BDK: కూంబింగ్ పేరుతో బలగాలు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, అదే సమయంలో అటవీ సంపద నాశనమవుతోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని తెలిపారు.
MBNR: బాలానగర్ మండలం పెద్దాయపల్లి పరిధిలోని ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 25 వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ సుభాష్ శుక్ల తెలిపారు. శుక్రవారంతో గడువు ముగియడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 5వ తరగతి చదువుతున్న ST విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
NZB: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 5వ తరగతి ప్రవేశ పరీక్ష రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చంద్రిక తెలిపారు. ఆర్మూర్ కేంద్రంలో 504 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, పెన్ను, గుర్తింపు కార్డుతో ఉదయం 9:30 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు.
WNP: విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ప్రణాళికాబద్ధమైన చదువు అవసరమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలంలో గురుకుల విద్యార్థులకు ఆయన మోటివేషన్ తరగతులు నిర్వహించారు. చదువును భారం కాకుండా ఇష్టపడి చదవాలని, లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.
BDK: గార్ల మండలంలో ఇల్లందు నియోజకవర్గ కోరం కనకయ్య పర్యటిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనియాకుల రామారావు శుక్రవారం ప్రకటించారు. ముందుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేస్తారని అన్నారు. అలాగే ITDA నుంచి గిరిజనులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల ప్రాసెసింగ్ను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.
HYD: హుస్సేన్ సాగర్లో ఈరోజు ఉదయం తేలియాడుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని లేక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా మృతదేహం తేలియాడుతుందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి వెలికితీశారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని, మృతదేహాన్ని గుర్తింపు నిమిత్తం గాంధీ మార్చురీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.
WGL: ఎనుమాముల మార్కెట్ యార్డును నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. మిర్చి సీజన్ నేపథ్యంలో మార్కెట్కు పెద్ద సంఖ్యలో వస్తున్న రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులో తాగునీటి సదుపాయం, తగిన షెడ్లు, తూకం ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
SDPT: హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పప్పెట్రీ షోలో సిద్దిపేట జిల్లాకు చెందిన మాధవి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దుబ్బాక మండలం గంభీర్పూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె ప్రదర్శించిన బొమ్మలాట అందరినీ ఆకట్టుకుని రాష్ట్రస్థాయి కన్సోలేషన్ బహుమతిని దక్కించుకుంది. జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి రమేశ్ ఆమెను అభినందించారు.
MDK: ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు.
GDWL: రాజ్యాంగం పట్ల అవగాహనతోనే భావి భారత పౌరులు ఉత్తమంగా ఎదుగుతారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన ఆడపిల్లల చదువు ఆవశ్యకత పోస్టర్, బాలల కోసం భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సైన్స్ ప్రచారం మాత్రమే కాకుండా, సామాజిక అంశాలపై జేవీవీ చూపుతున్న చొరవను అభినందించారు.
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రేలకుంట గ్రామంలో ఇవాళ SDF నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరు కానున్నారు. ఈ విషయాన్ని మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
PDPL: గోదావరిఖని మార్కండేయ కాలనీలో శుక్రవారం ఆస్తి వివాదాలతో చిన్నాన్న కుటుంబంపై దాడి చేసిన రామ్ దూత్ను అరెస్టు చేసినట్లు ACP మడత రమేష్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొంతకాలం నుంచి రామ్ దూత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పక్కనే ఉన్న పిన్ని సుమిత్ర పాన్ షాప్ నుండి సిగరేట్ పొగ వస్తుండడంతో గొడవ జరుగుతుండేది. పథకం పన్ని ప్రణయ్, సుమిత్ర, కొమరమ్మపై కత్తితో పొడిచాడన్నారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలోని జల లింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం భక్తులు శుక్రవారం రూ.50 వేలు వితరణ చేశారు. ఈ నగదును పట్టణ వీర సేవా సంఘం అధ్యక్షుడు శివప్రసాద్కు అందజేశారు. దాతల సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు వీరభద్రప్ప, ప్రకాష్, బుచ్చప్ప తదితరులు పాల్గొని తమ ఉదారతను చాటుకున్నారు.
KMR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం(PTA) నిర్వహించాలని DEO రాజు ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలన్నారు. విద్యార్థుల ప్రగతి, హాజరు శాతంపై టీచర్లు, తలిదండ్రులు చర్చించాలన్నారు. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల పట్ల ఇంటి వద్ద ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా సూచనలు చేయాలన్నారు.
KMR: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గాంధారి మండలానికి చెందిన మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన వెంటనే శిశువు ఏడవకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యంలో శిశువు ఆరోగ్యం క్షీణించింది. సిబ్బంది సమయస్ఫూర్తితో ప్రాథమిక చికిత్స అందించి పసికందును కాపాడినట్లు తెలిపారు.