• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పుట్టా

కడప: ఖాజీపేట మండల పరిధిలోని పుల్లూరు గ్రామ సచివాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలించారు. ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది హాజరు పట్టికలో సంతకాలు చేసి కార్యాలయంలో లేకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేకపోతే ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 30, 2024 / 12:17 PM IST

మహిశాసుర మర్దిని అలంకారంలో విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు ప్రవేట్ బస్టాండ్ సమీపంలో ఉన్న మహిమాన్విత శక్తి స్వరూపిణి విరుపాక్షి మారెమ్మ ఆలయంలో అమావాస్య సందర్బంగా అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా మహిశాసుర మర్దిని అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాహుకాల పూజకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజ కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ వారు భక్తదులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

December 30, 2024 / 12:17 PM IST

గజపతినగరంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ

VZM: గజపతినగరంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ జరిగింది. బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సోమవారం సర్కిల్ పరిధిలో గల ఎస్ఐలు, మహిళా పోలీసులు పోలీసు సిబ్బంది హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై అవగాహన ర్యాలీ చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ జరిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. ఎస్ఐలు లక్ష్మణరావు మహేష్ పాల్గొన్నారు.

December 30, 2024 / 12:08 PM IST

పాపికొండల విహారయాత్రకు 6 బోట్లు

E.G: దేవీపట్నం మండలం నుంచి పాపికొండలు విహారయాత్రకి సోమవారం 6 పర్యాటక బోట్లు వెళ్లాయని టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అందర్నీ బోట్లు ఎక్కించి, లైఫ్ జాకెట్లు ఇచ్చామని తెలిపారు. ఆరు బాటలలో 300 మంది ప్రయాణికులు విహారయాత్రకు వెళ్లారని తెలిపారు.

December 30, 2024 / 12:06 PM IST

‘రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి’

బాపట్ల: నియోజకవర్గంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలు అన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేస్తుందని నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ అన్నారు. బాపట్ల మండలం కొండుబోట్లపాలెం గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఆఫీసర్ షాలిమ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

December 30, 2024 / 12:06 PM IST

కోర్టులో విధులను బహిష్కరించిన న్యాయవాదులు

NDL: నంద్యాల జిల్లా కోర్టులో న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు. అనంతపురంలో న్యాయవాది శేషాద్రి పోలీసుల వల్ల గుండెపోటుతో మరణించారని, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. నేడు కోర్టు విధులు బహిష్కరించి, రేపు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

December 30, 2024 / 12:05 PM IST

దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి: ప్రజా సంఘాలు

ATP: గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద సోమవారం ప్రజాసంఘాలు, అఖిలపక్షాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు నిర్మల, నాగభూషణం మాట్లాడుతూ.. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు.

December 30, 2024 / 12:04 PM IST

దేహదారుఢ్య పరీక్షల రిహార్సల్‌ను పరిశీలించిన ఎస్పీ

కర్నూలు నగరంలోని ఏపీఎస్పీ రెండో బెటాలియన్ మైదానంలో  ఈ రోజు నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు  దేహదారుఢ్య పరీక్షల రిహార్సల్స్ ఏర్పాట్లను ఎస్పీ జి. బిందుమాధవ్ పరిశీలించారు. పరీక్షల నేపథ్యంలో పాల్గొనే పోలీసు అధికారులు, కొంత మంది యువకులతో ఆయన రిహార్సల్స్ నిర్వహించారు. పోలీసు అధికారులకు, సిబ్బందితో సమావేశమై పకడ్బందీగా, నిర్వహించాలని ఆదేశించారు.

December 30, 2024 / 12:03 PM IST

విశాఖలో 66 మందికి పైగా బదిలీ

విశాఖపట్నంలోని సెంట్రల్ జైలులో అధికారుల బదిలీ అయ్యారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లోని వార్డెన్లను ఖైదీల ఎదుట దుస్తులు విప్పించి చెక్ చేశారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సుమారు 66 మందికిపైగా సిబ్బందిని బదిలీ చేసినట్లు ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు.

December 30, 2024 / 12:01 PM IST

పింఛన్ పంపిణీలో నాయకులు పాల్గొనాలి: కొమ్మలపాటి

PLD: డిసెంబర్ 31న జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పెదకూరపాడు మండలంలోని నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలన్నారు.

December 30, 2024 / 11:58 AM IST

కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ.1లక్ష విరాళం

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి ప్రత్యేక చొరవతో ఆసుపత్రిలో అభివృద్ది పనులు సాగుతున్నాయి. కనిగిరికి చెందిన తమ్మినేని ప్రభాకర్ రెడ్డి, కందుల నారపరెడ్డి ఏడుకొండలు తదితరులు రూ.1లక్ష విరాళం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డికి అందజేశారు.

December 30, 2024 / 11:56 AM IST

‘ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగించాలి’

BPT: కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగించుకుని, ఆరోగ్యవంతమైన ఆరోగ్యం పొందాలని యూనిట్ ఇంచార్జి మన్నెం సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం కూరగాయల స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిఆర్పిలు నందిని, తిరుపతమ్మ, స్యామేలు, భులక్షి, భారతి, రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

December 30, 2024 / 11:56 AM IST

డిజిటల్ అరెస్టుల పేరుతో ఫోన్ వస్తే భయపడవద్దు: సీఐ

NTR: కంచికచర్ల పట్టణ పరిధిలోని రూరల్ సీఐ చవాన్ తన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. డిజిటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా మీకు ఫోన్ చేస్తే భయపడవద్దని సూచించారు. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. హర్ష సాయి ట్రస్ట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు గుర్తించాలని తెలిపారు.

December 30, 2024 / 11:52 AM IST

పార్క్ గేటు తెరవాలని కాళ్లు, చేతులకు సంకెళ్ళతో నిరసన

KKD: సంక్రాంతికి స్వామి వివేకానంద పార్కు తూర్పుగేటు తెరవాలని కోరుతూ సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద కాకినాడకు చెందిన సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు కాళ్ళు చేతులకు సంకెళ్ళతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కు తూర్పు గేటు ప్రవేశ ద్వారం తెరిచేందుకు అధికారులు కుంటి సాకులు చెప్పడం దురదృష్టకరంగా ఉందని రమణ రాజు నిరసన వ్యక్తం చేశారు.

December 30, 2024 / 11:51 AM IST

పేకాట శిబిరం పై పోలీసులు దాడులు

ప్రకాశం: రాచర్ల మండలంలోని రాగిరెడ్డిపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో రాచర్ల పోలీసులు పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.6,530 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయాలు, పేకాట లాంటి అసాంగిక చర్యలకు పాల్పడితే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

December 30, 2024 / 11:49 AM IST