ADB: ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పెండింగ్ కేసులను అధికంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. రానున్న లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన సమన్వయ సమావేశంలో పలు సూచనలు చేశారు.
WGL: నెక్కొండ మండలం పెద్దకోర్పోల్ గ్రామానికి చెందిన మట్టే ఏలియా అనే వ్యక్తి విద్యుత్ షాక్తో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన ఏలీయా.. విద్యుత్ ప్రమాదానికి గురై మృతిచెందాడు. దీంతో పెద్దకోర్పోల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏలీయా కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
SRPT: సమాజసేవలో ఎన్జీవోలు ముందుండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. HCL Foundation విరాళంగా అందించిన ఆధునిక వైద్య పరికరాలను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అందజేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ఈ పరికరాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.
JN: జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్ల ప్లాట్లు కోల్పోతున్న ప్లాట్ల యజమానులకు నష్టపరిహారం చెల్లించి రోడ్డు పనులను చేపట్టాలని CPM జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. జనగామలో బాధిత ఫ్లాట్ల యజమానులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు కనకారెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
HYD: డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కార్డులను పెంచాలని డెస్క్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో HYDలోని గన్ పార్క్ నుంచి నాంపల్లి చాపల్ రోడ్డులోని మీడియా అకాడమీ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అకాడమీ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. TWJF వ్యవస్థాపక అధ్యక్షులు సోమయ్య మాట్లాడుతూ.. అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
WGL: గీసుకొండ మండలం కొమ్మలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకుడు కాళీప్రసాద్ రావు పరిశీలించారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 9 వరకు జరిగే ఉత్సవాలనేపథ్యంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి. మాట్లాడుతూ.. మంత్రి కొండ సురేఖ, స్థానిక ఎమ్మెల్యే రేవూరి మధ్య వర్గ పోరు కారణంగా ఆలయఅభివృద్ధి నిలిచిపోయిందన్నారు.
MDK: కొల్చారం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా హాళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరు, పరీక్షల నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలను తెరిచారా లేదా అన్నది తెలుసుకున్నారు.
HNK: కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంను డిసబుల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. పార్ట్ టైమ్ అధ్యాపకుల నియామకాలలో దివ్యాంగుల రోస్టర్ పాయింట్ల ఇంటర్ చేంజ్ విధానం అమలు చేయాలని వీసీని వారు కోరారు. జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ యాకుబ్ పాషా, రాంబాబు, శ్రీశైలం, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
GDWL: రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా గద్వాల కలెక్టరేట్ ముందు ఎర్రవల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రత్యేక హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ద్విచక్ర వాహనదారులకు స్వయంగా హెల్మెట్లు ధరింపజేశారు. రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
NRPT: జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేటలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాలులో జీఐ గుర్తింపుపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు సీఈవో తేజస్ తెలిపారు. నారాయణపేట చీరలకు భౌగోళిక సూచిక సర్టిఫికెట్ లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని చెప్పారు. జీఐ సాధనకు సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు యజమానులు పాల్గొన్నారు.
JGL: కోరుట్లలో ప్రతిపాదించిన జవహర్ నవోదయ విద్యాలయ కోసం గుర్తించిన స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత బుధవారం పరిశీలించారు. భూమి విస్తీర్ణం, సరిహద్దులు, రహదారి, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల సమన్వయంతో నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపాలని ఆదేశించారు.
NZB : ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శాశ్వత క్రీడా మైదానం కేటాయించాలని జూడా అధ్యక్షుడు డా. కార్తీక్ డిమాండ్ చేశారు. బుధవారం జూనియర్ డాక్టర్లు, మెడికల్ విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాలేజీ స్థాపించి 13 ఏళ్లవుతున్నా గ్రౌండ్ లేకపోవడం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
KNR: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 15,389 మందికి గాను 14,989 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పలు కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
WNP: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా పాల్గల్ మండలానికి చెందిన ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం (E1) విద్యార్థిని బుధవారం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థుల సమాచారంతో అధికారులు ఆమెను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వ్యక్తిగత కారణాలే కారణమని సమాచారం.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఛైర్పర్సన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ ఉద్యోగులతో సమీక్షా సమావేశం జరిగింది. వార్డుల్లో మురికి కాలువల శుభ్రత, దోమల నివారణ ఫాగింగ్, వీధి దీపాల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.