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో జిల్లాలో నిరుద్యోగ సమస్య లేకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తామన్నారు.
NLR: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కానుగ చెట్టు ఆకుపై వారి చిత్రాన్ని విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ.పెంచలయ్య గీశారు. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన ఆయన పలు ముఖ్యమైన సందర్భాల్లో ప్రముఖుల చిత్రాలను వివిధ రకాల ఆకులపై గీసే అభిరుచి ఉంది. ఈ క్రమంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రాన్ని గీశారు.
VZM: బొబ్బిలి పట్టణంలోని స్థానిక గ్రోత్ సెంటర్ సమీపంలో సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించిన లోడ్ విశాఖ నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న రెండు సిలికా మాంగనీస్ లారీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఒక్కో లారీకి రూ. 30 వేలు చొప్పున జరిమానా విధించినట్లు వెల్లడించారు.
NLR: నెల్లూరు నగరం 33/11 కె.వి ఆటోనగర్ సబ్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ ఫీడర్ వద్ద చెట్ల కొమ్మలు తొలగించుటకు ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నెల్లూరు టౌన్ డివిజన్ ఈఈ ఎం శ్రీధర్ తెలిపారు. ఆటోనగర్ పరిసర ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు.
ATP: ఆరు నెలల పాటు కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ ఇప్పుడు బయటకొచ్చి కీస్ కీస్ మంటున్నాయంటూ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేపట్టిన రైతు పోరుబాటపై ఆమె తీవ్రంగా స్పందించారు. అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. అసలు వైసీపీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా.. అని నిలదీశారు.