ATP: బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామంలో ఎర్రమట్టి అక్రమ దందాపై వార్త రాసినందుకు దాడికి గురైన ఓ పత్రిక విలేఖరి పెద్దన్నను మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పరామర్శించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సై రామ్ప్రసాద్ను ఫోన్లో కోరారు.
W.G: పాలకొల్లు నియోజకవర్గ ఇంఛార్జ్ గుడాల గోపాల రావు ఆధ్వర్యంలో సోమవారం టీడీపీకి చెందిన రాము వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ యడ్ల తాతాజీ, పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సత్యసాయి: సత్యసాయి శతజయంతి వేడుకల నేపథ్యంలో పుట్టపర్తి వద్ద కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జ్ సర్కిల్లో ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం, ఈ సర్కిల్లో బస్ షెల్టర్తో పాటు మరుగుదొడ్లు, స్నానపు గదులు వంటి కనీస వసతులను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
కోనసీమ: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో లంక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అయినవిల్లి మండలం కొండకుదురు లంక, అయినవిల్లి లంక, వీరవల్లిపాలెంలో ఎమ్మెల్యే పర్యటించి, ప్రజలకు పలు సూచనలు చేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జన సైనికులు, కూటమి శ్రేణులు, కార్యకర్తలు సహాయక చర్యలో పాల్గొనాలని సూచించారు.
W.G: ‘మొంథా’ ముప్పు నేపథ్యంలో ప.గో. అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 90 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. ఏడు ఫైర్ ఇంజన్లు, 10 నీటిని తోడే యంత్రాలు, 80 లైఫ్ జాకెట్లు, 40 లైఫ్ బాయ్స్, 30 రోడ్లతోపాటు అత్యవసర పరికరాలను అందుబాటులో ఉంచారు. 12 బృందాలతో కూడిన 24 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
ASR: మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇళ్లలోనే ఉండాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వైసీపీ నాయకులు అండగా ఉండాలని ఆయన తెలిపారు. అనంతగిరి మండలం కాశీపట్నంలో నాయకులతో సమావేశం నిర్వహించి తుఫాన్ పరిస్థితులపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి నీలవేణి తదితరులు పాల్గొన్నారు.
BPT: టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం నుంచి కొల్లూరు మండలానికి చెందిన పార్టీ కార్యకర్త చొప్పర నాంచారయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం మంజూరైంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాంచారయ్య భార్య స్వాతికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు అందజేశారు. ఆయన క్యాంపు కార్యాలయం ద్వారా పత్రాలు సమర్పించగా, వెరిఫికేషన్ తర్వాత ఈ మొత్తం మంజూరైనట్లు ఆయన వెల్లడించారు.
W.G: మొంథా తుఫాను నేపథ్యంలో తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా సోమవారం అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా తదుపరి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని తెలిపారు.
E.G: నిడదవోలు మండలం కంసాలపాలెం వద్ద గల ఎర్ర కాలువను తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ కన్నబాబు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాలువలు పొంగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో సుస్మిత రాణి పాల్గొన్నారు.
ASR: పీఎం జన్ మన్ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం పెంచిన రూ.1లక్షను వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని గిరిజన సంఘం అరకు మండల అధ్యక్షుడు చిన్నబాబు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం సుంకరమెట్ట గ్రామ సచివాలయం ఎదుట పలువురు ఇళ్ల లబ్దిదారులతో నిరసన తెలిపారు. సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. పెంచిన సొమ్మును జమ చేయకపోతే ఇళ్ల నిర్మాణం ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు.
SKLM: తుఫాన్ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఫోన్లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. వాతావరణం శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసినందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంగళవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంటనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
NLR: తుఫాన్ సందర్భంగా వర్షాలు కురుస్తున్నాయని, తద్వారా ప్రజలకు ఎలాంటి వ్యాధులు వచ్చినా తాము, తమ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటామని కోడూరు పీహెచ్సీ డాక్టర్ హేమ తెలిపారు. ఆమెతో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కలిసి కోడూరు బీచ్ పరిసర ప్రాంతాలను సోమవారం సందర్శించారు. డాక్టర్ హేన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా సంప్రదించాలని కోరారు.
SKLM: జిల్లా రైల్వే ప్రజలకు రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఈ సందర్భంగా తుఫాను ప్రభావంతో అప్రమత్తమైన రైల్వే శాఖ జిల్లా మీదుగా నడిచే దాదాపు 20కి పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ పోస్టు రైల్వే జీఎం పరమేశ్వర సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికుల భద్రత మేరకు ఈ రద్దు ఈనెల 27, 28, 29 తేదీలలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
NLR: మర్రిపాడు మండలం బాట హరిజనవాడలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వాటర్ ప్లాంట్ ప్రారంభించనున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన సొంత నిధులతో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసారన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గం వైసీపీ శ్రేణులు, మేకపాటి అభిమానులు విరివిగా హాజరుకావాలని కోరారు.
AKP: అచ్యుతాపురం -అనకాపల్లి రోడ్డు విస్తరణలో నిర్వాసితులకు హైకోర్టు ఆదేశాల మేరకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కే.లోకనాథ్ డిమాండ్ చేశారు. సోమవారం మునగపాకలో నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. టీడీఆర్ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నారు. నిర్వాసితులకు నగదు చెల్లించాలని తెలిపారు.