JGL: హైదరాబాద్లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28న జరిగే రాష్ట్ర మహిళా న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కోరుట్ల కోర్టు ఆవరణలో సోమవారం కరపత్రాలు, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సదస్సులో భారత న్యాయ వ్యవస్థ, ముఖ్య న్యాయ అంశాలపై మహిళా న్యాయవాదులకు అవగాహన కల్పిస్తారని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గంగాధర్ తెలిపారు.
TPT: శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్మారకార్థం జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ పోటీలు ఫిబ్రవరి 21 నుంచి 27 వరకు కొనసాగనున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి సీనియర్ క్రీడాకారులు పాల్గొని పోటీలు రసవత్తరంగా సాగిస్తున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన బొజ్జల బృందమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు.
SRPT: కోదాడ మండలం నల్లబండ గూడెం గ్రామంలో సోమవారం అనారోగ్యంతో రామారావు మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
WNP: రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులపై తహసీల్దార్ ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మండల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే వారంలోగా జీరో పెండెన్సీ లక్ష్యంతో పని చేయాలని సూచించారు.
NLG: జిల్లా డైట్ కాలేజీలో స్టాఫ్ ట్యూటర్గా జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడికి ‘అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్’ ఇవ్వడాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ) తప్పుబట్టింది. ప్రభుత్వ పోస్టుల్లో స్థానిక సంస్థల ఉపాధ్యాయులను నియమించడం చట్టవిరుద్ధమని, కోర్టు తీర్పులు, సర్వీస్ రూల్స్కు ఇది వ్యతిరేకమని కలెక్టర్కు ఇవాళ ఇచ్చిన వినతిలో పేర్కొన్నారు.
ప్రకాశం: ఈ నెల 25న సీఎం వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. సోమవారం హెలిప్యాడ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పర్యటనను విజయవంతం చేయాలని చర్యలు చేపడుతున్నాయి.
BPT: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషితో పర్చూరు-ఇంకొల్లు ఆర్అండ్బీ రోడ్డు అభివృద్ధి పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. అధికారులతో నిరంతర సమీక్షలు జరిపి, అడ్డంకులను తొలగించడంతో పనులు పట్టాలెక్కాయి. నాణ్యతతో పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఏళ్ల నాటి రోడ్డు సమస్య పరిష్కారం అవుతుండటంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
RR: సాహెబ్ నగర్లో జలమండలి అధికారులను సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దుర్వాసన వెదజల్లుతుందని సమస్యలను వారికి విన్నవించారు. వెంటనే వాటిని శుభ్రపరచాలని, నిలిచిపోయిన పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
CTR: అంగన్వాడీ వర్కర్ల జీతాలను రూ.23 వేలుకు పెంచాలని డిమాండ్ చేస్తూ పులిచెర్ల ఐసీడిఎస్ ప్రాజెక్టు వద్ద టీచర్లు, హెల్పర్లు ధర్నా చేశారు. యూనియన్ నాయకులు సరస్వతి, అలివేలు, మొబీనా మాట్లాడుతూ.. బడ్జెట్లో జీతాల పెంపు చేయాలని కోరారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, పని భారం ఎక్కువగా ఉండటంతో తగిన జీతాలు లేవని తెలిపారు.
కృష్ణా: సత్య సాయి సేవా సంస్థలు యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో సుమారు 300 మందికి పైగా అర్జీదారులకు సాయి ప్రోటీన్ ఫుడ్ను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సత్య సాయి సేవా సంస్థలు స్వచ్ఛందంగా, నిస్వార్థ భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. సమాజ సేవలో యువత ముందుండటం అభినందనీయమన్నారు.
AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో 168 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హరిబాబు అనే పాత నేరస్థుడు రెండు బొలెరో వాహనాలలో ప్రత్యేక అరలు అమర్చి గంజాయి రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సైలు తారకేశ్వరరావు, రిషికేశ్వరరావు ఆధ్వర్యంలో ఐదుగురు నిందితులను పట్టుకున్నారన్నారు.
TG: వికారాబాద్ అనంతగిరిలో తెలుగు రాష్ట్రాల జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులకు శిక్షణ శిబిరం ఇవాళ మూడోరోజు ముగిసింది. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఏఐసీసీ నాయకులు పాల్గొన్నారు. సామాజిక రుగ్మతల పరిష్కారానికి రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు. అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలన్నారు.
MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) నుంచి స్వయం ప్రతిపత్తి (ఆటోనమస్) హోదా మంజూరు కావడం పట్ల జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. హుస్సేన్, అధ్యాపక బృందాన్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
SKLM: రైతు కన్నీరు ఆగాలంటే వంశధార నీరు రావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి హెచ్ ఈశ్వరరావు అన్నారు. కోటబొమ్మాలి మండలం జగన్నాథపురం గ్రామ యువజన సంఘం కార్యాలయంలో సోమవారం కొండపేట లిఫ్టు ఇరిగేషన్ జల సాధన కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మార్చి 4న జల దీక్షలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
TG: మాజీ మంత్రి హరీష్ రావును మన ఊరు-మనబడి కాంట్రక్టర్లు కలిశారు. పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు ఇవ్వాలని అడిగితే కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల ఉసురు తీస్తోందని హరీష్ రావు విమర్శించారు. వెంటనే కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.