E.G: దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో 40 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదం ముగిసింది. కొల్లూరు సుబ్బమ్మకు చెందిన 14 ఎకరాల భూమిని 1982 నుంచి పాసుపుస్తకాలు లేకుండానే స్థానిక పేద రైతులు సాగు చేస్తున్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించగా, తాజాగా భూమి హక్కు పట్టాదారులదేనని తీర్పు వెలువడింది. శనివారం ఎమ్మెల్యే మద్దిపాటి లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు.
ELR: నూజివీడు పట్టణంలోని శారద డిగ్రీ కళాశాలలో 25వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారని కోఆర్డినేటర్ డి.రామకృష్ణ తలిపారు. 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొనే ఈ మేళాలో 925 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు హాజరు కావాలని ఆయన కోరారు.
NDL: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇవాళ బనగానపల్లె మండలం నందవరం ఆలయానికి వస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు తెలిపారు. నందవరంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనానికి మంత్రి సత్యకుమార్ వస్తున్నారని చెప్పారు. రాత్రి 8 గంటలకు నందవరం ఆలయానికి వస్తారని, ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ATP: జిల్లా మట్టి వాసనతో రూపొందిన ‘సొట్టా బుగ్గల పిల్లో’ ఫోక్ సాంగ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి అతిథిగా పాల్గొని పాటను ఆవిష్కరించారు. అనంతపురం స్వరం, ఇక్కడి లొకేషన్లలోనే చిత్రీకరించిన ఈ జానపద గీతంపై ఆమె ప్రశంసలు కురిపించారు. కళాకారులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
PPM: బలిజిపేట మండలం అజ్జాడ గ్రామంలో శనివారం YCP సీనియర్ కార్యకర్తల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన పెంకి సంజీబు, బడే నరసింహ నాయుడు, పోల చిన్నం నాయుడు కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చిత్తూరు జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ప్రకటన విడుదలైనట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. చిత్తూరులోని ఇరువారం, కుప్పంలోని కేంద్రీయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కృష్ణా: గన్నవరం మండలంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఇవాళ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బలిపర్రు, వీరపనేనిగూడెం, తెంపల్లి ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు కరెంట్ నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.
KRNL: ఈనెల 26న జిల్లాలోని కిడ్స్ వరల్డ్ రోశయ్య కమ్యూనిటీ హాల్లో 8వ జిల్లాస్థాయి ఉషూ పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి టి.శ్రీనివాసులు తెలిపారు. పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ తన కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.
VZM: వీధులలో CC కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని బొబ్బిలి సీఐ కె.నారాయణరావు సూచించారు. శనివారం సాయంత్రం స్దానిక ఆకులరెల్లివీధిలో గ్రామస్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చన్నారు. అలాగే శక్తి మొబైల్ యాప్ను మహిళలు స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు.
VSP: మధురవాడ శిల్పారామంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయ శిల్పారామం పరిపాలనాధికారి రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘గగన సిరి డాన్స్ అకాడమీ’ ఆధ్వర్యంలో కళాకారులు కూచిపూడి, జానపద నృత్యాలు ప్రదర్శిస్తారన్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు.
NDL: పాణ్యం మండలం కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి భక్తులు రూ.50 వేల విరాళం అందజేసినట్లు ఈవో రామకృష్ణ శనివారం తెలిపారు. పాణ్యానికి చెందిన వెంకట చంద్రశేఖర్ బాబు-విజయలక్ష్మి దంపతులు స్వామివారి ఇలవేల్పు కావడంతో విరాళం అందజేశారు. దాతలకు స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేసి సత్కరించారు.
PLD: బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు, రామాపురం పేరూరుపాడు, బొల్లాపల్లి, రేమిడిచర్ల తదితర గ్రామాలలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు ఒకరినొకరు ఆలింగణం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. రంజాన్ సందర్భంగా మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేశ శాంతి సౌభాగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రకాశం: పెట్రోల్ బంకుల్లో క్యాన్లలో పెట్రోల్ నింపడం ఆపేయమని ఉత్తర్వులు వచ్చినట్లు కొండపి మండలం పెట్లూరు బంకు యజమాని వేణుగోపాల్ శనివారం తెలిపారు. రైతుల అవసరాలకు డీజిల్ మాత్రం క్యాన్లలో కొట్టవచ్చని నిబంధన ఉందన్నారు. పెట్రోల్ వాహనాలకు మాత్రం కొట్టమని కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
CTR: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజలు ఆస్తి పన్ను చెల్లించడానికి ఆదివారం సైతం వసూళ్ల కేంద్రాన్ని అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ నరసింహప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్పొరేషన్ కార్యాలయంలో పన్ను వసూళ్ల కేంద్రాలు పనిచేస్తాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కృష్ణా: విశ్వనాథపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు ఊరటగా ఆదివారం మినుములు, పెసల కొనుగోలు కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రభుత్వ కనీస మద్దతు ధరల ప్రకారం నాణ్యత ఆధారంగా పంటలను స్వీకరిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. మినుములకు సుమారు రూ. 7,800, పెసలకు రూ. 8,700 పైగా ధరలు లభిస్తున్నాయని చెప్పారు.