NLG: అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తోందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మాడ్గులపల్లి మండలం భీమనపల్లిలో నూతనంగా ప్రతిష్టించిన డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతానన్నారు.
VKB: తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, సర్పంచ్ చంద్ర భూపాల్ రావు తెలిపారు. కుల్కచర్ల మండలంలోని ముజాహిద్పూర్ గ్రామంలో తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు బోరు మోటర్ రిపేరు చేయించి ప్రజలకు తాగునీటి సమస్యలను పరిష్కరించారు.
MDCL: అల్వాల్ పట్టణంలోని బతుకమ్మ పార్క్లో ఆదివారం శాఖ సంగమం ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. గోటు కోటు సైకిల్ క్లబ్ అధ్యక్షుడు భోగ విష్ణుమూర్తి, కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని పర్యావరణ హితంగా నిర్వహించినట్లు తెలిపారు. డా. సింధు ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించారు.
MNCL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక విద్య కమిషన్ సిఫారసులను సవరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు విద్యా కమిషన్ను డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యా కమిషన్ సిఫారసులు ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా జీత, భత్యాల గురించి ప్రస్తావించడం దారుణమైన విషయమన్నారు.
KMR: జుక్కల్ మండలం మథుర తాండ మాజీ సర్పంచ్ సంజు మరో 30 మంది కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో ఆదివారం చేరారు. షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, అందుకే ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డోన్గాం సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
WGL: వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన మాజీ MPP రాజిడి అశోక్ రెడ్డి తండ్రి రాజిడి ఇంద్రసేవరెడ్డి అనారోగ్యంతో నిన్న మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న MLA KR నాగరాజు ఇవాళ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.
SRD: పటాన్ చెరు మండలం భానూరు పరిధిలోని కంచర్ల గూడెంలో ఆదివారం జరిగిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి–చిత్తారమ్మ కళ్యాణ మహోత్సవం జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామీణ జాతరలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడతాయని నిర్వాహకులు తెలిపారు.
TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో దారుణం చోటుచేసుకుంది. మనీషా అనే వివాహితను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. మూడు నెలల క్రితం మనీషా-తవీర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు జీవనోపాధి కోసం ఒడిశా నుంచి వచ్చారు. వీరు ఓ ఇటుక బట్టిలో పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NLR: నెల్లూరులో MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు బాల వివాహ ముక్త్ ప్రచార రథాన్ని ఆదివారం ప్రారంభించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 ఏళ్ల లోపు బాలురకు వివాహాలు చేయడం నేరమన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే 1098 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.
BHNG: శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు ఆదివారం రూ.42,96,548 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.15,33,890, VIP దర్శనాలతో రూ.7,20,000, కార్ పార్కింగ్తో రూ.6,11,000, బ్రేక్ దర్శనాలతో రూ.3,72,000, ప్రధాన బుకింగ్లతో రూ.2,28,600, వ్రతాలు రూ.2,16,000 కళ్యాణకట్ట రూ.1,10,000 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది
NDL: నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి బాధిత నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
KKD: కాజులూరు మండలంలో గ్రామీణ రవాణా సౌకర్యాల మెరుగుదలకు రూ.1.43 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు సిమెంట్ రోడ్లకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాలకు మెరుగైన రహదారులు అందించడమే లక్ష్యం అన్నారు.
KNR: ప్రవాస భారతీయులు అందోళన చెందవద్దని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా ఇజ్రాయిల్- ఇరాన్ యుద్దం నేపథ్యంలో గల్ఫ్ దేశాలైన దుబాయి, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తూ ఆందోళన చెందుతున్న ప్రవాస భారతీయులు ఇకపై ఆందోళన చెందనక్కర్లేదన్నారు.
BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని ఆయన తెలిపారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కామ దహన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు ప్రజా పూజ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కామ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం త్రి రాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు కామ దహనం నిర్వహించారు.