ADB: దైవారాధనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో సంత్ గాడిగే బాబా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహాల ప్రతిష్టాపనతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.
ADB: బోథ్ నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా తనవంతుగా కృషి చేస్తానని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్ కుమార్, నారాయణ, సంతోష్ తదితరులున్నారు.
PDPL :పెద్దపల్లి RSETI సంస్థ 2026–27 సంవత్సరానికి గ్రామీణ నిరుద్యోగ యువత కోసం పలు స్వయం ఉపాధి శిక్షణలను అందించనున్నట్లు, డైరెక్టర్ రాకేష్ పరీష తెలిపారు. మగ్గం వర్క్, జ్యువెలరీ, బ్యూటీ పార్లర్, ఫోటోగ్రఫీ, సీసీ కెమెరా సర్వీసెస్, కార్ డ్రైవింగ్, ఫాస్ట్ ఫుడ్, పాపడ్-పికిల్స్ తయారీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆసక్తిగల వారు 9392221907ను సంప్రదించాలన్నరు.
GDWL: కేటీదొడ్డి మండలం చింతలకుంటలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక తరలిస్తున్న యజమాని లక్ష్మణ్, డ్రైవర్ రంగస్వామిలపై కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. స్థానికుల సహకారం కోసం పరిశీలనలు కొనసాగిస్తున్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీల్లో పాలక వర్గాల ఏర్పాటు పూర్తయిన తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి “కో-ఆప్షన్” సభ్యుల ఎంపిక పై పడింది. పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఈ నామినేటెడ్ స్థానాల కోసం ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, పార్టీ కోసం కష్టపడిన ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్ కార్యాలయాల్లో రాజకీయ సందడి నెలకొంది.
MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్ల కేసులో మాజీ MLA బాల్క సుమన్కు బెయిల్, పోలీసుల కస్టడీ పిటిషన్లపై సోమవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి. బెయిల్ మంజూరవుతుందా? లేక పోలీసుల కస్టడీకి అప్పగిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీసుకునే నిర్ణయం క్యాతనపల్లి రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశముంది.
మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో 21,884 మంది విద్యార్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు సౌకర్యాల కోసం కనీస వసతులు అందించినట్లు అధికారులు తెలిపారు.
NZB: నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారి మృతికి నిరసనగా జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. డా. విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు DSP కార్యకర్తలు ఈ ర్యాలిలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చిన్నారి మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచి యథావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజలు, దరఖాస్తుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
BDK: రోగులకు మెరుగైన సేవలు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని DMHO హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం DMHO డాక్టర్ తుకారాం రాథోడ్ ఆదివారం పాల్వంచ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టపరమైన ప్రమాణాల అమలును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
KMM: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిన్న నిర్వహించిన ‘రైతుబడి అగ్రి షో’ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ స్టాళ్లను పరిశీలించిన ఆయన, సాగు రంగంలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులు, శాస్త్రవేత్తలను ఒకే వేదికపైకి తెచ్చిన నిర్వాహకులను మంత్రి అభినందించారు.
HYD: నగరంలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ సోమవారం AWHO కాలనీలో 225గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
KMM: నగర సుందరీకరణకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సకాలంలో సిద్ధం చేయాలని ఉద్యానవన అధికారి ఆదేశించారు. ఖమ్మం నగరం గొల్లగూడెం నర్సరీలో జరుగుతున్న మొక్కల పెంపకం, నిర్వహణ పనులను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ హరితీకరణ లక్ష్యంగా చేపడుతున్న పనులను సమీక్షించి, సిబ్బందికి సాగు పద్ధతులపై పలు సూచనలు చేశారు.
BDK: సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం నందనవనం కాలనీలో భారీ దొంగతనం నిన్న జరిగింది. ఎస్బీఐ విశ్రాంత మేనేజర్ రఘునాథ్ కుటుంబంతో కలిసి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లగా, గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 5.9 తులాల బంగారం, 40.8 తులాల వెండితో పాటు రూ. 50 వేల నగదును దోచుకెళ్ళినట్లు ఎస్సై రమాదేవి తెలిపారు.
JGL: రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో ఆదివారం నక్కలగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగలా నిర్వహించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల సౌజన్యంతో మహా అన్నదానం, రథోత్సవం తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు అర్చకులు వెంకట కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.