ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి గోండుగూడ గ్రామస్థులు గురువారం పెళ్లికట్నం నిషేధిస్తూ తీర్మానించారు. ఈ సందర్బంగా పెందోర్ హీరాబాయి గణపత్ రావు కుమార్తె వివాహానికి గ్రామస్థులు చందా జమ చేసి రూ.14,000 ఆర్థిక సహాయం చేశారు. ఇక నుంచి గ్రామంలో పెళ్లి ఉంటే ఈ విధంగా సహాయానికి ముందుంటామని వారు పేర్కొన్నారు.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో వివిధ రాజకీయ పార్టీల నుంచి బీసీ అభ్యర్థులు భారీ ఎత్తున గెలిచారని బీసీ మేధావుల సంఘం తెలిపింది. కార్పొరేషన్లో ఆయా రాజకీయ పార్టీలు తమ పార్టీలోని బీసీ కార్పొరేటర్లకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నాయకులు లింగం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
NLG: నార్కెట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి సుభాష్ రెడ్డి, చిన్నతుమలగూడెంకు చెందిన పులిపలుపుల నిర్మల మృతి చెందగా… వారికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయనతో ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
WNP: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను, ఉపాధ్యాయ హాజరు పట్టికలు, స్టాక్ రూమ్లోని నిత్యవసర సరుకులు గడువు తేదీ, భోజనాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు.
SRPT: మునగాల మండలం ఆకుపాముల వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, సూర్యాపేట నుంచి కోదాడ వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NRML: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతున్న 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక క్షేత్రస్థాయి అమలును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామునే స్థానిక కేజీబీవీ పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
WGL: చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం శివారులో గురువారం ఉదయం పంటపొలాల్లో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదం లేదా హత్యన అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు, మృతుడు ఎవరో గుర్తించాల్సి ఉంది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారులోని భీముని పాదం జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. పచ్చని అడవుల మధ్య కనువిందు చేస్తున్న ఈ ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. నర్సంపేట-గూడూరు ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు సరైన వేదికగా మారింది.
ఖమ్మం జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లలో ఇటీవల చిరుతపులి, ఎలుగుబంటికి సంబంధించిన దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇది జిల్లా అటవీ పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యం ఆరోగ్యంగా ఉందనడానికి నిదర్శనమని అధికారులు తెలిపారు.
HYD: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వేం నరేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా బీ-ఫామ్ను అందుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు సమీపంలో గురువారం ఉదయం ఆటో బోల్తా పడి ఓ యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న 108 ఈఎంటి లింగంపల్లి శ్రీనివాస్ పైలట్ సైదులు ప్రథమ చికిత్సను అందించి రక్తస్రావమును అరికట్టి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
WGL: రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్లో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మత్స్యకారులు దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సారెస్పీ కెనల్లో ఆగిపోయిన నీటి ప్రవాహం కారణంగా దేహం బయటకు వచ్చింది. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు.
VKB: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్టులు తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (DPRO) సూచించారు. మీడియా విలేకరులు, కార్యాలయ పని వేళల్లో ఉదయం 10:30 గంటల నుంచి తమ ఒరిజినల్ కార్డుపై పొడిగింపు స్టిక్కర్ వేయించుకోవాలని కోరారు.
ADB: ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి గ్రామస్తులు ముందుకు రావాలని ప్రధాన ఉపాధ్యాయుడు ఆనంద్ అన్నారు. తాంసి మండలంలోని కప్పర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని రిటైర్డ్ ఉపాధ్యాయుడు విలాస్ గురువారం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఆనంద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులున్నారు.
KMM: వైరా మున్సిపాలిటీలోని 15వ వార్డులో దోమల నివారణకు గురువారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. కౌన్సిలర్ నల్లమోతు శైలజ సురేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది వార్డు అంతటా ఫాగింగ్ చేయించి, నివారణ మందును పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.