VKB: దుద్యాల మండల కేంద్రం నుంచి సాగారంతండా వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులు అసంపూర్తిగా పనులు వదిలివేయడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. కంకర పరిచి వదిలివేయడంతో దుమ్మూధూళి కళ్లల్లో పడి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. దీంతో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.
NRML: కడెం మండలం ఉడుంపూర్ గ్రామాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ సందర్శించారు. వారికి కడం మండల బీజేపీ అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్, గ్రామ పెద్దలు సంప్రదాయ బద్ధంగా గొంగడి వేసి, గొర్రె పిల్లను అందించి ఘన స్వాగతం పలికారు. కడం నుంచి కల్లెడ గ్రామం వరకు ప్రతిపాదిత ఎత్తిపోతల పథకాన్ని ఉడుంపూర్ వరకు విస్తరించి నీటి సరఫరా కల్పించాలన్నారు.
MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధి పడాలపల్లి (11వ వార్డు) యాదవ సంఘం అధ్యక్షుడిగా పెద్దగొల్ల లంబ మల్లేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. పడాలపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎన్నిక కార్యక్రమం చేపట్టారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గండి చిలుక మల్లేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఎన్నిక కార్యక్రమం చేపట్టారు.
NDL: గోస్పాడు మండలం బాబానగర్ వద్ద 18 ఎకరాల్లో నిర్మించిన ‘శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్’ను రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదివారం ప్రారంభించారు. 24వ వార్షికోత్సవం ‘ప్రవాహ్’ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో డా. పి.దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించడమే లక్ష్యమన్ని పేర్కొన్నారు.
SKLM: లావేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం శ్రీకాకుళం లో డయేరియా కేసులపై పరిశీలించేందుకు వచ్చిన ఆమె తిరుగు ప్రయాణంలో అకస్మాత్తుగా లావేరు పీహెచ్సీని సందర్శించారు. స్థానిక కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సేవలను మౌలిక వసతులను స్వయంగా పరిశీలించారు. రోగులకు సరైన సమయంలో సేవలు అందించాలన్నారు.
W.G: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిగా శృంగవృక్షం గ్రామానికి చెందిన సబ్బతి దానియేలు నియమితులయ్యారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదేశాలతో జిల్లా పార్టీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని దానియేలు పేర్కొన్నారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని గాయత్రి మందిరంలో గత 2 రోజులుగా జరుగుతున్న 24 కుండముల గాయత్రి మహా యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో MLA హరీష్ బాబు ఆదివారం పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. గాయత్రి పరివారం గొప్ప ఆధ్యాత్మిక సమూహంగాఎదిగి ప్రజల్లో వైదిక, ఆధ్యాత్మిక సౌరభాలను పెంపొందిస్తుందని తెలియజేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
PPM: అంగన్వాడీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ, స్మార్ట్ఫోన్ల పంపిణీ, మినీ కేంద్రాల అప్గ్రేడ్ వంటి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని ఆమె వెల్లడించారు.
VZM: గజపతినగరం మండలంలోని గుడివాడ నీలగిరి తోటలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన నడిమింటి గాంధీకి చెందిన తోటలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15 వేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది. అజాగ్రత్తగా పొగ త్రాగడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. గజపతినగరం ఆగమాపకం అధికారి రవి ప్రసాద్ సిబ్బందితో వెళ్లి మంటల్లో అదుపు చేశారు.
NLG: ప్రజల హక్కుల కోసం నిరంతర పోరాటమే మార్గమని ఆదర్శంగా నిలిచిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఆదివారం నాడు శ్రీనివాస్ రెడ్డి 44వ వర్ధంతి సందర్భంగా ఆయన స్థూపం వద్ద జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎర్రజెండాలతో ర్యాలీని శ్రీనివాస్ రెడ్డి స్తూపం వరకు నిర్వహించారు.
కోనసీమ: సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో ఇటీవల ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు ను సీజ్ చేశామని జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ లేని క్లీనర్ బస్సు నడపడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బస్సు పర్మిట్ను నెలరోజులపాటు, డ్రైవర్ లైసెన్స్ను మూడు నెలల పాటు రద్దు చేశామన్నారు.
ADB: ఇంద్రవెల్లి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. దనోరా గ్రామ సమీపంలో బైక్పై అతివేగంగా ప్రయాణిస్తున్న బైక్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాద తీవ్రతకు బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక ఉన్న మరో మహిళకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.
ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలోని భూదాన్ భూమిలో ఇల్లు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు వరసగా 4వ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ భోజనాలను సమకూర్చింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం వెలుగుమట్ల బాధితులకు అన్నదానం చేశారు.
NGKL: జిల్లాలో ఓ ప్రైవేట్ గార్డెన్స్లో సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి భారతీయుడి కర్తవ్యమని పేర్కొన్నారు. యువత ధార్మిక చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో స్థానిక నాయకులు, ఆధ్యాత్మిక నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.