W.G: ఆకివీడు అన్వర్ మసీదులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు పాల్గొన్నారు. విశ్వాసాలు వేరైనా ప్రజలందరూ అన్నదమ్ముల్లా ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అల్లా అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థించారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
అన్నమయ్య: స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధిలో ముందుండాలని ఇరవై సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ దినకర్ అన్నారు. సమీక్షలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాల పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పీఎం ధన ధాన్య కృషి యోజనతో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, మదనపల్లి టమోటోకు విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు పై దృష్టి పెట్టాలని సూచించారు.
VZM: ద్విచక్ర వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. ప్రత్యేక డ్రైవ్లో స్వాధీనం చేసుకున్న 550 సైలెన్సర్లను స్థానిక ట్యాంక్ బండ్ రోడ్డులో మంగళవారం రోడ్డు రోలరుతో ధ్వంసం చేశారు. ఒక్కో వాహనదారుకు రూ.1500 జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.
KRNL: కోడుమూరులోని ఎస్ఎన్ఆర్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలో ఇవాళ సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తూ.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో PLAPUSపై సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా PLAPUS ఛైర్మన్ సీ.హెచ్. రాజ్ గోపాల్ రావు, DLSA కార్యదర్శి ఎన్.శ్రీ లక్ష్మి మాట్లాడారు. విద్యుత్ సరఫరా, త్రాగునీటి సరఫరా తదితర ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన వివాదాలను పర్మనెంట్ అదాలత్లో పరిష్కరించవచ్చని తెలిపారు.
TPT: వరదయ్యపాలెం మండలం చిన్న పాండూరులోని బస్ షెల్టర్ అపరిశుభ్రంగా మారి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు చెత్త వదిలివెళ్లడంతో దుర్గంధం వ్యాపించి, కూర్చోవడానికి వీలు లేక ఎండలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే శుభ్రపరిచి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
PLD: ముప్పాళ్ల మండలంలోని ఇరుకుపాలెం గ్రామం నందు అన్నదాత సుఖీభవ, ఇంటింటికి ప్రచారం అనే కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మినారాయణ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విషయమై రైతన్నలను అడిగి తెలుసుకున్నారు. రానున్న 5 సంవత్సరాలలో రైతును రాజు చేసేందుకు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ అమలు చేయనున్నారు.
KKD: ప్రత్తిపాడు(మం) బౌరువాక సమీపంలోని పులి సంచరిస్తున్న కారణంగా అటవీశాఖ అధికారులు ఆ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. పులి పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అటవీశాఖ అధికారులు మంగళవారం తెలియజేశారు. సమీప గ్రామాల ప్రజలు ఎవరు బయటకు రావద్దని వారు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
VZM: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. నేరాల చేధన, ప్రాణరక్షణ, ఆస్తి రికవరీలో విశేష సేవలు అందించిన వారిని అభినందించారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమన్నారు.
NTR: విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘అతి ఉత్కృష్ట సేవా మెడల్-2025’ను ప్రకటించింది. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, ప్రజాసేవలో నిబద్ధతకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన తీసుకున్న చర్యలు, విశేష ఫలితాలను ఇచ్చాయి. ఈ పురస్కారం పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలుస్తుందన్నారు.
విశాఖపట్నం రుషికొండ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆస్థానం, పంచాంగ శ్రవణం జరుగుతాయని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
GNTR: జిల్లాలో గత ఏడాది కంటే రహదారి ప్రమాదాలు తగ్గాయని, ఇదే చొరవ కొనసాగాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు శ్రద్ధ వహించాలని గత 2024 సంవత్సరంలో 1046 ప్రమాదాలు జరిగాయని, 2025 సంవత్సరంలో 910 జరిగాయని తెలిపారు.
PPM: రంజాన్ మాసం క్రమశిక్షణకు, తోటి వారిపై ప్రేమ, సేవా భావానికి నిదర్శనమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
కోనసీమ: కొత్తపేట(మం) వాడపాలెం రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన రహదారి పనులను పరిశీలించారు. రహదారి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. రహదారిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.