సత్యసాయి: నల్లమాడ మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాంతంలో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 4,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ATP: జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించారు. నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రులు ఆదేశించారు.
నెల్లూరు జిల్లా టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వెంకటాచలం పంచాయతీ వడ్డె పాలెం వైసీపీ నేత ఉప్పు రాఘవేంద్రను నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాఘవేంద్రపై దాడి హేయమన్నారు. వెంకటాచలం పంచాయతీలో దాడులు, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయన్నారు.
KKD: గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పిఠాపురం సీఐ శ్రీనివాస్ వాహనాలను అర్ధరాత్రి తనిఖీ చేశారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేపట్టారు. అలాగే “వాష్ & గో” కార్యక్రమం ద్వారా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ, పీయూసీ తదితర పత్రాలను సమగ్రంగా పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచనలు ఇచ్చారు.
E.G: లోక్ అదాలత్లో పెండింగ్ కేసులను రాజీ చేసుకోవాలని తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి ఎం.అనురాధ సూచించారు. మంగళవారం కొవ్వూరు కోర్ట్ హాల్ నుంచి పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని, దీనివల్ల సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు జివిఎల్ సరస్వతి, జి. సాయికృష్ణ, CIలు, SIలు పాల్గొన్నారు.
PLD: పెదకూరపాడు మండలం పొడపాడులో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు. ‘100 రోజులు – 100 గ్రామాలు’ లక్ష్యంతో ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అన్ని శాఖల అధికారులతో కలిసి గ్రామంలోనే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
BPT: అద్దంకి మండలంలో పంటలు సాగు చేసిన రైతులు బుధవారం సాయంత్రం లోగా ఖచ్చితంగా ‘ఈ-క్రాప్’ నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి (AO) వెంకటకృష్ణ సూచించారు. ప్రభుత్వ పథకాలు, పెట్టుబడి సాయం, ఇన్ పుట్ సబ్సిడీ పొందాలంటే ఈ నమోదు తప్పనిసరి. ఇంకా నమోదు చేసుకోని వారు వెంటనే తమ గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.
GNTR: తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్దిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును మంగళవారం ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా ఖండించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా తమకు అన్యాయమే జరిగిందని వారు వాపోయారు. ఈ నెల 27న ఆయేషా అవశేషాలను తిరిగి ఖననం చేస్తామని, ఆ క్షణమే సత్యానికి అంతిమ సంస్కారం జరుగుతుందని వారు ప్రకటించారు.
GNTR: నల్లచెరువు ప్రాంతంలో ఇటీవల వీధికుక్కల దాడిలో గాయపడి జీజీహెచ్ (GGH)లో చికిత్స పొందుతున్న చిన్నారులు ఫణీంద్ర, ఆయాన్లను వైసీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా మంగళవారం రాత్రి పరామర్శించారు.ఆసుపత్రిలో చిన్నారులు అందుతున్న వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన ఆమె, మెరుగైన చికిత్స అందేలా చూడాలని కోరారు.
GNTR: తెనాలి హెడ్ వాటర్ వర్క్స్ మోటార్ రిపేర్ కారణంగా బుధవారం పట్టణంలోని 40 వార్డులకు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. ప్రజలు దీనిని గమనించి ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. గురువారం నుంచి యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని, కావున ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
SKLM: రైతు గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ వర్మ అన్నారు. నందిగాం మండల పరిధిలోని చిన్నలవుని పల్లి, నౌగాం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రాయితీలు పొందేందుకు గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు.
BPT: అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే సాంబశివరావు క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఇసుకదర్శిలోని కార్యాలయంలో, ఇంకొల్లు గ్రామానికి చెందిన షేక్ చాందిని వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.3,02,598 విలువైన ఎల్ఓసీ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
GNTR: జీజీహెచ్లో కుక్కకాటుకు గురై చికిత్స పొందుతున్న చిన్నారులను వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మంగళవారం పరామర్శించారు. నల్లచెరువు వద్ద కుక్కల దాడిలో గాయపడిన ఫణీంద్ర రెడ్డి, షేక్ ఆయన్ల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకు ఆమె ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
PLD: మాచర్ల విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ హఠాన్మరణం చెందిన హుస్సేన్ కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. అందరూ కలిసి సేకరించిన రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మంగళవారం పల్నాడు జిల్లా ఎస్ఈ డాక్టర్ విజయకుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తా మన్నారు.
ప్రకాశం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రకాశం జిల్లా దర్శిలో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.