MDK: రేగోడ్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న DEO విజయ వెంటనే పాఠశాలను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సహకారంతో విద్యార్థులకు తగిన చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
SRD: అనంతారంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు రూ.20 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభించారు. గ్రామంలో సీసీ రోడ్లకు రూ.10 లక్షలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
NZB: పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు (CS), డిపార్ట్మెంటల్ అధికారులదే(DO) ముఖ్య పాత్ర అని జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) రవికుమార్ అన్నారు. శుక్రవారం ఖిల్లా జూనియర్ కళాశాలలో CS, DOలతో నిర్వహించిన సమీక్షలో DIEO మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.
SDPT: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ సమంజసం కాదని ఉప సర్పంచ్ల ఫోరం బెజ్జంకి మండల అధ్యక్షుడు దీటి బాలనర్సు అన్నారు. రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేసి దూర ప్రాంత జైలుకు తరలించారని ఆరోపించారు. క్యాతన్పల్లి ఛైర్మన్ ఎన్నికను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని విమర్శించారు. ప్రజా తీర్పును గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు.
PDPL: బీహార్లోని బసంత్ పూర్కు చెందిన లాల్ కృష్ణ అనే యువకుడు 8 నెలల క్రితం దేశంలోని వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. ఇవాళ ఆయన సైకిల్ యాత్రతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం చేరుకున్నాడు. వీలైన ప్రదేశాలలో సేద తీరుతూ, ప్రతిరోజు 100 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు.
NLG: చిట్యాల పట్టణంలోని లొయోల టెక్నో స్కూల్లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా మున్సిపాల్ ఛైర్మన్ పందిరి గీత రమేష్, ఎస్సై రవికుమార్లు పాల్గొన్నారు. పాఠశాలలో ‘మాక్ కోర్ట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో తాత్కాలిక కోర్టు రూం వాతావరణాన్ని ఏర్పరిచారు.
KMM: ధ్యానం శారీరక, మానసిక ప్రశాంతతకు, ఆనందానికి తోడ్పడుతుందని మధిర మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ సామినేని సుజాత అన్నారు. శుక్రవారం మాటూరుపేట గ్రామంలో నరసింహా పిరమిడ్ కేంద్రం వద్ద వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిరమిడ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ధ్యానాన్ని గ్రామ సర్పంచ్ చిలువేరు పూర్ణమ్మ బుచ్చిరామయ్యతో కలిసి ప్రారంభించి ప్రసంగించారు.
MBNR: క్రీడలు శారీరకదృఢత్వంతో పాటు మానసికస్థైర్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం కప్ పోటీలను ఎమ్మెల్యే జ్యోతివెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధ్యాణ్యత ఇస్తుందన్నారు. యువత భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి PHC సిబ్బంది మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ దీపిక ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హెల్త్ సూపర్వైజర్ సుభాష్, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
KNR: ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ ఇంగిలే రామారావు, ఈవో సుధాకర్ తెలిపారు. పందిళ్లు, క్యూలైన్లు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ టీవీలు, అన్నదాన సామగ్రి, పెయింటింగ్ వంటి పనులకు ఆసక్తి గలవారు రూ.500 చెల్లించి, ఈ నెల 24న ఉదయం 11 గంటలలోపు కొటేషన్లు సమర్పించాలని వెల్లడించారు.
NLG: మునుగోడు గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవి గూడెంకు చెందిన రేషన్ డీలర్ ఉడుత సైదులు సోదరుని వివాహ వేడుక ఇవాళ చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలోని రిక్కల సత్తిరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ వివాహ వేడుకకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
KMR: ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని బస్తీ దవాఖానలు, రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం అమలుపై జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నర్సింగ్ శుక్రవారం సమీక్షించారు. బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవల రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు.
SRPT: చివ్వెంల మండలం కూడకుడకు చెందిన పట్టేటి స్పందనపై హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడు బోయిండ్ల మహేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి బావ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్స మహేశ్వర్ గురువారం సాయంత్రం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నిందితుడిని విచారించి రిమాండ్కు తరలించారు.
మహబూబాబాద్ మండలం సండ్రాలగూడెం శివారు పూరి తండాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బానోత్ లక్ష్మి (55) అనే గిరిజన మహిళా రైతు అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
GDWL: గద్వాల మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ నూతన మున్సిపల్ ఛైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణ సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు. ఎమ్మెల్యే సహకారం, కౌన్సిలర్ల సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానన్నారు.