WGL: జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న కీలక ప్రాజెక్టులకు బడ్జెట్లో భారీ నిధులు కేటాయించాలని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఐటీ పార్క్ అభివృద్ధి, కాకతీయ యూనివర్సిటీ విస్తరణ, మడికొండ డంపింగ్ యార్డ్ తరలింపు, కాజీపేట ఫాతిమా నగర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
NLG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి NLG జిల్లా ప్రజలు, ముఖ్యంగా రైతులు భారీ ఆశలు పెట్టుకున్నారు. SLBC సొరంగం పనులు, డిండి ఎత్తిపోతల పథకం పూర్తికి వెయ్యి కోట్ల నిధుల కేటాయింపుపై ఎదురుచూస్తున్నారు. పెండింగ్లో ఉన్న బ్రాహ్మణ వెల్లంల, ఉదయసముద్రం ప్రాజెక్టులతో పాటు పట్టణాల్లో సమీకృత మార్కెట్లు, మిని ట్యాంక్బండ్ల నిర్మాణాలకు కూడా నిధులు వస్తాయని ఆశస్తున్నారు.
WGL: భద్రకాళి ఆలయ అర్చకుడు, వేద పండితులు సత్యమయ్యకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్తమయ్యను శాలువతో సన్మానించారు.
MBNR: ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త అందించారు. తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదాబైనామా భూసమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలపడం లక్ష్యమన్నారు. ఈ ప్రకటనతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పట్టాల కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
RR: యాసంగి పంట సాగుకు యూరియా బస్తాల పంపిణీ ఇవాళ ఉంటుందని కందుకూరు వ్యవసాయ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కందుకూరు మండల కేంద్రంలోని సొసైటీ ఆఫీస్ వద్ద యూరియా బస్తాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటలకు రైతులు యూరియా (ఫెర్టిలైజర్) ఆప్లో బుక్ చేసుకుని తర్వాత తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకుని జిరాక్స్ పత్రాలతో రావాలని సూచించారు.
MDCL: జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 2,834 మంది సిబ్బందిని నియమించినట్లు జిల్లా DEO విజయ కుమారి తెలిపారు. అదనంగా 10 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తూ, పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా టి. సరిత (మాధురి గౌడ్) నియమితులయ్యారు. ఆమె టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, ఎమ్మెల్సీ దండే విట్టల్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ 15వ డివిజన్ జామియా మసీదులో నిర్వాహకులు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఆకునూరి కనకరాజు, కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ పాల్గొని మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు 30 రోజులు కఠిన ఉపవాస దీక్షలో నియమ నిష్ఠలతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
SRD: కంగ్టి మండల కేంద్రంలో గ్యాస్ కొరత కారణంగా టిఫిన్ సెంటర్లు నేడు కొన్ని మూతపడ్డాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. చేసేది ఏమీ లేక కొందరు హోటళ్ల యజమానులు మూసివేసి సిలిండర్ల కోసం తిరుగుతున్నారు. మరికొందరు కట్టెల బట్టిలు ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నారు.
NLG: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఇచ్చిన ‘ఛలో హైదరాబాద్’ పిలుపు నేపథ్యంలో గట్టుప్పల్లో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకు వెళ్లకుండా పోలీసులు ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ చర్యను సీఐటీయూ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కడం తగదని, అణచివేతతో సమస్యలు పరిష్కారం కావని వారు పేర్కొన్నారు.
SRCL: చందుర్తి మండల కేంద్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో పండితులు ఆయాచితుల పవన్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం సుభిక్షం, సస్యశ్యామలం ఉంటుందని తెలిపారు. పవన్ శర్మను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ శాలవతో సన్మానించి పండ్లు అందజేశారు.
NGKL: అచ్చంపేట మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లలో వేగవంతం చేస్తున్నట్లు శుక్రవారం మున్సిపల్ మేనేజర్ రమేష్ నాయక్ తెలిపారు. 2025 -2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నూరు శాతం పన్నులు వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పనులు రూ.40 లక్షల వరకు బకాయిలు ఉన్నాయన్నారు.
KMM: నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన భూక్య బిక్షాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా శుక్రవారం సీఎం సహాయ నిధి ద్వారా నగదు మంజూరు అయింది. ఈ నేపథ్యం లో ఆ చెక్కును గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రవీణ్ చేతుల మీదుగా లబ్ధిదారుడికి అందజేశారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉగాది సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. పరాభవ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆశించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దసరా కట్ట వద్ద కాషాయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.
NRML: నెల రోజుల కఠోర ఉపవాసం ముగిసిన తరువాత జరగనున్న ఈద్-ఉల్-ఫితర్ పండుగ కోసం బాసర మండల కేంద్రం పూర్తి సన్నద్ధతలో ఉంది. మస్జిద్ అబూబకర్ కమిటీకి చెందిన 30 మంది యువకులు మైదానాన్ని రంగురంగుల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శుక్రవారం జరిగే ప్రత్యేక నమాజ్ కోసం ప్రత్యేక టెంట్లు, మినీ స్పీకర్లు వంటి సౌకర్యాలను నిర్వాహకులు పూర్తి చేశారు.