ASF: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి 15 వరకు పొడిగించాలని వాంకిడి మండల రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ కవితకు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 20తో గడువు ముగియనుండటంతో సమయాన్ని పెంచి అందరికీ న్యాయం చేయాలని కోరారు. మండలంలోని రైతులు పత్తి పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వారు పేర్కొన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎలిగేడులోని ఆయన నివాసంలో ఇటీవల ఎన్నికైన రామగుండం మున్సిపల్ పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగరం మేయర్ మహంకాళి స్వామి డిప్యూటీ మేయర్ ఎల్లయ్య ఎమ్మెల్యేని కలిసి నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
SDPT: కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని MP రఘునందన్ రావు స్పష్టం చేశారు. అక్బర్పేట్ భూంపల్లి మండలం బొప్పాపూర్లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. గ్రామంలో గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలతో పాటు వివిధ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.82 లక్షలు కేటాయించడంతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
TPT: చిట్టమూరు మండలం ఉప్పలమర్తి గ్రామంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పరివార దేవతల నూతన విగ్రహ ప్రతిష్ఠ, మహా కుంభాభిషేక మహోత్సవాలు ఈనెల 23 నుంచి 25 వరకు వైభవంగా జరగనున్నాయి. 23న గ్రామోత్సవం, 24న విశేష పూజలు నిర్వహిస్తారు. 25న మహా కుంభాభిషేకం, అనంతరం శాంతి కళ్యాణం, అన్నదానం జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
BDK: చుంచుపల్లి మండలం NK నగర్ బాదావత్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్ అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలోని సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సత్వరంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇందిరా, ఉప సర్పంచ్ మాలోత్ లక్ష్మి పాల్గొన్నారు.
PPM: గరుగుబిల్లి మండలానికి చెందిన BSF జవాను జయప్రకాశ్ నారాయణ జ్ఞాపకార్థం స్దానిక సీతారామపురంలో గ్రామస్థులు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. IND-BNG సరిహద్దుల్లో దేశ రక్షణ విధుల్లో 2009లో వీరమరణం పొందారని జవానుకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
VZM: ప్రజలు తమ యొక్క విధులు బాధ్యతలను తప్పనిసరిగా తెలుసుకోవాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం బోడసింగిపేట గ్రామంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగంపై పౌరులు అవగాహన కల్పించుకోవాలన్నారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SRD: పుల్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల” పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం పరిశీలించారు. పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.
CTR: రంజాన్ మాసం ప్రారంభం మైన సందర్భంగా పుంగునూరు పట్టణంలో పేద ముస్లింలకు MM మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో నెల రోజులకు సరిపడా నిత్యవసర సరుకులను శుక్రవారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ అందరు సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని 20 సంవత్సరాల నుంచి చేపడుతున్నట్లు తెలిపారు.
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే తిరు కళ్యాణ మహోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. గత 15 ఏళ్లుగా ఆనవాయితీగా ఆయన కుటుంబం వీటిని సమర్పిస్తుంది. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
VZM: కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో గుర్ల మండలం పెద్దబంటుపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం టీచర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
NLG: నకిరేకల్ పట్టణంలోని మొయిన్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ స్వామి ఫర్నీచర్ షాపును ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం ప్రారంభించి, యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన వస్తువులను అందించి వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని సూచించారు. మరి కొంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.
KDP: ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డులోని సినీ హబ్ మలుపు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జీవరత్నం అనే యువకుడు మృతి చెందాడు. ఖాజీపేట మండలం ఏటూరు గ్రామానికి చెందిన జీవరత్నం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.
MDCL: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) మౌలాలి సర్కిల్ నూతన DGMగా విద్యాసాగర్ వాజపేయి నగర్లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం డిఫెన్స్ కాలనీలోని మేనేజర్ కార్యాలయాన్ని సందర్శించగా, HMW మేనేజర్ నవీన్తో పాటు సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.
సత్యసాయి: అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను రాష్ట్ర చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత శుక్రవారం సందర్శించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించి, అందుబాటులో ఉన్న వస్త్రాల స్టాక్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలను సమృద్ధిగా నిల్వ ఉంచాలని మంత్రి ఆదేశించారు.