JN: జిల్లాలో రేపటి నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు 16 సెంటర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. రేపటి నుంచి మార్చి 16వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, జిల్లాలో 8,605 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 9550371371 ఏర్పాటు చేశామన్నారు.
SRCL: సీనియర్ సిటిజన్లు ఎవరు కూడా తమ ఆస్తులను, పిల్లల పేరిట చేయకూడదని, వేములవాడ ఆర్డీవో రాధా సూచించారు. వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం సీనియర్ సిటిజన్ గొంతుక పిలుపు పత్రికను ఆమె ఆవిష్కరించారు. సీనియర్ సిటిజన్లు ఆస్తులను పిల్లలకు చేసిన, ఒకవేళ వారికి సరిపోను ఉంచుకుని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.
KNR: రామడుగు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులలో ఉన్నటువంటి యూరియా నిల్వలను మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని సూచించారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాసంగి పంటలకు సరిపడా యూరియా ఉందని సూచించారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్లో రీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మంగళవారం కలెక్టరేట్లో కలిసి ఫిర్యాదు చేసినట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఎన్నికలలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 43వ డివిజన్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురిచేశారని అన్నారు.
ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 26న వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. ఈ వేలంలో 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు ఇతర వాహనాలు ఉండనున్నాయి. ఆసక్తి గలవారు ప్రభుత్వ నిర్దేశిత ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలం పాటలో పాల్గొనవచ్చని ఆయన వెల్లడించారు.
SRD: నూతన కౌన్సిలర్లు ప్లాస్టిక్ నిషేధం అమలుకు కృషి చేయాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సూచించారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపాలిటీలో తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
NRML: దిలావర్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దుర్గం శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా వారు అధికారులను ఆదేశించారు.
MBNR: జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(AO) బోవల్ల వెంకటేవ్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా ఎరువులు ఎలా సరఫరా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులతో నేరుగా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
WGL: ఫిబ్రవరి 25వ తేదీ నుంచి నిర్వహించబోయే ఇంటర్ వార్షిక పరీక్షల పర్యవేక్షణ కట్టుదిట్టంగా నిర్వహించాలని వరంగల్ డీఐఈవో శ్రీధర్ సుమన్ అన్నారు. హనుమకొండలోని ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో పరీక్షా పర్యవేక్షణాధికారుల ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి DIEO పలు సూచనలను చేశారు.
ASF: పోలీస్ క్రీడల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నిర్వహించిన నాల్గవ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆసిఫాబాద్ జిల్లా పోలీసులకు పలు పతకాలు లభించాయి. సెపక్ తక్రాలో పొట్ట గోపి బృందం సిల్వర్ సాధించగా, మహిళల బాడ్మింటన్లో సువార్త సిల్వర్ గెలుచుకుంది. బాక్సింగ్లో పూల్ సింగ్ సిల్వర్, టైక్వాండోలో పూల్ సింగ్, వినయ్ కుమార్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
SRPT: మానవ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని జిల్లా ఎస్పీ కె. నరసింహ అన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేటలో ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాణకవచాలని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రమాద బాధితులను కాపాడి ‘రహదారి హీరోలు’ కావాలని పిలుపునిచ్చారు.
NLG: చేనేత కార్మికుల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం ప్రకటించి 20 నెలలైనా హామీ నెరవేరలేదని, పొదుపు పథకం నిధులు విడుదల చేయాలని కోరారు. షరతులు లేకుండా చేనేత భరోసా, పెండింగ్లో ఉన్న నేతన్న బీమా చెల్లించాలన్నారు.
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని పోనుగోడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదుట రోగి మంగళవారం బంధువులు రాస్తారోకో నిర్వహించారు. గర్భాశయ గడ్డ శస్త్రచికిత్సలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మూత్రనాళాలు దెబ్బతిని రోగి పరిస్థితి విషమించిందని వారు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వనపర్తి జిల్లాలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఆధ్వర్యంలో సొంత అంగన్వాడీ భవనాలు నిర్మించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ కేంద్రంలో అవసరమైన నిత్యవసర వస్తువులను మంజూరు చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
KMM: ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను జిల్లా ఉద్యానవన శాఖాధికారి పరిశీలించారు. మొక్కల కత్తిరింపు, ఇతర నిర్వహణ పనులను పర్యవేక్షించిన ఆయన, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నాణ్యమైన ప్రమాణాలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.