హిమాచల్ప్రదేశ్( Himachal Pradesh)లో వైవాహిక జీవితంలో ఒక్కడి అవుదామనుకున్న నూతన వధూవరులకు వరదలు పెద్ద ఇబ్బంది. తెచ్చిపెట్టింది. ఈనెల 10న షిమ్లాలోని కోట్గఢ్కు చెందిన వరుడు ఆశిశ్ సిన్హా.. భుంటార్(Bhuntar)లోని కుల్లుకు చెందిన శివానీ ఠాకూర్ వివాహం జరగాల్సి ఉంది. అయితే భారీ వర్షాల(Heavy rains)తో వధూవరులు పెళ్లి మండపానికి చేరుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెళ్లి వేడుక(wedding ceremony)ను ఆన్లైన్లో జరిపించాలని నిర్ణయించాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్లి చేశాయి. ఈ ఆన్లైన్ పెళ్లిలో మాజీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ కూడా పాల్గొనడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి ఆగిపోకుండా, బంధువులందరినీ పిలిపించి రిస్క్ చేయకుండా వేడుక నిర్వహించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఎడతెరిపి లేని వర్షాలు.. ఆకస్మిక వరదలు.. ఉప్పొంగుతున్న నదులు.. విరిగిపడుతున్న కొండ చరియలు.. కొట్టుకుపోయిన రోడ్లు.. కూలిపోయిన ఇళ్లు.. కొన్ని రోజులుగా ఉత్తరాదిలో నెలకొన్న పరిస్థితి ఇది. జన జీవనం స్తంభించిపోయింది. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల (floods) కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల్లో 80 మంది ఒక్క హిమాచల్ప్రదేశ్లోనే మరణించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం సంభవించాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. నదులు (Rivers) ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు ముంచుకొస్తుండగా, మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దాదాపు 300 మంది పర్యాటకులు (Tourists) వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. పంజాబ్, హర్యానాలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.