SKLM: శ్రీకాకుళంలోని డయేరియా కేసులు 76కి చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. బాధితుల కోసం రిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పించారు. ప్రభావిత కాలనీల్లో 50 సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాయి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. తాగునీరు మరిగించి తాగాలని వైద్యులు సూచించారు.
కాకినాడ సాంబమూర్తి నగర్లోని ESI ఆసుపత్రి మంగళవారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా మారింది. సంస్థ 75 వసంతాల వేడుకలతో పాటు దేశంలోని వంద పడకల ఆసుపత్రుల్లో ఉత్తమ సేవలకు గాను రెండో స్థానం దక్కించుకున్న సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి సాధించిన ఈ గుర్తింపు పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ATP: పామిడి పట్టణంలోని ప్రముఖ శైవవక్షేత్రమైన భోగేశ్వరాలయం, లక్ష్మీ చెన్నకేశవ ఆలయాల హుండీ కానుకలు బుధవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో క్రిష్ణయ్య మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి లెక్కింపు ఉంటుందన్నారు. లెక్కింపులో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా పంచ, పైపంచ ధరించి పాల్గొనాలని ఆయన కోరారు.
NLR: వలేటివారిపాలెం – చుండి మధ్య 167బి జాతీయ రహదారి పక్కనే ఉన్న జనార్ధన స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. ఆలయ పక్కన ఉన్న మండపంలో సుమారు 10 అడుగుల లోతున గుంత తీయడం స్థానికంగా కలకలం రేపింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
PPM: మక్కువ మండలం వెంకంపేట వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో డ్రైవర్ ముఖంపై తీవ్ర గాయం కాగా, మరొకరికి ఛాతీ మీద గాయమైంది. వీరు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ..10 కేజీల వెండి, 42 సవర్ల బంగారం, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సత్తెనపల్లి రాకేష్, ఆశీర్వాదంపై గతంలో 34 కేసులు ఉన్నాయని, ఈ కేసులో 8మందిని గుర్తించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
W.G: పాము, కుక్క కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మాట్లాడుతూ.. యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు 420, పాము కాటు వ్యాక్సిన్ 400 అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
PLD: జిల్లాలో సంప్రదాయ వృత్తులతోపాటు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ప్రత్యేక శిక్షణ అందించాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను మంగళవారం ఆదేశించారు. డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఈ సాంకేతికతపై అవగాహన కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, వివిధ సంస్థల సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు.
ASR: దేవవరం, గొడిచెర్ల గ్రామాల్లో అక్రమంగా మద్యం బెల్టుషాపులు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మంగళవారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై సాహిబా అంజుమ్ తెలిపారు. దేవవరంలో 20, గొడిచెర్లలో 9 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు. అక్రమ మద్యం అమ్మకాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.
NTR: విజయవాడలోని కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ లక్ష్మీశా మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అమలవుతున్న జలజీవన్ మిషన్ పనులను అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి, నిరంతర పర్యవేక్షణలో వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి సురక్షితమైన త్రాగునీటి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ, ఇతర అధికారులతో కలిసి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధునికంగా రూపొందించిన 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమాచారంతో కూడిన ఈ క్యాలెండర్లను జిల్లాలోని అన్ని శాఖలకు పంపిణీ చేయాలని కలెక్టర్ సమాచార, పౌర సంబంధాల అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
BPT: పిట్టలవానిపాలెం మండల హైవేలపై ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున ‘ఫేస్ వాష్’ కార్యక్రమం నిర్వహించారు. నిద్రమత్తులో ఉన్న వాహన డ్రైవర్లను ఆపి, వారి ముఖాలు కడిగించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలసట, నిద్ర కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
AKP: జిల్లాలో ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ అప్పారావు నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 125 పరీక్ష రుసుము చెల్లించాలన్నారు ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.
అన్నమయ్య: మదనపల్లి మండలం సీటీఎంలో ఇటుకల బట్టీ కార్మికుడిగా పనిచేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన శివయ్య మంగళవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గంగమ్మ గుడి వద్ద స్పీడ్ బ్రేకర్పై బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివయ్యను స్థానికులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.