ఇప్పటికీ గుర్తు. చెవిలో పువ్వు సినిమా నిర్మాణం టైంలో సుప్రసిద్ధ దర్శకుడు ఇవివి సత్యనారాయణకి అడ్వాన్ ఇవ్వని నిర్మాతే లేడు మద్రాసులో. చెవిలో పువ్వు సినిమాకి వచ్చిన ప్రీ రిలీజ్ బజ్ ఎవ్వరినీ ఇంటి దగ్గర నిద్రపోనివ్వలేదు. ఆడ్వాన్సులు వర్షం కురిసింది ఇవివిపైన. సినిమా రిలీజైంది. సూపర్ ఫ్లాప్. వెంటనే మళ్ళీ ఇవివికి ఫోన్లే ఫోన్లు. అమ్మాయి పెళ్ళి ఫిక్స్ అయిందని ఒకరు, భార్యకి ఆపరేషన్ ఉందని మరొకరు, బ్యాంక్ ఇన్స్టాల్మెంటులు నెత్తిమీదకి వచ్చాయని ఇంకొకరు మొత్తం మీద ఇవివి జేబు ఖాళీ చేసేశారు. ఇవివి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేశారు.
ఇది గమనించిన స్టార్ పొడ్యూసర్ రామానాయుడు, ఇవివిలో పనితనాన్ని గుర్తించి కబురు పెట్టారు. ఎందుకంటే అంతకు ముందు ఆయన తీసిన ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి దర్శకుడు సురేష్ కృష్ణ దగ్గర అసోసియేట్గా పనిచేసినప్పుడు ఇవివి సిన్సియారిటీని, డెడికేషన్ని రామానాయుడు గమనించి, ఇవివిని పిలిచి మరీ ప్రేమఖైదీ సినిమాకి దర్శకుడిగా పెట్టారు. అది సూపర్ డూపర్ హిట్. మళ్ళీ ఇవివికి ఫోన్లు. అడ్వాన్సులు, వరద. తర్వాత ఇవివి ఎంత పెద్ద దర్శకుడయ్యారో అన్నది గత చరిత్ర.
ఇప్పుడదే పరిస్థితి దర్శకుడు మారుతీకి కూడా వచ్చింది. పక్కా కమర్షియల్ చిత్రం జరుగుతున్నప్పుడు ప్రభాస్కి రాజాసాబ్ కథ చెప్పడం జరిగింది. ప్రభాస్కి కథ యమాగా నచ్చింది. నిర్మాత కూడా రెడీ. రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలకి కరువా అన్నట్టుగా ప్రభాస్కి కథ నచ్చిన తర్వాత ఇంకేముంది? నిర్మాతలకి కరువుంటుందా? ఓ పెద్ద నిర్మాతే సూట్కేస్లు సద్దుకున్నారు. అడ్వాన్సుల పండగ ప్రారంభించడానికి. లెక్కలు జరగుతున్నాయి. మంచి హుషారుగా ఉన్నారు సదరు ఆఫీసులో అందరూ.
ఈలోగా, పక్కా కమర్షియల్ రిలీజైంది. బాక్సాఫీసుని పేల్చడానికి బదులుగా సినిమాయే బాంబులా పేలింది. ఆ చప్పుడికి నిర్మాత గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. ఎక్కడికైనా పారిపోయి తలదాచుకోవాలనుకేంతగా గాభరా పడిపోయాడు. మర్నాడే నేనీ సినిమా చేయను బాబాయ్ అని ఫిల్మ్ నగర్ అంతా వినపడేట్టు గగ్గోలు పెట్టేశాడు. అయితే మారుతీ చాలా నిలకడైన దర్శకుడు. తనే ప్రభాస్కి ఫోన్ చేసి తనకి ఫ్లాపు వచ్చిందని, ఇప్పుడా సినిమా చేయలేనని హుందాగా చెప్పి తప్పించుకోవాలని చూశాడు. కానీ మారుతీ చెప్పిన కథమీద మనసు పారేసుకున్న ప్రభాస్ మాత్రం మారుతిని వదలిపెట్టలేదు. రాజాసాబ్ కథలో గొప్పతనం అదే.
అదిగో అప్పుడే ఎంట్రీ ఇచ్చారు పీపుల్స్ మీడియా అధినేత, అగ్రనిర్మాత టిజి విశ్వప్రసాద్. అప్పటివరకూ ఆయనకీ బోలెడు ఫ్లాపులున్నాయి. కానీ మారుతీ చెప్పిన కథకే తనూ ఓటేసి సంతకాలు పెట్టి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అది వందల కోట్ల సినిమాయే అయినా కూడా విశ్వప్రసాద్ ఏమాత్రం చెక్కు చెదరకుండా చెక్కులిచ్చేశారు. మధ్యలో అందరూ విపరీతంగా గాసిప్స్ క్రియేట్ చేశారు. కానీ, విశ్వప్రసాద్ మాత్రం చాలా ధీమాగానే వ్యవహరించారు. సినిమా మీద నమ్మకంతో వందలకోట్లు గుమ్మరించారు. ఇవాళ టీజర్ రిలీజై, షాకిచ్చేవరకూ ఎవ్వడికీ తెలియదు లోపల ఏం జరుగుతోందీ అని. రాజాసాబ్ టీజర్లో చూసినట్టుగా ఆ పాలెస్లో ఏం జరుగుతోందన్నదే రాజాసాబ్లో సస్పెన్స్. అలాగే పీపుల్స్ మీడియా బిల్డింగ్లో జరుగుతున్నది ప్రతీది ఒక సస్పెన్స్ గానే కొనసాగింది. టీజర్ బైటకొచ్చాక మొత్తం పెద్ద ధ్రిల్లర్లా మారిపోయింది. మొత్తం గూస్బంప్సే….
జయాపజయాలు దైవాధీనాలు. కానీ చిత్రపరిశ్రమ, అతి ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ విజయం ఆథీనంలోనే పనిచేస్తుంటుంది. నిజమే కాదనలేం. కానీ హీరోలకి ఆ నిజాయితీ ఉండాలి. కథని నమ్మి చేయాలి. సక్సెస్ని నమ్మి కాదు. మారుతీకి వచ్చిన పరిస్థితే దర్శకేంద్రుడు అనిపించుకున్న రాఘవేంద్రరావుకి కూడా ఒకనాడు వచ్చింది. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి ముందు రాఘవేంద్రరావు ఫ్లాపుల పండగ జరుపుకుంటున్నారు. సినిమా వెళ్ళడమే తరువాయి. ఢామ్మని పెద్ద సౌండ్. ఒకటి కాదు రెండు కాదు. వరస నాలుగైదు లక్ష్మీ బాంబులు. కానీ మెగాస్టార్ చిరంజీవి రాఘవేంద్రరావునే దర్శకుడిగా సైన్ చేశారు. అసలు రాఘవేంద్రరావు కాకపోతే సినిమానే తీయనని అశ్వనీదత్ పట్టుబట్టారు. మెగాస్టార్, అశ్వనీదత్ల నమ్మకాన్ని వమ్ము కానియ్యకుండా, రాఘవేంద్రరావు చరిత్ర మరిచిపోలేని సినిమాని అందించారు. అదే ఇప్పుడు ప్రభాస్ అండ్ విశ్వ ప్రసాద్ చేసిన ఫీట్. మరో చరిత్ర గ్యారెంటీగా రిపీట్.