NGKL: కొప్పునూరు గ్రామంలో శనివారం మంత్రి జూపల్లి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి రూ.20 లక్షలు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కింద రూ.50 లక్షల సీసీ రోడ్, వడ్డెర కమ్యూనిటీ భవనానికి రూ.5 లక్షలతో నిర్మించనున్న పలు భవనాలకు భూమి పూజ చేశారు. అనంతరం ఎస్సీ కాలనీ పోచమ్మ గుడిని సందర్శించారు.
JGL: ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద కోటి రూపాయల వరకు ముద్ర లోన్లు ఇప్పిస్తానంటూ దాదాపు రూ.3 కోట్లు కాజేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్కు చెందిన నిందితుడు వేణు వర్మను బాధితులు శనివారం తీన్ ఖని ప్రాంతానికి చెందిన ఓ ఇంటి వద్ద పట్టుకుని జగిత్యాల టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ స్కామ్లో జిల్లాలో వంద మందికి పైగా బాధితులు ఉన్నారు
BNGR: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి పూర్ణకుంభంతో ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కరరావు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
SRPT: లింగ వివక్షత లేని సమాజం కోసం మహిళలు పోరాటం చేయాలని భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన మహిళలకు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలో కౌన్సిల్ సమావేశం దంతాల పద్మ రేఖ అధ్యక్షతన జరిగింది. మహిళలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మహిళా సమాజాన్ని జాగృతం చేసేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా, ఎదిగేందుకు కృషి చేయాలని అన్నారు.
HYD: గోషామహల్ సర్కిల్ పరిధిలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్సీ ఆదేశించారు. అలాగే ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు తీసుకుని పరిష్కరించాలని సూచించారు.
SRPT: కోదాడ పట్టణంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ ఫిబ్రవరి 10న హైదరాబాదులో జరిగే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. శనివారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవన్లో సీపీఎం పట్టణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
SRPT: కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న షేక్. ఖయ్యూం ఇటీవల ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. శనివారం టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఖయ్యూం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు.
HYD: కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ వాడి రామానంద మెమోరియల్ సెంటర్లో కుట్టుపని నేర్చుకున్న మహిళలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుట్టు మిషన్లను అందజేశారు. 40 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
SRPT: ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు కోరారు. శనివారం నూతనకల్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగి సీజన్లో వరి నాట్లు వేసిన రైతులకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లు రాకపోవడంతో పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
SRPT: ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పిఓ, ఎపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తారని తెలిపారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
HYD: తెలంగాణ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ప్రకటన చేసిన సందర్భంగా శనివారం ఉదయం నుంచి డాక్టర్ ఏఎస్ రావు నగర్లో మీ సేవల వద్ద ప్రజలు క్యూ కట్టారు. మీసేవ కేంద్రాల వద్ద నో సర్వర్ బోర్డు పెట్టారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నో సర్వీస్ రావడంతో ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
KMM: అమెరికాలోని భారతీయ భాదితుల పట్ల ప్రధాని మోదీ శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. అమెరికాలో ఉన్న భారతీయులను బేడీలు వేయడానికి నిరసిస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర వైఫల్యం కారణంగానే 104 మంది భారతీయులను ట్రంప్ ప్రభుత్వం పంపివేసిందని ఆరోపించారు.
HYD: మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కౌశిక్ రెడ్డి కారుపై 28 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పట్లోళ్ల కౌశిక్ రెడ్డి కారు తనిఖీ చేశారు. దీంతో 28 పెండింగ్ చలాన్లను పోలీసులు గుర్తించారు.
KMM: ఖమ్మం నగరంలోని VDO’S కాలనీలో ఉన్న రామాలయంలో శనివారం నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పొంగులేటికి ముందుగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ADB: కారును లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలైన ఘటన శుక్రవారం రాత్రి భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..నిర్మల్ నుంచి వస్తున్న కారును భైంసా పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద కారును లారీ ఢీకొంది, కారులో ఉన్న భైంసా పట్టణానికి చెందిన శంకర్కు గాయాలు కాగా భైంసా ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.