NTR: కంచికచర్ల పట్టణంలోని స్థానిక చెవిటికల్లు సెంటర్లో సోమవారం ఆటో డ్రైవర్లకు ఎస్సై నాని నరేందర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆటోలను ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ నిలిపి ఇతర వాహనాదారులకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
VZM: జనసేన సభ్యత్వ నమోదు ఈనెల 26 నుంచి ప్రారంభం కానుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. ఈ సందర్బంగా భోగాపురం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని, ప్రతి నాయకుడు సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.
NLR: బుచ్చి మండలంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయాన్నే ఎనిమిది గంటలకు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. అధికారులు హాల్ టికెట్లు క్షుణ్ణంగా పరిశీలించి, విద్యార్థులను లోపలికి అనుమతించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
విశాఖపట్నంలో 10 రోజులుగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 41 కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించారని చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన బస్సులపై రూ.3,52,870 చలానా విధించినట్లు వెల్లడించారు.
E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన అబ్దుల్ కలాం స్కూల్ విద్యార్థులు కరాటేలో అద్భుత ప్రతిభ చాటారు. నిడదవోలులో జరిగిన మూడవ సౌత్ ఇండియా కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్లో వీరు స్వర్ణ, రజత పతకాలు సాధించారు. ఈ పురస్కారాలను మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు అందజేశారు. విద్యార్థుల ప్రతిభపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ATP: గుత్తిలోని గుంతకల్లు రోడ్డులో సోమవారం బైకు అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవికుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఉపాధ్యాయుడిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అన్నమయ్య: రాజంపేట పట్టణ పరిధి మన్నూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వల్లీ దేవసేన సమేత స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం స్వామి వారి కళ్యాణం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ సాయంత్రం గ్రామోత్సవం ఉంటుందని వివరించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.
NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సోమవారం పూజలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
VZM: కొత్తవలస కూడలిలో ఇటీవల రైల్వే భూగర్భ వంతెన వద్ద వర్షం నీరు లోనికి ప్రవేశించకుండా కాలువ నిర్మాణం చేశారు. దీంతో వంతెన వెడల్పుగా ఉండడంతో వాహన ప్రమాదాలు జరగకుండా పోలీసులు మధ్యలో స్టాపరును ఏర్పాటుచేశారు. కూడలి నుంచి సబ్బవరం వెళ్లే వాహనాలు ఎడమవైపు నుంచి, అటు నుంచి కూడలికి వచ్చే వాహనాలు ఎడమవైపు వాహనాలు చూసుకొని కూడలికి చేరుకునేలా స్టాపరును ఏర్పాటు చేశారు.
SKLM: ఆమదాలవలస పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్ను మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి క్యాంటీన్లో అందిస్తున్న ఆహారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.పేద ప్రజలకు రుచికరమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ATP: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేత జేసీ దివాకర్ రెడ్డి. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అనుచరులు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన, వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. వయోభారం కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు.
W.G: నరసాపురంలోని 25వ వార్డు ఆదర్శనగర్కు చెందిన శ్రీశైలం హరి కనక సాయి(31) అనే యువకుడు మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున సాయి బైక్పై వెళ్తుండగా అంబేడ్కర్ విగ్రహం వద్ద బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వం ఆసుపత్రి తరలించారు.
TPT: జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయంలో పల్లె నిద్ర గ్రామసభలను నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో ఓటీపీ మోసాలు, ఫేక్ లింకులు, లోన్ యాప్ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి ఘటనల గురించి వివరించారు. సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే ఫిర్యాదు చేయాల్సిన విధానం, సంబంధిత హెల్టైన్ నంబర్ల వివరాలను తెలియజేశారు.
E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలోని 10 MLD విభాగం మరమ్మతుల కారణంగా 45, 46, 47, 48, 49వార్డుల్లో ఇవాళ్టి నుంచి నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ రీటా తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం రేపటి నుంచి యథావిధిగా నీటి సరఫరా పునఃప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
KRNL: కోసిగి మండలంలో ఎమ్మిగనూరు ఆర్కే కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో 50 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు చేశారు. సీఐ మంజునాథ్ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. డా. హేమంత్ కుమార్ నిరుపేదలకు సేవలు కొనసాగిస్తామని తెలిపారు.