CJI Chandrachud: సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించడం మరిచిపోవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో ఓటు ముఖ్యమైనదని తెలిపారు. నా ఓటు, నా గళం మిషన్లో భాగంగా ఓ వీడియో సందేశం పంపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది. భారత పౌరులుగా ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత. ఐదేళ్లకొకసారి మన దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించం కుదరదా! ఓటును వేస్ట్ చేయవద్దని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా.. గర్వంగా ఓటు వేద్దామని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.
పోలింగ్ కేంద్రంలో వేలిపై వేసే సిరా దేశంపై మనకి ఉన్న బాధ్యతను గుర్తుచేస్తుందన్నారు. కొత్తగా తీసుకొచ్చిన నేర న్యాయ చట్టాలు నేటి ఆధునిక కాలానికి బట్టి సమాజ అవసరాలు తీర్చేలా ఉన్నాయన్నారు. వీటిని తగిన రీతిలో వినియోగించుకుంటే విజయవంతం అవుతాయని తెలిపారు. బాధితుల ప్రయోజనాల రక్షణకు పెద్దపీట వేస్తూ దర్యాప్తు, విచారణలను సమర్థంగా కొనసాగించడానికి వీలుగా నేర చట్టాలను ఇంకా అభివృద్ధి చేయాలని చంద్రచూడ్ తెలిపారు.