BHNG: భువనగిరి 12వ వార్డు పగిడిపల్లిలో గత 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సర్వీస్ రోడ్డు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. కడమంచి రాములు ఇంటి వద్ద ఆగిపోయిన రోడ్డు పనుల గురించి ఆదివారం కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించారు. గ్రామ పెద్దలు, యువత సహకారంతో అడ్డంకులను తొలగించి సర్వీస్ రోడ్డును క్లియర్ చేశారు.
కర్నూలు: ఎనిమిదో వేతన సంఘంనేపథ్యంలో జీతాల పెరుగుదల పై చర్చలు జరుగుతున్న వేళ, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుని 8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్ పేరుతో వాట్సాప్ సందేశాలు పంపుతూ మోసగాళ్లు అమాయక ప్రజలను వలలో వేస్తున్నారన్నారు.
NLG: యూరియా కొరతపై సీపీఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు పొట్టదశలో ఉన్న తరుణంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, సాంకేతిక అవగాహన లేక యాప్ ద్వారా కొనుగోలు చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందికరంగా పరిణమించిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
BHPL: పలిమెల మండలం పంకెన గ్రామ శివారులోని గోదావరి నది తీరంలో అర్ధరాత్రి వేళ భారీ యంత్రాలతో రహస్య తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుగుతుండటంతో గ్రామస్తుల్లో కలకలం రేపుతోంది. ఇది ఇసుక అక్రమ రవాణా కోసమా లేక నిధి అన్వేషణ కోసమా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
SRPT: నడిగూడెంలోని పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984-85 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ కొల్లు పాపయ్య చౌదరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ ఎదుగుదలకు కారణమైన గురువుల విద్యాబోధనను, తల్లిదండ్రుల సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.
W.G: పిల్లలలో సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడానికి మార్చి 1న నరసాపురం బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి పూరిళ్ళ శ్రీనివాస్ తెలిపారు. మార్చి 1న వైఎన్ కాలేజీలో పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, స్పాట్ డ్రాయింగ్, వ్యాసరచన, తెలుగు కథారచన, దేశభక్తి, అభ్యుదయ గీతాలాపన, జానపద నృత్యం, క్లాసికల్ డ్యాన్స్ నిర్వహిస్తామన్నారు
ATP: జిల్లాలో రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు ఎస్పీ పి. జగదీష్ ఆదివారం తెలిపారు. 64 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరిసర ప్రాంతాలను సైలెంట్ జోన్లుగా ప్రకటించామన్నారు. పరీక్ష పత్రాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ASF: కాగజ్ నగర్ ఆదివాసి గిరిజన సంఘం సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ జిల్లాలో తూనికాకు సేకరణ ప్రధాన ఆదాయ వనరని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన టెండర్లను వెంటనే పూర్తి చేసి కొమ్మకొట్టుడు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కట్ట రేటును రూ. 10కు పెంచి, 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బోనస్ బకాయిలు చెల్లించాలన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టుకు భారత బౌలర్లు భారీ షాక్ ఇచ్చారు. ఓపెనర్ డికాక్ను(6) బుమ్రా పెవిలియన్ పంపగా, మార్క్క్రమ్(4)ను అర్ష్దీప్ ఔట్ చేశాడు. దీంతో సఫారీ జట్టు 12 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 3 ఓవర్లలో 19/2 పరుగులు చేసింది. రికల్టన్(7), బ్రెవిస్(1) క్రీజులో ఉన్నారు.
VZM: బొబ్బిలి కుమ్మరివీధిలో నివాసం ఉంటున్న మర్రి మాధవిదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. మాధవి చైతన్య పాఠశాలలో గణితం టీచర్గా పని చేస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా ఆమెను భర్త నరేష్ అనుమానంతో వేధిస్తున్నాడని పేర్కొన్నారు. నీవు చనిపోతేనే దరిద్రం పోతుందని పదే పదే అనడంతో మనస్తాపానికి గురైన మాధవి శనివారం రాత్రి ఉరివేసుకుందని ఆమె తల్లి ఫిర్యాదు చేశారు.
NZB: భీంగల్ పట్టణంలోని గ్రామ దేవత పోచమ్మ ఆలయ అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గం చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ హద్దులు గుర్తించి కాంపౌండ్ వాల్ నిర్మించాలని, భక్తుల సౌకర్యార్థం నల్లాలు ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. అలాగే మొక్కులు తీర్చుకోవడానికి ప్రత్యేక స్థలం, భక్తులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేసి హైందవ ధర్మాన్ని చాటాలన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం వల్లభురావుపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ జ్యోతి ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేరుస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ మహేశ్, పంచాయతీ కార్యదర్శి సుదర్శన్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
AKP: మాడుగుల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. జర్నలిస్టులు వాస్తవాలను వెలికి తీసే విధంగా పని చేయాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
సత్యసాయి: మడకశిర మండలం కల్లుమరి గ్రామంలో మారెమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు సతీమణి ఎం.ఎస్. ఉమాదేవి పాల్గొన్నారు. గ్రామ మహిళలు ఆమెకు ఘనస్వాగతం పలకగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
W.G: పాలకొల్లులోని ప్రధాన కాలువలోకి దశాబ్దాలుగా చెత్తాచెదారం చేరుతోందని, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దిగువ గ్రామాల సర్పంచులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ వదిలేసిన మురుగు పంట కాలువల్లో కలిసి తమ గ్రామాలకు వస్తోందని, తాము విషం తాగుతున్నామంటూ గత మండల సర్వసభ్య సమావేశాల్లోనూ ఆవేదన వ్యక్తం చేశారు.