NGKL: నాగర్ కర్నూల్ జిల్లాలో హోలీ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ కోరారు. రసాయన రంగులు కాకుండా సహజ సిద్ధమైన రంగులు వాడాలని, చెరువులు, బావుల వద్ద ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించకుండా పండుగ జరుపుకోవాలని ఎస్పీ తెలిపారు.
NRPT: ఎత్తిపోతల పథకంలో భాగంగా కానుకుర్తి రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులకు వెంటనే చెక్కులు అందజేయాలని సర్పంచ్ నారాయణ ఆధ్వర్యంలో ఆర్డీవో రాంచందర్కు వినతిపత్రం అందించారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని కోరారు. చెక్కులు ఇవ్వకుండా పని ప్రారంభిస్తే అంగీకరించబోమన్నారు. RDO సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ADB: తలమడుగు మండలంలోని కుచలాపూర్ గ్రామంలో ఆదిలాబాద్ MP గోడం నగేశ్ సోమవారం పర్యటించారు. గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి జక్కుల సదాశివ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ నగేశ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమణ, చంద్రకాంత్, నారాయణ, వామన్ పటేల్, సదానందం తదితరులున్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం గ్రామ సర్పంచ్ బొజ్జం మమత-సురేష్ ఆధ్వర్యంలో BPM నాగేశ్వరి గ్రామ ప్రజలకు పోస్ట్ ఆఫీస్ పథకాలను వివరించారు. నాగేశ్వరి మాట్లాడుతూ.. గ్రామస్తులు పోస్ట్ ఆఫీస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక భద్రతకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కరోబార్ పవన్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
KMM: ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్, డీపీవోకు సోమవారం సర్పంచ్ పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సింగరేణి గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించాలని స్వయంగా కలెక్టర్కు వారు వివరించారు. అలాగే ఇతర సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు.
MBNR: అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నేడు జరిగే చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 9 గంటల నుంచి సాధారణ పూజలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తులు దీనిని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
KMM: ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి సోమవారం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పీఎం సూర్య ఘర్ పోస్టర్ను ఆవిష్కరించి, విద్యుత్ ఆదా కోసం ప్రజలు pmsuryaghar.gov.in ద్వారా సోలార్ ప్యానెల్స్కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ADB: తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా నల్ల శివన్నను సంఘం సభ్యులు నిన్న ఎన్నుకున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్ లలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
KNR: ఆర్ఎస్ఎస్ అమృతేశ్వర శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ రేకుర్తిలోని మహాశివాలయంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మందికి పైగా ప్రజలకు కంటి, షుగర్,బీపీ, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని నగర కార్యావాహ మహేశ్వర్ పేర్కొన్నారు.
SRD: నిమ్హా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్లో నిమ్హ్పా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లే అవుట్ అభివృద్ధి చేసేందుకు వీలుగా పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. లే అవుట్ ప్రకారం రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు సేకరించిన భూముల్లో హద్దురాళ్లను ఏర్పాటు చేయాలన్నారు.
KMM: మధిర పట్టణంలోని రాయపట్నం సెంటర్లో రోడ్డుపై అడ్డంగా ఆటోలు, టూవీలర్ బండ్లు నిలిపివేయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మధ్యలోనే వాహనాలు పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్కు ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వెళ్లే వారికి మరింత ఇబ్బంది ఏర్పడుతోంది. అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.
MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి రక్షణ లేకపోవడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. నాగసాలకు చెందిన భీమేష్ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను గౌరవప్రదంగా బంధువులకు అప్పగించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
KMR: తాడ్వాయి మండల అభివృద్ధి అధికారిగా రాజేశ్వరరావు సోమవారం సాయంత్రం పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ ఇన్ఛార్జ్గా సబితా రెడ్డి పని చేశారు. ఆమె స్థానంలో గాంధారి MPDOగా పని చేసిన రాజేశ్వరరావును బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మండల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని చెప్పారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
BHNG: రైతులకు సకాలంలో యూరియా అందించాలంటూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. సోమవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద మండలం కమిటీ ఆధ్వర్యంలో బైఠాయించింది. ఖాళీ యూరియా బస్తాలలను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి ప్రేమ లేదన్నారు.
SRPT: గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో భారీ దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన బత్తిని సైదమ్మ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా, గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని ఐదు తులాల బంగారం, లక్ష రూపాయల నగదును అపహరించుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.