MDK: జిల్లాలో మూడు విడతల ఎన్నికల చేపట్టిన తనిఖీలలో రూ.1,01,32,000 విలువైన నగదు, లిక్కర్, పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు తెలిపారు. రూ.47.48 లక్షల నగదు, 268 కేసుల్లో రూ.26,46,968 విలువైన 3,688 లీటర్ల మద్యం, రూ.27.36 లక్షల విలువైన 673 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
MDK: చిలిపిచెడ్ మండలంలోని 17 గ్రామ పంచాయితీలో 3వ విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 19 గ్రామ పంచాయతీ స్థానాలకు 2 గ్రామ పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 17 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 9 చోట్ల బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 7 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
RR: శంకర్పల్లి మండలం ఎల్వర్తి సర్పంచ్గా గెలిచిన మారేపల్లి భాగ్యలక్ష్మి పాపారావు, వార్డు సభ్యులు నిన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె గెలుపొందిన అభ్యర్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధితో పాటు BRS బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వార్డు సభ్యులు యాదయ్య, తదితరులు ఉన్నారు.
HYD: జీహెచ్ఎంసీ పరిధిలోని మీర్పేట్ సర్కిల్, న్యూ బాలాజీనగర్ కాలనీలో 40 గజాల స్థలంపై అక్రమంగా మూడు అంతస్తుల భవనం నిర్మించి సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్, మున్సిపల్, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. పాలకులు వెంటనే జోక్యం చేసుకోవాలని నినాదాలు చేశారు.
PDPL: ఓదెల మండలం శానగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా 26 ఏళ్ల యువకుడు జీల రాజు యాదవ్ 14 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఓదెల మాజీ జడ్పీటీసీ గంట రాములు మద్దతుతో బరిలో దిగి అతి చిన్న వయసులోనే సర్పంచ్గా గెలుపొందారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు.
VKB: మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని వికారాబాద్ జిల్లా ఎన్నికల పరిశీలకురాలు యాస్మిన్ భాష తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని ఐదు మండలాల్లో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎన్నికల పరిశీలకురాలు యాస్మిన్ భాష అధికారులతో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.
PDPL: పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ గ్రామ సర్పంచ్ పదవికి జరిగిన పోటీలో ప్రతి ఓటు నిర్ణాయకంగా మారింది. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన గంట రమేష్, కలబోయిన నరేందర్ల మధ్య పోరు హోరాహోరీగా సాగగా ఫలితాల్లో గంట రమేష్ కేవలం ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది.
JGL: పెగడపల్లి మండలంలోని మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 2 ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 21 గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల్లో 15 కాంగ్రెస్, బీఆర్ఎస్ 7, ఇతరులు 1 సర్పంచుల అభ్యర్థులు గెలుపొందారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
JGL: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 2,930 ఓటర్లకు గానూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 2,287 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1416, మహిళలు 1514 మంది ఓటు వేశారు. దీంతో పోలింగ్ శాతం 78.05గా నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.
JGL: ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. అయితే 8వ వార్డులో ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. పోలైన ఓట్లలో ఉప్పులేటి లక్ష్మణ్ 37, చుంచు పద్మజకు 37 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేయడంతో చుంచు పద్మజా గెలుపొందింది. కాగా, మరో సమీప అభ్యర్థికి 33 ఓట్లు వచ్చాయి. చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది.
JGL: జగిత్యాల జిల్లాలో మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో వరుసగా పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది.మొదటి విడతలో ఏడు మండలాల్లో ఎన్నికలు జరగగా 77.68% పోలింగ్ నమోదు అయింది. అలాగే రెండో విడతలు ఏడు మండలాల్లో ఎన్నికలు జరగగా 78.34% పోలింగ్ నమోదయింది. ఇక మూడో విడతలో ఆరు మండలాల్లో ఎన్నికలు జరగగా 79.64% పోలింగ్ నమోదయింది.
JGL: కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలంలోని జగన్నాథ్ పూర్ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
MDK: జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు 7 మండలాల్లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నర్సాపూర్ మండలంలో అత్యధికంగా 93.38 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. మండలంలో 26,927 మంది ఓటర్లు ఉండగా, 12,260 మంది పురుషులు,12,883 మంది మహిళలు, ఇతరులు ఒక్కరుగా.. 25,144 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు.
SRD: జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తవడంతో సహకరించిన అందరికీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సిబ్బంది, పోలీస్, పలు అధికారులు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు, శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించిన ఓటర్ల సహకారం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.