MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడంపై మాజీ మంత్రి డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన, కొత్త భవనం పూర్తయినా వాడుకలోకి తేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య మేనని మండిపడ్డారు. మార్చురీలో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరం జరిగిందని విమర్శించారు.
BDK: ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులను తక్షణమే ఆపాలని ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం అశ్వరావుపేట మండలం ఉరుములబండ గ్రామంలో ఆదివాసి దళిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆదివాసీలు పలు విషయాలను వెల్లడించారు. తాము గత 35 సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నట్లు వెల్లడించారు.
KNR: కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో హోలీ పండుగను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. క్యాంపస్ అంతా రంగుల హరివిల్లు వాతావరణంతో కళకళలాడింది. విద్యార్థులు పరస్పరం రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. నృత్యాలతో యువత సందడి చేశారు. ఐక్యత, స్నేహభావానికి ప్రతీకగా హోలీ వేడుకలను ఆనందంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.
JGL: మెట్పల్లి పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విధి నిర్వహణ ఒత్తిడిని పక్కనపెట్టి, ఉద్యోగులందరూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బస్టాండ్ పరిసరాల్లో యువత, ఉద్యోగులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.
MNCL: జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మంగళవారం గ్రామ సర్పంచ్ మురిమడుగుల కవితా రాజన్న ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా జెల్ల స్వామి, ఉపాధ్యక్షులుగా ఏదుల వంశీ, కోశాధికారిగా ఏదుల తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా మామిడి రాజన్న, ప్రచార కార్యదర్శిగా జెల్ల భీమయ్య, తదితరులను ఎన్నుకున్నారు.
MDK: చేగుంట మండల వ్యాప్తంగా హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి రంగులు చల్లుకుంటూ ఆనందాలు పంచుకున్నారు. చేగుంట మండల కేంద్రంలో రంగులు, రంగు నీళ్లు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ పండుగలో పాల్గొన్నారు. వీధులు, రోడ్డులు రంగులతో నిండిపోయాయి.
VKB: పెద్దేముల్ మండల కేంద్రంలో హోలీ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో మాత్రమే మంగళవారం హోలీ పండుగను నిర్వహించారు. మరికొన్ని గ్రామాల్లో బుధవారం నిర్వహించనున్నట్లు పలువురు చెప్తున్నారు.
MHBD: నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్బంగా గూడూరు రేంజ్ డివిజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. “వన్యప్రాణులను కాపాడుదాం- భవిష్యత్తును రక్షిద్దాం” అని నినాదాలు చేశారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక BRS నాయకులు, తదితరులు ఉన్నారు.
WNP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైల్డ్ హెల్త్-100 కార్యక్రమాన్ని జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ఆశ్రమ, మోడల్ స్కూళ్లలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు ఏర్పాటు చేస్తామని డిఎంహెచ్వో సాయినాథ్ రెడ్డి తెలిపారు. ఇందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం అన్నారు. వంద రోజుల్లో 4 దశల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
RR: షాద్నగర్ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తనిఖీ చేశారు. రోగుల వార్డులలో ఉన్న వారిని వైద్యం ఎలా అందుతుందని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి వార్డులతో పాటు పోస్టుమార్టం గదిని కూడా పరిశీలించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించాలని సూచించారు.
HNK: వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని వరంగల్ ఎంజీఎం ENT విభాగాధిపతి ప్రొఫెసర్ డా. సంపత్ రావు, ప్రొఫెసర్ డా.విజయకుమార్ తెలిపారు. సమీపంలోని వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడారు. వినికిడి లోపం ఉన్న 6 నెలలలోపు పిల్లలకు ఉచిత కాంక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు.
BDK: కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సీతారాంపురం కాలనీలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్ధించారు.
JNG: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సీహెచ్ సౌందరరాజన్ ఇటీవల పరమపదించారు. ఈ క్రమంలో మంగళవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిలు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా మృతుని చిత్రపటం వద్ద నివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ADB: కాంగ్రెస్తోనే గ్రామాల్లో ప్రగతి సాధ్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్కు చెందిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు కాంగ్రెస్లో చేరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. అభివృద్ధి పనులను చూసే ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.
KMM: సీవీఆర్ కళావేదికపై పీఎం జడ్పీహెచ్ఎస్ మడుపల్లి వార్షికోత్సవ వేడుకలు హెచ్ఎం తోట నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎమ్ఓ ప్రభాకరరెడ్డి హాజరయ్యారు. మధిర మండలంలో ఏకైక పీఎం హై స్కూల్, మడుపల్లి అని తెలియజేశారు. పీఎం స్కీం సౌకర్యాలను నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ జిల్లాలో అగ్రగామిగా ఉండాలని అన్నారు.