MHBD: తొర్రూర్(M) ఆర్యభట్ట ప్రైవేట్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. పెద్దవంగర తండాకు చెందిన ఓ విద్యార్థిని పాఠశాల యాజమాన్యం నోట్లో తువాల కుక్కి, స్లాబ్కు వేలాడదీసి చంపే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది చూసిన మరో విద్యార్థి ఆ విద్యార్థి ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది. కొత్తగా కట్టే స్కూలుకు పిల్లలను బలి ఇవ్వాలని యాజమాన్యం ఆలోచన చేసినట్లు సమాచారం.
BHNG: భువనగిరి పట్టణాన్ని సుందరీకరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ ఛైర్పర్సన్గా ఎన్నికైన తంగెళ్ళపల్లి శ్రీవాణి, వైస్ ఛైర్పర్సన్గా పోతంశెట్టి మంజుల పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని రోడ్లను పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు.
JGL: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ ప్రజల నిరీక్షణకు తెరపడింది. గత ఏడాది కాలంగా గ్రామానికి కోరుట్ల డిపోకు చెందిన బస్సు సర్వీస్ నిలిపివేయబడగా, గురువారం సర్వీస్ను మళ్లీ పునరుద్ధరించారు. డిపో మేనేజర్ తీసుకున్న నిర్ణయంతో బస్సు రాకపోకలు తిరిగి ప్రారంభం కావడం వల్ల గ్రామస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MNCL: చెన్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
CTR: పుంగనూరు(M) కుదవపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యానికి CMRF ద్వారా మంజూరైన చెక్కులను నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అందజేశారు. కూటమి ప్రభుత్వం పేదల వైద్య ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగానే గురువారం పార్టీ కార్యాలయంలో రూ.1,44,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన కల్వర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం స్థానికులతో కలిసి పూజ చేశారు. కల్వర్టు నిర్మాణంతో వ్యవసాయ పొలాలకు వెళ్ళటానికి రైతులకు ఇబ్బందులు దూరం అవుతాయని అన్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు.
PPM: మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్.భాస్కరరావు సూచించారు. వేసవిలో డీహైడ్రేషన్ నివారించేందుకు తగినంత నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని తెలిపారు. సూర్యరశ్మి నుంచి రక్షణగా గొడుగు, టోపీ వాడాలని సూచించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు ఉంచాలన్నారు.
TG: మినీ మేడారం జాతరలో జరిగిన ఘటనపై మరోసారి BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ మతమార్పిడులకు పాల్పడుతున్నారని తాను అనలేదని.. ఆ మాటలు అన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమని సవాల్ చేశారు. తనను వేధించాలనే తప్పుడు కేసు పెట్టి సీఐడీతో విచారణ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తూ.గో: కొవ్వూరు ఆర్డీవోగా రాజా రమేశ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రూప్-1 అధికారులను బదిలీ చేయగా, ఆ ఉత్తర్వులతో ఆయన కొవ్వూరుకు నియమితులయ్యారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన ఆర్డీవోకు స్వాగతం పలికారు.
KDP: రాయచోటిలో పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. లూజ్ పాలు విక్రయించే అవుట్లెట్ల నుంచి 6 పాల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. పాలలో కల్తీ నిర్ధారణ అయితే ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పాలపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
NLG: శ్రీ మార్కండేశ్వర స్వామి జాతర వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ‘ఓం నమశ్శివాయ’ నామస్మరణతో గ్రామం ఆధ్యాత్మికతతో నిండిపోయింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అగ్నిగుండాలలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
HYD: మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్కు కేంద్ర బడ్జెట్లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది.
KNR: మొక్కజొన్న చేనును పాడు చేస్తున్న కోతులను తరమడానికి చింపాంజీ మాస్క్ ఉపయోగించి ఊరట పొందాడు ఓ రైతు. శంకరపట్నం మండలం కరీంపేటకి చెందిన చింతిరెడ్డి మల్లారెడ్డి అనే రైతు రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. కోతుల నుంచి పంటను రక్షించుకోవడానికి ఆన్లైన్లో చింపాంజీ మాస్క్ కొనుగోలు చేసి, దానిని ఓ వ్యక్తికి ధరింపజేసి కోతులను తరుముతున్నట్లు తెలిపాడు.
కర్నూలులోని KVR మహిళా డిగ్రీ కాలేజీలో రేపు జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ICICI బ్యాంక్లో సేల్స్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు 2024, 2025లో బీఏ, బీకాం, BSC, BCA, BBA పూర్తి చేసిన 25 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని నిర్వాహకులు తెలిపారు. ఇంజినీరింగ్, డిప్లొమా, ఎంబీఏ, పీజీ చేసిన వారు అనర్హులని ప్రిన్సిపాల్, జేకేసీ కోఆర్డినేటర్ అన్నారు.
NDL: ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం దిగువ అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ప్రహ్లాద వరద స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని అర్చకులు ఆదిశేషుడిపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు.